Sunday, September 30, 2007

తెలంగాణకు లిఫ్ట్‌లంటే... ఆంధ్రకు నీళ్లు దోచిపెట్టడమే Eenadu

వైఎస్‌ది బిత్తిరి సేద్యం నేను కాపలా కుక్కను: కేసీఆర్‌
''తెలంగాణలో తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులన్నీ లిఫ్టులే (ఎత్తిపోతలు). తెలంగాణకు లిఫ్టంటే నీళ్లన్నీ ఆంధ్రకు తెఫ్టే (దోచెయ్యడమే)! అదీ లోగుట్టు. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గజదొంగల్లా కృష్ణా జలాలను ఆంధ్రకు తరలిస్తున్నరు. తెలంగాణకు తుంపర సేద్యమంటూ వైఎస్‌ కొత్తపాట పాడుతున్నడు. ఇక నుంచి ప్రతి నీటిచుక్కా డ్యాం నుంచి నేరుగా మొక్క మొదట్లో పడతదట! అట్ల తెలంగాణలో 50 లక్షల ఎకరాలకు నీరిస్తడట. ఇదీ వైఎస్‌ బిత్తిరి సేద్యం!'' తెరాస అధినేత కేసీఆర్‌ వ్యాఖ్యలివి. ఆదివారం ఇక్కడి తెలంగాణ భవన్లో 22వ విద్యార్థుల శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా కేసీఆర్‌ ప్రసంగించారు. కేసీఆర్‌ ప్రసంగం ఆద్యంతం వారి కేకలు, నినాదాలు, చప్పట్లతో మార్మోగిపోయింది. తెలంగాణలోని అన్ని ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను గెలుచుకుని, తెరాస మద్దతు లేకుండా ప్రభుత్వాలు ఏర్పడలేని రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలని వారికి కేసీఆర్‌ ఉద్బోధించారు. కుక్కకు ఎముకేసినట్టు తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులందరికీ వైఎస్‌ మంత్రి పదవులు, ప్రాజెక్టులు కట్టబెట్టారని కేసీఆర్‌ ఎద్దేవాచేశారు. ''మీ ఊళ్లలో కాంగ్రెస్‌, తెదేపా జెండాలు పట్టుకున్నోళ్లను నిలదియ్యండి. కరెంటు, నీళ్లు ఇవ్వని జెండాలను ఎందుకు మోస్తున్నరని అడగండి. మనం తెలంగాణ అనంగనె జై ఆంధ్ర, జై రాయలసీమ అని బొబ్బలు పెడతరు. శ్రీశైలం ప్రాజెక్టును సీమకు వదిలితేనే హైదరాబాద్‌ను తెలంగాణకు ఇస్తామని రాయలసీమ హక్కుల వేదిక నేత టీజీ వెంకటేశ్‌ అంటున్నడు. హైదరాబాద్‌ను నెత్తిల పెట్టుకుని తెలంగాణకు వచ్చినట్టు మాట్లాడుతున్నడు. ఎన్నికల్లో ఓట్ల యావతో చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నడు. పథకాలు ప్రకటిస్తున్నడు. వీటిని నమ్మొద్దు. తెలంగాణ వ్యాప్తంగా ఆరు లక్షల విద్యార్థులు బలీయశక్తిగా తయారైతే ప్రత్యేక రాష్ట్రాన్ని ఆపడం బ్రహ్మతరం కూడా కాదు'' అని వారికి సూచించారు. చదువులను పాడుచేసుకోకుండా శాంతియుతంగా తెలంగాణ భావవ్యాప్తి చేయాలన్నారు. తెలంగాణ వచ్చాక ఏ పదవీ తీసుకోకుండా తాను కాపలా కుక్కలా ఉంటానన్నారు.
తెరాస గ్రేటర్‌ హైదరాబాద్‌ జిల్లా కమిటీని పార్టీ ఎమ్మెల్యే నాయిని నర్సింహారెడ్డి ఆదివారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే పద్మారావు అధ్యక్షతన 135 మందితో కమిటీ ఏర్పాటైంది.

TCA Telangana libaration Day in California


Monday, September 24, 2007

టీడీఎఫ్‌ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ Eenadu

డల్లాస్‌: తెలంగాణ అభివృద్ధి ఫోరం(టీడీఎఫ్‌) ఆధ్వర్యంలో డల్లాస్‌లోని తెలంగాణ కుటుంబాలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని, బతుకమ్మ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. లేక్‌ లెవిస్‌విల్లే పార్కులో సెప్టెంబరు 22న జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 100 కుటుంబాలు పాల్గొన్నాయి. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. బతుకమ్మలతో పార్కు పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. కార్యక్రమాన్ని భారీ స్థాయిలో చేయడానికి ఇందిరా జానకిరాం, ఉమా కరుణాకర్‌, స్వప్న శ్రీనివాస్‌ సహకరించారు. ఇంతకుముందెన్నడూ లేనివిధంగా అధిక సంఖ్యలో పెద్దలు, చిన్నారులు హాజరయ్యారు. పురుషులు రెండు టీమ్‌లుగా విడిపోయి క్రికెట్‌ ఆడారు. కుతూరు సత్యవతి ఆధ్వర్యంలో మహిళలు బతుకమ్మ పాటలను పాడారు. చిన్నారులకు ఆటల పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం సభ్యులు బతుకమ్మలను చెరువులో వదిలారు.
కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి శ్రీనివాస్‌ కుతూరు, స్వరూప్‌ కుండూరు, కరుణాకర్‌ దాసరి, రామ్‌రెడ్డి, మహేందర్‌, శ్రీకాంత్‌ తదితరులు సహకరించారు. కారక్రమాన్ని జయప్రదం చేసిన వాలంటీర్లకు, స్పాన్సరర్లకు, ఆహుతులకు టీడీఎఫ్‌ కోఆర్డినేటర్లు కృతజ్ఞతలు తెలిపారు.



Wednesday, September 19, 2007

అభివృద్ధి అవినీతిలోనే పార్టీపై 'సమాల్‌' ప్రభావం

గోనె ఆరోపణలు సీఎల్‌పీ కార్యాలయ కుట్ర

రెండో ఎస్సార్సీకి పార్టీ కట్టుబడి లేదు టీఆర్‌సీసీసీలో పదవుల యావ
'న్యూస్‌టుడే' ఇంటర్య్వూలో మధుయాష్కీ


నిజామాబాద్‌, న్యూస్‌టుడే: తెలంగాణ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్‌ అధిష్ఠానానికి రాష్ట్ర నాయకత్వం తప్పుడు సమాచారాన్ని అందిస్తోందని నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు మధుగౌడ్‌ యాష్కీ ఆరోపించారు. తెలంగాణపై కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులను నిలదీయాలని పిలుపునిచ్చిన యాష్కీతో 'న్యూస్‌టుడే' ముఖాముఖి...

ప్రశ్న: సమాల్‌ నివేదిక ప్రభావం ఎలా ఉంటుందంటారు?

జవాబు: ప్రభుత్వంలో పనిచేసిన సీనియర్‌ ఉన్నతాధికారి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రభుత్వం పైన ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉంది. ఈ ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గు తేల్చాలి. ఎదురు దాడి సరి కాదు. సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షిస్తే ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడుతుంది. ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్ళా. పార్టీపైనా దీని ప్రభావం ఉండదనుకోవడం సరికాదు.

ప్ర: పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు?
జ: తెలంగాణపై మాట్లాడితే పార్టీని వ్యతిరేకించినట్లు కాదు. తెలంగాణ విషయంలో రాష్ట్ర నాయకత్వం వాస్తవాలను దాస్తోంది. అధిష్ఠానానికి తప్పుడు సమాచారం ఇస్తోంది. ఇది సరికాదు.

ప్ర: మీ వ్యవహారశైలి పార్టీలో కొంత గందరగోళాన్ని సృష్టిస్తోంది. అసలు మీ వ్యూహం ఏమిటి?

జ: నాకు ఏ వ్యాపారాలూ లేవు. వృత్తిపరంగా నైపుణ్యం చాటుకొన్న తర్వాత ఒక నిబద్ధతతో, నా సామాజిక బాధ్యత గుర్తిస్తూ రాజకీయాల్లోకి వచ్చాను. ఆనాడు నాకు తెరాస, తెదేపా, భాజపాలు టికెట్టు ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. సోనియా స్ఫూర్తితో కాంగ్రెస్‌లో చేరా. ప్రజలను మోసంచేయడం, పార్టీకి వెన్నుపోటు పొడవడం లాంటివి నేను చేయడంలేదు. ప్రజల నిజమైన అభిప్రాయాల్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళుతున్నా.

ప్ర: పార్టీని వీడిపోతారనే ప్రచారం?

జ: కాంగ్రెస్‌లోనే కొనసాగుతా.

ప్ర: ఈసారి మీకు టికెట్టు రాదని, అందుకే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చర్చ?

జ: కుహనా విధేయుల వ్యాఖ్యలివి. పార్టీ క్రమశిక్షణకు లోబడే ఉంటున్నా. నా పనితీరు గుర్తించిన అధిష్ఠానం ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో కీలక బాధ్యతలు అప్పగించింది.

ప్ర: తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ రెండో ఎస్సార్సీకి కట్టుబడి ఉంది. మీరు దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు?

జ: రెండో ఎస్సార్సీకి కట్టుబడి లేదు. కనీస ఉమ్మడి ప్రణాళిక(సి.ఎం.పి)లో చేర్చారు. రాష్ట్రపతి ప్రసంగంలో ఈ అంశాన్ని చేర్చారు. రెండో ఎస్సార్సీ అంటే ఎలా? ప్రైవేటుగా తెలంగాణా కావాలనే వారు అధిష్ఠానం దగ్గరికి వెళ్లినపుడు మాత్రం తప్పుడు సమాచారం ఇస్తున్నారు. తద్వారా ప్రధానికి తప్పుడు సంకేతాలు అందిస్తున్నారు.
ప్ర: టీఆర్‌సీసీసీ ఉన్నా ఇతర వేదికల్లో పాల్గొనడం ఎందుకు?
జ: తెరాస కన్నా ముందే టీఆర్‌సీసీ ఏర్పడింది. ఎన్నికల తర్వాత సీనియర్‌ నాయకులు తెలంగాణ అంశాన్ని విస్మరించారు. పదవుల కోసం, వ్యక్తిగత లాభాలకోసం దీన్ని పక్కన పెట్టారు. గతంలో సీఎంను తీవ్ర పదజాలంతో విమర్శించిన వారే అభివృద్ధి పేరుతో తప్పుదోవ పట్టించారు. తెలంగాణా సాధన కోసం ఏ వేదిక అయినా సరే. కలిసి పోరాడాల్సిందే.
ప్ర: తెలంగాణలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదన్న వాదన వచ్చింది కదా?
జ: అభివృద్ధి ఎక్కడ జరిగింది? అవినీతి అక్రమాల్లోనా? అధిష్ఠానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారు. నిధులెక్కడ ఇస్తున్నారు? తెలంగాణా విశ్వ విద్యాలయమే దీనికి ఉదాహరణ. అభివృద్ధి పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలకువెళ్ళాం. నిజామాబాద్‌ జిల్లాలో తెదేపా కన్నా 10 వేల ఓట్లు తక్కువగా వచ్చాయి. గతం కంటే కొంత మెరుగై ఉండవచ్చు.
ప్ర: ఆర్టీసీ మాజీ ఛైర్మన్‌ గోనె ప్రకాశ్‌రావు మీపై వ్యక్తిగత విమర్శలకు దిగారు?
జ: దీని వెనకాల తెలంగాణను వ్యతిరేకించే లాబీ ఉంది. కాంగ్రెస్‌లోని పెద్దలు, సీఎల్‌పీ కార్యాలయం, మీడియా కో-ఆర్డినేటర్‌ కుట్ర ఉంది. నా నోరు మూయించేందుకు బెదిరింపు ఇది. నా జీవితం తెరచిన పుస్తకమే. మొత్తం వెబ్‌సైట్‌లో ఉంది. దీనిపైనా అధిష్ఠానానికి మొత్తం వివరించాను.
ప్ర: ప్రజాప్రతినిధులను నిలదీయాలని పిలుపునివ్వడం పార్టీ నేతలకు ఆగ్రహం తెప్పించింది కదా?
జ: గత ఎన్నికల్లో ప్రత్యేక రాష్ట్ర అంశంతోనే గెలుపొందాం. ఏ పార్టీ వారైనా తెలంగాణాను ఏమి చేశారని ప్రశ్నించాలని చెప్పా. సామరస్యంగా శాంతియుతంగానే నిలదీయాలని పిలుపునిచ్చా. కేవలం కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులే కాదు, అందరినీ.

Tuesday, September 18, 2007

ఎన్ని ఆటంకాలొచ్చినా భూముల అమ్మకాన్ని ఆపొద్దు Eenadu

హైదరాబాద్‌ అభివృద్ధికే అధిక నిధులు ప్రతిపక్షాల వాదనను తిప్పి కొట్టాలి వనరుల సమీకరణ సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశం
ఆందోళనలు, ఇతరత్రా కార్యక్రమాలద్వారా ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా హైదరాబాద్‌లో భూముల అమ్మకాన్ని ఆపొద్దని, ఈ ప్రక్రియ సత్వరమే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి అధికారులను ఆదేశించారు. భూముల అమ్మకం ద్వారా వచ్చే నిధులను హైదరాబాద్‌ అభివృద్ధికే వెచ్చిస్తున్నామంటూ విస్తృత ప్రచారం చేయడంద్వారా ప్రతిపక్షాల వాదనను తిప్పి కొట్టాలని సూచించారు. ఆర్థిక వనరుల సమీకరణపై ఆయన మంగళవారమిక్కడి సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ఆర్థిక మంత్రి రోశయ్య, పురపాలకశాఖ మంత్రి కోనేరు రంగారావు, వాణిజ్య పన్నులశాఖ మంత్రి కొణతాల రామకృష్ణ, అధికారులు ఇందులో పాల్గొన్నారు. హుడా భూముల అమ్మకాన్ని అడ్డుకునేందుకు తెరాస, ఇతర పార్టీలు చేసిన ఆందోళనను ముఖ్యమంత్రి తప్పుపట్టారు. భూముల అమ్మకంద్వారా వచ్చే ఆదాయాన్నంతా హైదరాబాద్‌కే వెచ్చిస్తున్న విషయాన్ని ఆయా పార్టీలు మరిచిపోతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. మెట్రో రైలుకు రూ.8,500 కోట్లు, ఔటర్‌ రింగ్‌రోడ్డుకు రూ.6,500 కోట్లు, హైదరాబాద్‌లో మురుగునీటి పారుదల వ్యవస్థకు రూ.2,500 కోట్లు, కృష్ణా నీటి సరఫరా రెండోదశకు రూ.వేయి కోట్లు, రేడియల్‌ రోడ్లకు రూ.2,500 కోట్లు, పీవీ నర్సింహారావు ఎలివేటెడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రహదారికి రూ.500 కోట్లు, బలహీనవర్గాల గృహ నిర్మాణానికి రూ.6వేల కోట్ల చొప్పున వచ్చే మూడేళ్లలో రూ.27,500 కోట్లు హైదరాబాద్‌ అభివృద్ధికి వెచ్చిస్తున్నామనే విషయాన్ని ప్రజలకు వివరించాలని అధికారులకు వైఎస్‌ సూచించారు. పదేళ్ల క్రితంతో పోలిస్తే హైదరాబాద్‌ విస్తృతంగా అభివృద్ధి చెందినందువల్లే స్థలాల ధరలు పెరిగాయనే విషయాన్ని ప్రతిపక్ష పార్టీలకు చెప్పాలని ఆదేశించారు. స్థలాల అమ్మకం ప్రక్రియను ముమ్మరం చేసి సకాలంలో లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని సూచించారు.
పన్నులు పెంచం.. కొత్తగా వేయం: రోశయ్య
బడ్జెట్‌లో ప్రకటించిన విధంగా అభివృద్ధి పనులను చేపట్టేందుకు పన్నులు పెంచడం, కొత్తగా పన్నులు విధించడం వంటి ఆలోచనేదీ సర్కారుకు లేదని ఆర్థిక మంత్రి రోశయ్య తెలిపారు. వనరుల సమీకరణ ఆశించిన స్థాయిలో లేకున్నా... ఈనెల కాకున్నా వచ్చే నెలలోనైనా లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. సమీక్ష అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి పనులకు లోటు లేకుండా పూర్తి స్థాయిలో చేపట్టాలంటే నిధులు కావాలని, బడ్జెట్‌లో నిర్దేశించిన పన్నుల వసూలుతోపాటు కేంద్రం నుంచి వచ్చే సాయంద్వారా వనరుల సమీకరణకు ప్రయత్నిస్తున్నామని రోశయ్య వెల్లడించారు.

Sunday, September 9, 2007

ఎస్సార్సీ వద్దు వేస్తే స్వయంకృతాపరాధమే! తెలంగాణ సెంటిమెంటే బలం

ఎన్నికల్లోపు తేల్చకుంటే మునిగిపోతాం
సోనియాను కలిసి చెబుదాం
టీఆర్‌సీసీసీలో ఏకాభిప్రాయం
హైదరాబాద్‌ భూముల ఆదాయం ఇక్కడే ఖర్చుపెట్టాలని తీర్మానం
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
రెండో ఎస్సార్సీ వద్దుగాక వద్దు.. రాష్ట్రమే కావాలి.. గడువు మించిపోతోంది.. ఇంకా ఆలస్యం చేస్తే పార్టీ తీవ్రంగా నష్టపోతుంది.. ప్రజల్లో తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉంది.. దీన్ని తక్కువ అంచనా వేసినా, ఉదాసీనంగా వ్యవహరించినా మునిగిపోవడం ఖాయం.

తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ సమన్వయ సంఘం (టీఆర్‌సీసీసీ) సమావేశంలో వెల్లడైన ఏకాభిప్రాయమిది. కాంగ్రెస్‌ అధిష్ఠానం రెండో ఎస్సార్సీకే కట్టుబడి ఉన్నామని విస్పష్టంగా ప్రకటించిన అనంతరం శనివారం జరిగిన టీఆర్‌సీసీసీ సమావేశం ఆద్యంతం వాడివేడిగా సాగింది. ఎస్సార్సీ వేయడం స్వయంకృతాపరాధమే అవుతుందని ఒకరిద్దరు మినహా దాదాపు సభ్యులంతా అభిప్రాయపడినట్లు తెలిసింది. ఎన్నికలు సమీపిస్తున్నా తెలంగాణపై తేల్చకుండా నాన్చితే ఎన్నికలను ఎలా ఎదుర్కొంటామని పలువురు సభ్యులు ప్రశ్నించారు. ఎస్సార్సీ, అభివృద్ధి అంశాలను కొందరు ప్రస్తావించినా ఇప్పుడు వాటి గురించి చర్చించడం వల్ల ప్రయోజనం లేదని, తెలంగాణ ఇవ్వాలని కోరడమే శ్రేయస్కరమని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. రెండో ఎస్సార్సీని బహిరంగంగా వ్యతిరేకిస్తే అధిష్ఠానం నిర్ణయాన్ని, వర్కింగ్‌ కమిటీ తీర్మానాన్ని వ్యతిరేకించినట్లు అవుతుందని, దీనిపై బహిరంగంగా మాట్లాడకుండా టీఆర్‌సీసీసీ సభ్యులు బృందంగా వెళ్లి సోనియా దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. నిర్ణయాన్ని మాత్రం ఆమెకే వదిలిపెట్టాలని నిశ్చయించారు.
2009 ఎన్నికల్లో తెలంగాణపై నిర్ణయం తీసుకోకుంటే పార్టీకి తీవ్ర ఇబ్బందులు తప్పవని టీఆర్‌సీసీసీ మెజారిటీ సభ్యులు తేల్చి చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా అధిష్ఠానం నిర్ణయం తీసుకుని విస్పష్టమైన ప్రకటన చేయాలని, లేకుంటే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉండదని అభిప్రాయపడ్డారు. సమావేశంలో ఇద్దరు సభ్యులు మినహా హాజరైనవారంతా ఎస్సార్సీతో నిమిత్తం లేకుండా తెలంగాణ ఇవ్వాల్సిందిగా అధిష్ఠానాన్ని కోరాలని ప్రతిపాదించారు.
సుమారు నాలుగు గంటల పాటు జరిగిన సమావేశంలో తెలంగాణకు సంబంధించి ఇతర కీలకాంశాలను చర్చించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలో భూముల అమ్మకంపై ప్రభుత్వ వైఖరిని పలువురు సభ్యులు తప్పుపట్టారు. నిజాం షుగర్స్‌ను స్వాధీనం చేసుకోవడం, తెలంగాణ అభివృద్ధి, 610 జీవో అమలు, పదివేల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ వంటి అంశాలపైనా చర్చించినా.. అధిక సమయం తెలంగాణకే కేటాయించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం రెండో ఎస్సార్సీ వేస్తే తెలంగాణ రాష్ట్రం కోసం రాజ్యాంగబద్ధమైన ప్రక్రియను ప్రారంభించినట్లవుతుందని, అధిష్ఠానం నిర్ణయం కూడా ఇదే అయినపుడు వ్యతిరేకించడం భావ్యం కాదని పీసీసీ కిసాన్‌ సెల్‌ ఛైర్మన్‌ కోదండరెడ్డి ప్రతిపాదించారు. మెజారిటీ సభ్యులు ఆయనతో విభేదించారు. రెండో
ఎస్సార్సీ వూసే ఇప్పుడొద్దని స్పష్టంచేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో యూపీఏ ఎస్సార్సీ వేసే అవకాశాలే లేవని, బీఎస్పీ నాయకురాలు మాయావతి అసలే ఒప్పుకోరని మధు యాష్కీ వ్యాఖ్యానించారు. తెలంగాణ అంశాన్ని తేల్చకుండా ఎన్నికలకు వెళ్తే గత ఎన్నికల నాటి ఫలితాలు తారుమారవుతాయని ఎక్కువ మంది సభ్యులు అన్నారు.

అభివృద్ధితో ఓట్లు సాధిద్దాం: జీవన్‌రెడ్డి

'రెండో ఎస్సార్సీతో నిమిత్తం లేకుండా తెలంగాణ ఇవ్వాలని కోరుతున్నాం.. అధిష్ఠానం తిరస్కరిస్తే మరిన్ని చిక్కుల్లో పడతాం' అని మంత్రి జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. మరేదైనా ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తే మంచిదని సూచించారు. దాని గురించి ఆలోచిస్తే ముందుకు వెళ్లలేమని, ఎలాగైనా తెలంగాణ అంశంపై అధిష్ఠానం నుంచి ప్రకటన వచ్చేందుకు కృషి చేద్దామని సభ్యులు అన్నారు. అభివృద్ధితో ఓట్లు సాధిద్దామని జీవన్‌రెడ్డి అనగా.. కరీంనగర్‌ ఉప ఎన్నికలో అభివృద్ధి ఏమైందని సభ్యులు ప్రశ్నించారు (ఈ ఉపఎన్నికలో జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌ తరపున పోటీచేసి తెరాస అధినేత కేసీఆర్‌ చేతిలో ఓడిపోయారు). అభివృద్ధి కంటే సెంటిమెంటు బలంగా ఉందని పలువురు అన్నారు. అభివృద్ధి అంశం చర్చకు వచ్చినపుడు జీవన్‌రెడ్డి, సీనియర్‌ ఎమ్మెల్యే పీజేఆర్‌ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. 'అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు... ఎక్కడుంది అభివృద్ధి' అని పీజేఆర్‌ అనగా.. తాను కరీంనగర్‌ గురించి మాట్లాడుతున్నానని మంత్రి సమాధానమిచ్చారు.

సెంటిమెంటును కాదంటే అంతే!

కరీంనగర్‌ ఉప ఎన్నిక, సింగరేణి కార్మిక సంఘ ఎన్నికలు, శాసనమండలి ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉన్న విషయాన్ని స్పష్టంగా చూశామని, దీన్ని విస్మరిస్తే ఇబ్బందుల్లో పడతామని వీహెచ్‌, మధు యాష్కీ సహా మరి కొందరు సభ్యులు అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఆంధ్రలోను కాంగ్రెస్‌ గెలుస్తుందని, కేంద్రంలో సోనియాగాంధీ నేతృత్వంలో ప్రభుత్వం రావడానికి తోడ్పడుతుందని వీహెచ్‌ అన్నారు. తెలంగాణను కాదంటే ఈ ప్రాంతంలో గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు తారుమారై తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూరుతుందన్నది గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యేలు ఇంద్రకరణ్‌రెడ్డి, పులివీరన్న తదితరులు వ్యాఖ్యానించారు. టీఆర్‌సీసీసీలో ఉన్న మంత్రులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేరని, ఈ నేపథ్యంలో టీఆర్‌సీసీసీని పునర్‌వ్యవస్థీకరించాలని ఎంపీ సర్వే సత్యనారాయణ అన్నారు. భూముల విక్రయాల అంశాన్ని తెలంగాణ ప్రణాళిక, అభివృద్ది మండలి ఛైర్మన్‌ ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి లేవనెత్తగా.. ఈ అంశంపై వీహెచ్‌, పీజేఆర్‌ మాట్లాడారు. దీంతో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో భూముల విక్రయాల ద్వారా వచ్చే రాబడిని ఇతర ప్రాంతాల అభివృద్ధికి వినియోగించకుండా ఇక్కడే వ్యయం చేయాలని అత్యధిక సభ్యులు అభిప్రాయపడ్డారు. 'అసలు డబ్బులెక్కడ వస్తున్నాయి.. ఎకరం భూమిని ఒక రూపాయికి ఇస్తుంటే' అని పీజేఆర్‌ విమర్శించారు.

అందరి కంటే ముందుంటా: మీరు రాష్ట్రం మొత్తానికి పీసీసీ అధ్యక్షుడు కావడం వల్ల మీకు కొన్ని ఇబ్బందులుంటాయి అని కేశవరావును ఉద్దేశించి సర్వే సత్యనారాయణ అన్నారు. కొందరు తనను శంకిస్తుంటారని, అందరికంటే ఎక్కువగా తెలంగాణ రాష్ట్రం కావాలని కోరేవాడిని తానేనంటూ కేకే స్పందించారు. నేను కొట్లాడినపుడు మీరంతా లేరని వ్యాఖ్యానించి.. తెలంగాణ రాష్ట్రం కోసం అందరికంటే తానే ముందుంటానని చెప్పారు.

Tuesday, September 4, 2007

ఉద్యమానికి పునరంకితమవుదాం Eenadu

కేసీఆర్‌ పిలుపు 'గో బ్యాక్‌' అమర వీరులకు శ్రద్ధాంజలి

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: త్యాగాల పునాదిపై జరిగిన ఆనాటి పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పునరంకితమవ్వాలని తెరాస అధినేత కె.చంద్రశేఖర రావు పిలుపునిచ్చారు. 'ఇడ్లీ సాంబర్‌ గో బ్యాక్‌.. నాన్‌

ముల్కీ గో బ్యాక్‌' ఉద్యమంలో అసువులు బాసిన వారి సంస్మరణార్థం హైదరాబాద్‌లోని గన్‌పార్కులో గల అమరవీరుల స్థూపం వద్ద మంగళవారం తెరాస ఏడు భారీ కొవ్వొత్తులను వెలిగించి శ్రద్ధాంజలి ఘటించింది. నాన్‌ ముల్కీ గో బ్యాక్‌.. జై తెలంగాణ లాంటి నినాదాలు ఈ సందర్భంగా మిన్నంటాయి. కేసీఆర్‌ ప్రసంగిస్తూ.. ఆంధ్ర ప్రాంతం మద్రాసులో అంతర్భాగంగా ఉన్నప్పటి నుంచి తెలంగాణపై వలసవాదుల దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. తెలంగాణను హేళన చేస్తూ అప్పటి మద్రాసు ప్రభుత్వ నేతలు చేసిన ప్రకటనలపై తెలంగాణ విద్యార్థులు 1949లో 'ఇడ్లీ సాంబార్‌ గో బ్యాక్‌.. నాన్‌ ముల్కీ గో బ్యాక్‌' నినాదంతో ఆందోళన ఉద్ధృతం చేశారన్నారు. ఈ సమయంలో సిటీ కాలేజీ వద్ద పోలీసులు కాల్పులు జరిపి ఏడుగురు విద్యార్థులను పొట్టన పెట్టుకున్నారని గుర్తుచేశారు. తెలంగాణ వాదులపై, ఉద్యమకారులపై అవి తొలి పోలీసు కాల్పులన్నారు. ఆ దమననీతి, మోసం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా దేశపతి శ్రీనివాస్‌ జోహారులు.. జోహారులు.. అమవీరులకు జోహారులంటూ గీతాలను ఆలపించి అందరి కర్తవ్యాన్నీ గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో తెరాస ఎమ్మెల్యేలు నాయిని నర్సింహ్మారెడ్డి, పద్మా దేవేందర్‌రెడ్డి, రామలింగారెడ్డి, పార్లమెంట్‌ సభ్యులు రవీంద్రనాథ్‌, ఎమ్మెల్సీలు దిలీప్‌, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Monday, September 3, 2007

తెలంగాణ కోసమే ఎస్సార్సీ వేయాలి Eenadu

ఉప్పునూతల స్పష్టీకరణ తేలిగ్గా చూస్తే ద్రోహం చేసినట్లే: మధు యాష్కీ
తెలంగాణ అంశాన్ని పక్కనబడేసినా, దాని ప్రభావం ఎన్నికలపై ఉండదని తేలిగ్గా తీసేసినా తెలంగాణకు ద్రోహం చేసినట్లేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి, నిజామాబాద్‌ ఎంపీ మధు యాష్కీ అన్నారు. వారు సోమవారం వేర్వేరుగా న్యూస్‌టుడేతో మాట్లాడారు. తెలంగాణ అంశాన్ని రెండో ఎస్సార్సీ ద్వారానే పరిష్కరించాలనుకుంటే ప్రత్యేకంగా దాని కోసమే వేయాలని తెలంగాణ ప్రాంతీయ ప్రణాళిక, అభివృద్ధి బోర్డు ఛైర్మన్‌ అయిన ఉప్పునూతల స్పష్టంచేశారు.



కాలయాపన చేయడం కన్నా.. ఎన్నికలకు ముందే తెలంగాణపై పార్టీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాలన్నారు. తెలంగాణ ప్రభావం ఉండదని తేలిగ్గా తీసిపడేస్తే మాత్రం తెలంగాణకు ద్రోహం చేసినట్లని అన్నారు. టీఆర్‌సీసీసీ సమావేశంలో ఈ అంశాలపై మాట్లాడతానని తెలిపారు. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని, 2009 ఎన్నికల్లోపు కాంగ్రెస్‌ దీనిపై నిర్ణయం తీసుకోవాలని మధు యాష్కీ చెప్పారు. రెండో ఎస్సార్సీ కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఉన్న అంశమే అయినా ఇప్పుడు ఎస్సార్సీ ద్వారా ఫలితాలు రావడం కష్టమని తెలిపారు. ఏకాభిప్రాయం ద్వారా తెలంగాణ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని ప్రకటించిన అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. తెలంగాణ అంశాన్ని తేలిగ్గా తీసేస్తే ద్రోహం చేసిన వాళ్లవుతారని హెచ్చరించారు. టీఆర్‌సీసీసీ విశ్వసనీయత కోల్పోయిందన్నారు. 2004 ఎన్నికలకు ముందు ఏర్పాటైన టీఆర్‌సీసీసీ ఇంకా అప్పటి సభ్యులతోనే కొనసాగుతోందని ఆక్షేపించారు. ఎంపీలుగా ఆహ్వానిస్తే టీఆర్‌సీసీసీ సమావేశానికి వెళ్తానన్నారు.