Thursday, October 25, 2007

మొయిలీకి వీర తెలంగాణ దెబ్బ చూపిస్తం కేసీఆర్‌ Eenadu

నిర్మల్‌, న్యూస్‌టుడే: 'కాంగ్రెస్‌ తన బండారాన్ని తానే బయటపెట్టుకుంది. తెలంగాణ ద్రోహులమని వారే చెప్పుకొంటున్నారు. రెండో ఎస్సార్సీ ఏర్పాటుచేస్తున్నట్లు నమ్మక ద్రోహపు మాటలు మాట్లాడిన వీరప్ప మొయిలీ.. నీకు వీర తెలంగాణ దెబ్బ చూయిస్తం'.. అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్‌రావు నిప్పులు చెరిగారు. గురువారం రాత్రి ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ పట్టణంలో 'ఆదిలాబాద్‌ జిల్లా ప్రజాచైతన్య సదస్సు' పేరిట ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రసంగం యావత్తూ కాంగ్రెస్‌, తెదేపాను దుయ్యబట్టారు. ప్రసంగపాఠం ఆయన మాటల్లోనే..
'50 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల ఉసురు పోసుకుంటున్నరు. నెహ్రూ చెప్పినట్లు భార్యాభర్తల్లా విడిపోదామంటే కాంగ్రెస్‌ అడ్డుపడుతోంది. కాంగ్రెస్‌, తెదేపా రెండూ తెలంగాణను నాశనం చేశాయి. వైఎస్‌ఆర్‌ పాలన స్వర్ణయుగమంటూ మొయిలీ కితాబిచ్చిండు. ఏది స్వర్ణయుగం? దుబాయ్‌ బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. ఆదిలాబాద్‌ జిల్లాలో గిరిజనులు జ్వరాలతో పిట్టల్లా రాలుతున్నరు. 2004 ఎన్నికల్లో నమ్మినం. నమ్మక ద్రోహం చేసిండ్రని వారే చెప్పుకొంటున్నరు. రాష్ట్రంలో ప్రాజెక్టులను ఆధునీకరించి కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తామంటున్నారు. లోయర్‌ పెన్‌గంగ ప్రాజెక్టును ఎందుకు తెరపైకి తేలేదు. 22 ఏళ్ళుగా ఊసులేని మందాకినీ కాలువ ఏమైంది? ఉచిత కరెంట్‌, రూ. 2కే కిలో బియ్యం.. వీటికి మోసపోతే.. భవిష్యత్తులో గోసపడతాం. తెలుగుదేశం, కాంగ్రెస్‌లను భూస్థాపితం చేద్దం' అని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

ఉత్తర కరోలినాలో వైభవంగా దసరా, బతుకమ్మ ఉత్సవాలు Andhra Jyothy

రలీగ్‌, అక్టోబర్‌ 25: దసరా, బతుకమ్మ పండుగలను నార్త్‌ కరోలినా ప్రవాస తెలుగువారు ఘనంగా నిర్వహించుకున్నారు. కార్బ్‌ట్రీ పార్క్‌లో జరిగిన ఈ వేడుకలకు రలీగ్‌, డుర్హమ్‌, కారీ ప్రాంతాల నుంచి వ ందల సంఖ్యలో తెలుగువారు తరలివచ్చారు. ఉదయం మొదలయిన వేడుకలు సూర్యాస్తమయంలోపు ముగిశాయి. ఈ సందర్భంగా పలువురు తెలుగువారు పండుగలతో తమకున్న తియ్యటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
మన సంప్రదాయాలను భవిష్యత్‌ తరాలు మర్చిపోకుండా ఉండేందుకు ఇటువంటి ఉత్సవాలు దోహదపడతాయని కడారు శ్రీలక్ష్మి, రామ్‌ప్రసాద్‌ అన్నారు. ఈ వేడుకల్లో పాల్గొన డం తమకెంతో ఆనందంగా ఉందన్నారు. తనకు తానుగా బతుకమ్మ తయారుచేయడానికి తమ కుమార్తె యుక్తి శ్రీని ప్రోత్సహిస్తామని వారు తెలిపారు. బతుకమ్మ పేరు వింటేనే తాను పులకించిపోతానని మంచినేని రూప అన్నారు.

తమ చిన్నతనంలో బతుకమ్మ ఉత్సవాలను ఉత్సాహంగా నిర్వహించుకునే వారమని, తమ ఇంటిలోనే కాకుండా పొరుగు ఇళ్ళకు కూడా వెళ్ళి బతుకమ్మలను అలంకరించడం మర్చిపోలేమని జలగం లతా నితిన్‌, శుంకు జ్యోతి రవీందర్‌ చెప్పారు. బతుకమ్మ గురించి చెప్పే కథలు ఆశక్తికరంగా వినేవారమని పొదిల సంధ్యా లక్షీనారాయణ అన్నారు. తమ సోదరీమణులు, వారిపిల్లలు అంతా ఒక చోటికి చేరుకుని బతుకమ్మను ఘనంగా నిర్వహించుకునే వారమన్నారు. ఆప్యాయతానుబంధాలు తమ మధ్య వెల్లివిరిస్తుండేవని తెలిపారు. కొత్తబట్టలు ధరించి ఆ తొమ్మిది రోజులూ ఉత్సాహంగా ఉండేవారమని గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
దివ్యశ్రీ వేమారెడ్డి దంపతులు, గోపి, స్వాతి బిరిచెట్టి, రాము, నరేందర్‌, విస్సు శ్రీధర్‌ తదితరులు వేడుకలో నవ్వులు పూయించారు. తెలంగాణా అభివృద్ది సంఘం , ట్రైయాంగిల్‌ ఎన్‌ఆర్‌ఐ తెలుగు అసోసియేషన్‌ తరపున ఆహూతులకు పొదిల లక్షీనారాయణ కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ ప్రవాసులేకాక రాయలసీయ, కోస్తాంధ్ర, కేరళ, తమిళనాడు రాష్ట్రాల ప్రవాస భారతీయులు ఈ వేడుక ల్లో పాలుపంచుకున్నారు. కడారు రామ్‌ప్రసాద్‌ వందన సమర్పణతో వేడుకలు ముగిశాయి.




తెలంగాణపై ఆచి తూచి... Andhra Jyothi

మెయిలీని నిలదీయలేకపోయిన కాంగ్రెస్‌ నేతలు
హైదరాబాద్‌, అక్టోబర్‌ 24 (ఆన్‌లైన్‌): రెండో ఎస్సార్సీ ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమని ప్రకటించి కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్పమొయిలీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆశలపై నీళ్లు చల్లారు. గతంలో ఇదే విధంగా వ్యాఖ్యానించిన దిగ్విజయ్‌సింగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన టీఆర్‌సీసీ నేతలు ఆ స్థాయిలో మొయిలీపై విరుచుకు పడలేకపోయారు. ఆచితూచి మాట్లాడారు. సిద్ధిపేట ఎంపీ సర్వే సత్యనారాయణ ఒక్కరే కాస్త గట్టి స్పందించారు. రెండో ఎస్సార్సీ వేయడం కంటే తెలంగాణ ఇవ్వలేమని చెప్పడమే సమంజసమని ప్ర జలు భావించే అవకాశాలున్నాయని అన్నారు. మొదటి ఎస్సార్సీ వే సేందుకు 23 నెలలు పట్టిందని, రెండో ఎస్సార్సీ వేసేందుకు మరో మూడు సంవత్సరాలు పడుతుందని పేర్కొన్నారు. దీనిని ప్రజలు వి శ్వసించరని అభిప్రాయపడ్డారు.
సీఎల్పీ సమావేశం తర్వాత పలువురు నేతలు విలేకరులతో ఇలా పేర్కొన్నారు. 'ప్రత్యేక తెలంగాణ ఏర్పా టును నేతలే కోరుకుంటున్నారా.... ప్రజలే కావాలంటున్నారా తెలి యాలంటే ఒక కమిషన్‌ ఏర్పాటు చేయాలి. రెండో ఎస్సార్సీనో... ప్రత్యేక కమిషనో ఏదో ఒకటి వేయాల్సిన అవసరమైతే ఉంది' అని కాంగ్రెస్‌ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య అన్నారు. 'తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నారు తప్ప ప్రత్యేక పీసీసీ కాదని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్‌ అభిప్రాయపడ్డారు. అయితే, ప్రత్యేక తెలంగాణ అంశం 2009 ఎన్నికల్లోగా తేల్చాలని కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ కోసం అయితేనే రెండో ఎస్సార్సీ ఆమోదయోగ్యమన్నారు.

Sunday, October 21, 2007

ఢిల్లీని అలరించనున్న బతుకమ్మ Andhra Jyothy

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 20 (ఆన్‌లైన్‌): ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూ ర్తిని ప్రతిబింబిస్తూ, ఆ ప్రాంత ప్రజలు తొలిసారి దేశ రాజధానిలో ఆదివారం పెద్దఎత్తున బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. న్యా యవాది నిరూప్‌ రెడ్డి నేతృత్వాన ఇక్కడ ఏర్పాటైన 'ఢిల్లీ తెలంగాణ సంఘం' తమవైన ఇతర కళారూపాలను కూడా ప్రదర్శించనుంది. 'మా భూమి' ఫేమ్‌ సంధ్యతోబాటు గట్టయ్య, దర్రోజు శ్రీనివాస్‌, ప్రహ్లాద్‌ తదితర కళాకారులు సాంస్క­ృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నకిరేకల్‌, కరీంనగర్‌ల నుంచి ఒగ్గు కళాకారులు, పాశం యాదగిరి నేతృత్వంలో తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి ప్రతినిధులు ఢిల్లీ చేరుకున్నారు. అమెరికాలోని తెలంగాణ వాసులు అక్కడ తమ సంస్క­ృతిని చాటుతున్నప్పుడు ఢిల్లీలో మాత్రం ఎందుకు నిర్వహించకూడదని భావించామని నిరూప్‌ చెప్పారు.

తెలంగాణకు ప్రత్యేక పీసీసీ అవసరం: కేకే Eenadu

హైదరాబాద్‌: తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకంగా పీసీసీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పీసీసీ మాజీ అధ్యక్షుడు కేశవరావు అభిప్రాయపడ్డారు. ఈ నెల 24న రాష్ట్రానికి రానున్న కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి వీరప్ప మొయిలీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని ఆయన చెప్పారు. ఈ విషయంపై చర్చించడానికి టీఆర్‌సీసీ నేతలు కె.ఆర్‌.ఆమోస్‌; పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, నరసారెడ్డి, కమలాకర్‌ తదితరులు ఈరోజు కేకేను కలిశారు. రాష్ట్రంలోని ఇతర రాజకీయ పార్టీలు తెలంగాణ విషయంలో అనుసరిస్తున్న వైఖరి గురించి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీని ఇటీవలే ఢిల్లీలో కలిసి వివరించినట్లు ఆమోస్‌ తెలిపారు. రెండో ఎస్సార్సీతో సంబంధం లేకుండా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. ప్రత్యేక పీసీసీ విషయంలో ఇన్‌ఛార్జి అధ్యక్షుడు జీఎస్‌ రావు చేసిన వ్యాఖ్యలను ఆమోస్‌ తప్పుబట్టారు.

Monday, October 15, 2007

ఎన్నికలే అంతిమయుద్ధం: కేసీఆర్‌ Eenadu

నల్గొండ, భువనగిరి, న్యూస్‌టుడే: తెలంగాణ సమస్యలకు ప్రత్యేక రాష్ట్రమే పరిష్కారం. రాబోయే ఎన్నికలే అంతిమయుద్ధం కావాలి.. జైలుకు వెళ్లద్దు.. లాఠీ దెబ్బలు తినొద్దు.. వ్యాపారాలు, ఉద్యోగాలు మానుకోవద్దు. ఎన్నికలనే వేదికగా చేసుకుందాం. రాజకీయశక్తిగా మనం ఎదగాలని తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా భువనగిరిలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. 100 మంది ఎమ్మెల్యేలు, 15 మంది ఎంపీలు గెలిపిస్తే.. వారే వచ్చి కాళ్లు మొక్కి తెలంగాణ రాసిస్తారు. జార్ఖండ్‌ బాటలో రాష్ట్రాన్ని సాధించుకుందాం. జెండా రాజకీయాలు, కాంట్రాక్టులతో గొడవలు పెడుతున్నారు. జెండాలు ఏం ఇచ్చాయి. అంతా మోసం చేస్తున్నాయి. ఎందుకు.. ఎవరికోసం జెండాలు మోస్తారని ప్రశ్నించారు. పోతిరెడ్డి పాడు తరలించారు. మూసీ ప్రక్షాళన మరిచిపోయారు. నిధుల ఊసులేదు. నిమ్స్‌ యూనివర్సిటీ రాలేదు. ఫ్లోరైడ్‌ భూతం 2 లక్షల మందిని వృద్ధులుగా మార్చేసింది. ఈ జెండాలు, పార్టీల మత్తు వదలి.. మన జెండా పట్టండి. మళ్లీ ఎన్నికల వలలో పడి మోసపోకండని హితవు పలికారు. చంద్రబాబు 9గంటల ఉచితవిద్యుత్తు, వై.ఎస్‌. రెండు రూపాయల కిలోబియ్యం పథకం అంటూ మళ్లీ మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. సింగరేణి బొగ్గు మనది.. గోదావరి నీళ్లు మనవి. ఎన్‌టీపీసీకి ఇచ్చే నీరు, బొగ్గుతో 12 గంటలు ఉచిత విద్యుత్తు మనమే ఇచ్చుకుందాం. ఓట్లు మందికేసి బతకొద్దు. యాచించే స్థితిని నుంచి శాసించే స్థాయికి ఎదగాలని కోరారు. తెదేపా, కాంగ్రెస్‌ దొందు దొందేనని.. జెండాలు వేరైనా ఇద్దరి ఎజెండా ఒకటే. తెలంగాణకు అభివృద్ధిలో పెద్దపీటని మరోసారి మోసం చేస్తున్నారన్నారు. 610 జీవో అమలు విషయంలో ఇద్దరూ నాటకాలాడుతున్నారు. ఏ పార్టీ కూడా చేయదు. జీవో 34తో నీరివ్వమని చెప్పేశారు. కాలువ తవ్వి ఎకరాకు నీరిస్తే రూ.1300 ఖర్చయితే.. తుంపర సేద్యానికి రూ.53వేలు అవుతాయి. 50లక్షల ఎకరాల నీరిస్తామని చెప్పేవి మాటలే. చంద్రబాబు, వై.ఎస్‌.లకు దగ్గరి పోలికలున్నాయని.. రైతు ఆత్మహత్యలు, బూటకపు ఎన్‌కౌంటర్లు, చేనేత కూలీల ఆకలిచావులు, మహబూబ్‌నగర్‌ వలసలు ఆగడం లేదు. సాగునీరు అందదు. ఫ్లోరైడ్‌ భూతం వదిలించరు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎందుకు నోరు విప్పడంలేదు. సీఎం మెడలు వంచండని డిమాండ్‌ చేశారు.

Thursday, October 4, 2007

వాషింగ్టన్‌లో ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు Eenadu

వాషింగ్టన్‌: అమెరికా రాజధాని వాషింగ్టన్‌ నగరంలో తెలంగాణ ప్రజలు బతుకమ్మ పండగను ఎంతో భక్తిప్రపత్తులతో జరుపుకున్నారు. తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో దాదాపు 400మందికి పైగా తెలంగాణవాసులు పాల్గొనడం విశేషం. రాజేశ్‌ బాదం స్వాగతోపన్యాసంతో కార్యక్రమం ప్రారంభమయింది. అనంతరం తెలంగాణ సంప్రదాయ రుచులతో కూడిన భోజనాన్ని అతిథులకు వడ్డించారు. తరువాత జరిగిన ఆటపాటల్లో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
రంగురంగుల బతుకమ్మలు...
మహిళలు సంప్రదాయ వస్త్రధారణతో తమతో తీసుకు వచ్చిన బతుకమ్మలపై రంగురంగుల పూలను దానిపై ఉంచి సంప్రదాయబద్ధంగా గానం చేశారు. దాదాపు రెండు గంటల సేపు జరిగిన ఈ వేడుక తెలంగాణ పల్లె జీవితాన్ని అమెరికాలో సాక్షాత్కరించింది. త్రిశ సంకినేని భరతనాట్యపదర్శన అందర్ని ఆకర్షించింది. సూర్యాస్తమయం సమయంలో బతుకమ్మలను నిమజ్జనం చేసి సత్తుపిండిని అందరికి పంచారు. ఆచార్య సవితానంద అవథూత ధ్యానంపై ఉపన్యాసమిచ్చారు. టీడీఎఫ్‌ చేపడుతున్న కార్యక్రమాల గురించి సంస్థ సమన్వయకర్త రాజేశ్‌ మాదిరెడ్డి సభికులకు వివరించారు. రవి పులి వందనసమర్పణతో కార్యక్రమం ముగిసింది. కళ్యాన్‌ ముద్దసాని, రమాకాంత్‌ పీచర, రాజేశ్‌ బాదం, సతీష్‌ మేదవరపు. అమర్‌ జన్నుపురెడ్డి. చంద్ర కంచర్ల, వెంకట్‌ రెడ్డి, అచ్యుత్‌ చుక్క, దీపక్‌ దేశ్‌పాండే, రాజేశ్‌ మాదిరెడ్డి, విష్ణు యాచమనేని, గీతా మేదవరపు, అరవింద ఎడ, శ్వేత, సుశీల... తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

కేసీఆర్‌ చరిత్రలో కలిసిపోతావ్‌ : పీసీసీ Andhra Jyothy

హైదరాబాద్‌, అక్టోబర్‌ 4(ఆన్‌లైన్‌): కాంగ్రెస్‌ పార్టీని.. ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని నోటికి వచ్చినట్లు విమర్శిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు చరిత్రలో కలసిపోవడం ఖాయమని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ జోస్యం చెప్పింది. గాంధీభవన్‌లో గురువారం పీసీసీ అధికార ప్రతినిధి ఎన్‌.తులసిరెడ్డి, కిసాన్‌సెల్‌ అధ్యక్షుడు ఎం.కోదండ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ప్రతిసారి కాంగ్రెస్‌పార్టీని, వై ఎస్‌ను కేసీఆర్‌ దుర్భాషలాడడం గర్హనీయమని కోదండ రెడ్డి పేర్కొన్నారు. వాపును చూసి బలుపుగా టీఆర్‌ఎస్‌ భావిస్తోందని.. కరీంనగర్‌ పార్లమెంటు ఉప ఎన్నికను తెలంగాణ ఏకాభిప్రాయంగా భావించడానికి వీల్లేదని.. ఇదే ఎన్నికల్లో జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్‌లో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు మొదటి రెండు స్థానాల్లో నిలిస్తే.. టీఆర్‌ఎస్‌ మూడో స్థానంలో ఎందుకు నిలిచిందని కోదండ రెడ్డి ప్రశ్నించారు.
టీఆర్‌ఎస్‌ పార్టీ కుటుంబ పాలనగా మారిందని.. ఎక్కడ చూసినా కేసీఆర్‌, ఆయన కుమారుడు, అల్లుడుల ఫోటోలే కన్పిస్తున్నాయి తప్పితే.. మరో నాయకుడికి తగిన గుర్తింపే లేదని చెప్పారు. గోధమతో సమానంగా.. లేదా.. అంతకంటే ఎక్కువ మద్ధతు ధరను వరికి ప్రకటించాలని తులసిరెడ్డి కేంద్రాన్ని కోరారు. వ్యవసాయం దండగ మారిదని భావించిన చంద్రబాబు పాలనలో వరికీ, గోధమకు మధ్య మద్ధతు ధరలో వ్యత్యాసం నెలకొందని చెప్పారు. 1994-95లో ఈరెండింటికీ మద్ధతు ధర 360 రూపాయలుంటే.. 2003-04లో గోధుమకు 630 రూపాయలు లభిస్తే.. వరికి మాత్రం 580 దక్కిందని చెప్పారు. ఈ వ్యత్యాసంపై ఆనాడే నిరసన తెలిపి ఉంటే.. ఈ రోజు ఈ విధానం కొనసాగేది కాదని ఆయన పేర్కొన్నారు.

Wednesday, October 3, 2007

దుబాయి.. ముంబయి.. బొగ్గుబావే! Eenadu

సమైక్యాంధ్రలో తెలంగాణ ప్రజల బతుకులు..

దుబాయి.. ముంబయి.. బొగ్గుబావే!

వైఎస్‌, చంద్రబాబు రాజకీయ బేహారులు

పొత్తులుండవ్‌, ఒంటరిగానే పోటీచేస్తాం

తెలంగాణ వస్తే ఉపముఖ్యమంత్రి ముస్లిమే:

కేసీఆర్‌

'స్వాతంత్య్రం వచ్చే నాటికి దేశంలో అధికశాతం రాష్ట్రాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతే తెలంగాణా (హైదరాబాద్‌ రాష్ట్రం) రూ.63కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉంది. సమైక్యాంధ్ర ఏర్పడ్డాక, వలస పాలకుల దోపిడీతో తెలంగాణా సంక్షోభంలో కూరుకుపోయింది. అంటే తెలంగాణా వెనుకబడ్డది కాదు.. వెనకవేయబడ్డది'. 'తెలంగాణా రాష్ట్రం ఏర్పాటయ్యాక ముస్లింలకు డిప్యూటీ సీఎంతోపాటూ.. నాలుగు మంత్రి పదవులు ఇస్తాం. ఒక లోక్‌సభ, మరొక రాజ్యసభ స్థానాలను కేటాయిస్తాం. విద్యా, ఉద్యోగాల్లో 12శాతం రిజర్వేషన్లను కల్పిస్తాం'.
- కేసీఆర్‌

కరీంనగర్‌ - న్యూస్‌టుడే
మధ్యంతర ఎన్నికల ఉరిమిపాటుతో ప్రజల వద్దకు వెళ్లేందుకు మొహం చెల్లక సీఎం వైఎస్‌, తెదేపా అధినేత చంద్రబాబులు జనాకర్షక మంత్రాలను జపిస్తున్నారని తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు విమర్శించారు. కరీంనగర్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 'తెలంగాణా ద్రోహుల పార్టీకి అధ్యక్షుడు చంద్రబాబు.. నమ్మక ద్రోహులపార్టీకి చెందిన సీఎం వైఎస్‌లకు తెలంగాణాలో తిరిగే హక్కే లేద'ని పేర్కొన్నారు. వీరిద్దరూ రాజకీయ వ్యాపారులని ఆరోపించారు. 'రూ.రెండుకే కిలో బియ్యం ఇస్తామని వైఎస్‌ చెబుతున్నారు. మూడున్నరేళ్లుగా ఆయన ఏం చేశారు. పేదలు ఇప్పుడే గుర్తుకొచ్చారా. ఇది ఎన్నికల గిమ్మిక్కుకాదా'ని కేసీఆర్‌నిలదీశారు. వైఎస్‌ ముఖ్యమంత్రిగా పగ్గాలు స్వీకరించాక ఉచితవిద్యుత్తు ఫైలుపై సంతకం పెడితే..అది ఉత్త విద్యుత్తుగానే మిగిలిపోయిందని విమర్శించారు. 'తొమ్మిదేళ్లు సీఎంగా ఊరేగిన చంద్రబాబు.. సేద్యమే దండగన్నడు. విద్యుత్తు బిల్లులు కట్టని రైతులపై కేసులు పెట్టి.. జైళ్లలో తోయించిండ'ని మండిపడ్డారు. 'వైఎస్‌.. చంద్రబాబులు దొందూ దొందే. ఫార్ములావన్‌, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌కు తెలంగాణా భూములను చంద్రబాబు అప్పగిస్తే.. ల్యాంకో, టాటా, బిర్లా, అంబానీలకు వైఎస్‌ తెగనమ్ముతున్నరు' అని దుయ్యబట్టారు. 'చంద్రబాబు, వైఎస్‌ల పాలనలో తెలంగాణ ప్రజల బతుకులు, దుబాయి ముంబయి బొగ్గుబాయిగా మారాయ'ని ఆవేదన వ్యక్తంచేశారు. 'స్వంత పాలనలో తెలంగాణాలో బతుకులు బంగారం అవుతాయి. తెలంగాణా ప్రజలు దీన్ని గుర్తించాల'ని సూచించారు.
బోగస్‌ యజ్ఞం: 'వైఎస్‌ చేస్తున్న జలయజ్ఞం.. ఒట్టి బోగస్‌. తెలంగాణాలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ ఎత్తిపోతల పథకాలే. వాటిని నడపడానికి 2500 మెగావాట్ల విద్యుత్తు అవసరం. ఇప్పుడు సేద్యానికి ఏడు గంటలని చెప్పి.. ఐదుగంటలు కూడా ఇస్తలేరు. ఇక ఎత్తిపోతల పథకాలకు విద్యుత్తును ఎక్కడనుంచి తెస్తారు? ఈ ప్రాజెక్టులు చేపట్టింది తెలంగాణాకు నీళ్లిచ్చేందుకుకాదు. కాంట్రాక్టర్ల నుంచి పర్శంటేజీలు దండుకునేందుకే' అని కేసీఆర్‌ విమర్శించారు. 'మధ్యంతర ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవు.. తెరాస ఒంటరిగానే పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. వారి అభీష్టం మేరకే ఒంటరిగానే బరిలోకి దిగుతామ'ని చెప్పారు.


నల్లగొండ వర్సిటీ పేరు మార్చాలని Andhra Jyothy

ఓయులో తెలంగాణ విద్యార్థుల ర్యాలీ
హైదరాబాద్‌, అక్టోబర్‌ 3 (ఆన్‌లైన్‌) : తెలంగాణ ప్రాంతాల్లో అనేక పోరా టాల ద్వారా సాధించుకున్న నల్గొండ యూనివర్సిటీకి తెలంగాణ మేధావుల, కవుల, నాయకుల పేర్లు పెట్టకుండా ఈ ప్రాంత వాసులను అవమానపరుస్తు న్నారంటూ తెలంగాణ విద్యార్థి సంఘం, తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభా గం నాయకులు బుధవారం ఉస్మానియా యూనివర్సిటీలో తరగతులను బహి ష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఇది మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానపర్చడమేనని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అంతర్జా తీయంగా ఎంతో ఖ్యాతి గతించిన మహాత్మా గాంధీపేరు అంతర్జాతీయ, జాతీ య సంస్థలకు పెడితే తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఒక స్థానిక యూనివర్సి టీకి ఆయన పేరు పెట్టడం సమంజసమేనా అని విద్యార్థి సంఘాలు ప్రశ్నించా యి. ఇటీవల ఆంధ్రా, సీమ ప్రాంతాల్లోని వర్సిటీలకు అక్కడి కవుల, రాజుల పేర్లను పెట్టిన పాలకులు తెలంగాణ విషయం వచ్చేసరికి ఆ ఆనవాయితీని విస్మరిస్తున్నారని వారు పేర్కొన్నారు.ప్రభుత్వం స్పందించి యూనివర్సిటీ పేరు మార్చకుంటే పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు.

Monday, October 1, 2007

చికాగోలో ఘనంగా 'బతుకమ్మ' Andhra Jyothy

చికాగో, సెప్టెంబర్‌ 29: సంప్రదాయ 'బతుకమ్మ' పండగను తెలంగాణా ఎన్నారైలు చికాగోలో ఇటీవల ఘనంగా జరుపుకున్నారు. ఉత్తర అమెరికా బతుకమ్మ పండగ ఐదవ వార్షికోత్సవాలను పురస్కరించుకుని వారు ఈ పండుగను జరుపుకున్నారు. సాంప్రదాయబద్ధంగా జరిగిన ఈ ఉత్సవానికి తెలంగాణా ప్రవాసులు అధిక సంఖ్యలో హజరయ్యారు. చిన్నాపెద్ద భేదం లేకుండా అన్ని వయస్సుల వారు బ్లూమింగ్టన్‌, విస్‌కాన్‌సిన్‌, ఇండియానా తదితర ప్రాతాలనుంచి విచ్చేసి బతుకమ్మ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.


ఆ రోజు ఉదయాన్నే లేచి బతుకమ్మ పండగకు సహజసిద్దమైన గునుగు పూలు, తంగేడు పూలు, బీర పూలు సేకరించారు. బతుకమ్మ పూలు అందుబాటులో లేనివారు స్థానికంగా లభించే పూలుతో బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఉదయం పది గంటల సమయంలో ప్రారంభమైన బతుకమ్మ విహారయాత్రలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ నిరంజన్‌ అల్లంనేని స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరూ తామకు తాము పరిచయం చేసుకున్నారు. తర్వాత వారంతా శ్రీనివాస్‌ రెడ్డి సిరికొండ, ప్రదీప్‌ దమిడిలు నిర్వహించిన వివిధ ఆటల్లో పాలుపంచుకున్నారు.

సంప్రదాయ తెలంగాణ వంటకాలతో మధ్యాహ్న భోజనం ఆరగించారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆడారు. రకరకాలైన పూలతో అలంకరించిన బతుకమ్మలను మధ్యలో ఉంచి వాటి చుట్టూ చేరి నాట్యం చే స్తూ 'బతుకమ్మ బతుకమ్మ ఊయ్యాలో' వంటి పాటలు పాడుతూ భక్తిపారవశ్యంలో తేలియాడారు. అనంతరం బతుకమ్మలను సమీపంలోని సరస్సులో నిమజ్జనం చేశారు.
బతుకమ్మ ఉత్సవాలు పూర్తయిన తర్వాత అందరూ సద్దులు పంచుకున్నారు. ఆటల్లో గెలుపొందిన వారికి వెంకట్‌ ఆర్‌ తుడి బహుమతులు అందజేశారు. ఎంపిక చేసిన 'ఉత్తమ బతుకమ్మ'కు శ్రీధర్‌ లోకా ప్రత్యేక బహుమతిని అందజేశారు. బతురమ్మను ఘనంగా నిర్వహించడంలో శ్రీనివాస్‌ రెడ్డి సిరికొండ, అశోక్‌ ముద్రకోళ్ల, ఉష ముద్రకోళ్ల, ప్రదీప్‌ దమిడి తమ వంతు సాయం చేశారు. నిరంజన్‌ అల్లంనేని ధన్యవాదాలు తెల్పుతూ వందన సమర్ఫణ చేయడంతో కార్యక్రమం ముగిసింది.