Wednesday, April 30, 2008

11న కేసీఆర్‌ నామినేషన్‌!

11న కేసీఆర్‌ నామినేషన్‌!

అదేరోజు ప్రచారానికి శ్రీకారం....

తెరాస పురిటిగడ్డ కరీంనగర్‌. కష్టకాలంలో ఆ పార్టీకి వెన్నంటి నిలుస్తున్న జిల్లా. ఎన్నికల ప్రచారాన్ని కరీంనగర్‌ నుంచి ప్రారంభిస్తే.. కలిసొస్తుంది అన్నది కేసీఆర్‌ నమ్మిక. ఆ క్రమంలో ఉప ఎన్నికల ప్రచారాన్ని కరీంనగర్‌ కేంద్రంగా నిర్వహించడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు.
కరీంనగర్‌, న్యూస్‌టుడే: కరీంనగర్‌ను కేంద్రంగా చేసుకొని ఉప ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించాలని తెరాస అధినేత కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఉప ఎన్నికల్లో..తన రాజీనామాతో ఖాళీ అయిన కరీంనగర్‌ లోక్‌సభ స్థానం నుంచే ఆయన బరిలోకి దిగనున్నారు. కేసీఆర్‌ తన నామినేషన్‌ను మే 11న దాఖలు చేసి... తర్వాత కరీంనగర్‌ నుంచే ప్రచారభేరిని మోగించనున్నారు. ఉపఎన్నికలు జరిగే శాసనసభ, 4 లోక్‌సభ స్థానాల్లో.. ఉత్తర తెలంగాణ పరిధిలోనే నాలుగు లోక్‌సభ, ఎనిమిది శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. తెలంగాణలో ఉపఎన్నికలు జరిగే తక్కిన తొమ్మిది నియోజకవర్గాల్లో మూడు మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఒకటి, రంగారెడ్డి జిల్లాలో ఒకటి, నల్గొండ జిల్లాలో ఒకటి, మూడు హైదరాబాద్‌ నగరం పరిధిలోకి వస్తాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల పరిధిలోనే అధికంగా నియోజకవర్గాలు ఉండటం, భౌగోళికంగా ఆ ప్రాంతాలకు కరీంనగర్‌ చేరువగా ఉండటం- ఎన్నికల ప్రచారానికి కేసీఆర్‌ కరీంగనర్‌ను కేంద్రంగా చేసుకోవడానికి దారితీసింది.. ఇక పార్టీ ఆవిర్భావం నుంచి, కష్టకాలంలో తెరాస వెన్నంటి జిల్లా ప్రజలు నిలుస్తుండటం, ప్రచారాన్ని కరీంనగర్‌ నుంచి ప్రారంభిస్తే కలిసొస్తుందని కేసీఆర్‌ విశ్వసిస్తుండటం అందుకు పరోక్షంగా దోహదపడింది. మేడారం, కమలాపూర్‌, హుజూరాబాద్‌ నియోజకవర్గాల్లో రెండ్రోజులు, కరీంగనగర్‌ లోక్‌సభ స్థానం పరిధిలో రెండ్రోజులపాటూ రెండు విడతల్లో కేసీఆర్‌ ప్రచారాన్ని నిర్వహిస్తారని తెరాస వర్గాలు వెల్లడించాయి. ఇక ప్రచారంలో త్రిముఖ వ్యూహాన్ని అనుసరించాలని నిర్ణయించారు. నామినేషన్ల ఘట్టానికి తెరలేయడంతోనే- ఇదివరకే శిక్షణ ఇచ్చిన విద్యార్థులను బృందాలుగా విభజించి గ్రామాల్లోకి పంపడానికి ఏర్పాట్లను పూర్తి చేశారు. తెరాస సాంస్కృతిక విభాగంలోని కళాకారులను బృందాలుగా విభజించి.. ఉప ఎన్నికలు జరిగే అన్ని మండల కేంద్రాలు, మేజర్‌ పంచాయతీల్లో 'తెలంగాణ ధూంధాం'లు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మండలాల్లోని నేతలను మూడు బృందాలుగా విభజించి.. ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ప్రచారం ముగిసే నాటికి.. ఒక్కో ఇంటిని కనీసం మూడుసార్లు చుట్టి రావాలన్నది తెరాస నేతల వ్యూహం. ప్రచారంలో సెంటిమెంటును రగల్చడమే ధ్యేయంగా తెరాస బృందాలు పనిచేసేలా వారికి శిక్షణ ఇచ్చారు. వీటికి తోడు నాలుగేళ్ల వైఎస్‌ పాలనలో తెలంగాణ కేటాయించిన నిధులు, ఆదాయం వివరాలతో కూడిన సాహిత్యాన్ని పంపిణీ చేయడానికి రంగం సిద్ధం చేశారు.