Monday, August 13, 2007

త్వరలో మరికొందరు కానిస్టేబుళ్ళ బదిలీ

కొత్త గడువు సెప్టెంబరు: జానారెడ్డి
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: పోలీసుశాఖలో 610 జీవో అమలులో భాగంగా త్వరలో మరికొందరు కానిస్టేబుళ్ళను స్వస్థలాలకు పంపుతున్నట్లు హోంమంత్రి జానారెడ్డి తెలిపారు. కొత్తగా ఎంపికైన సుమారు 2700 మంది కానిస్టేబుళ్ళను ఈ నెలఖారులోపు నియమించే అవకాశం ఉన్నందున ఆమేరకు స్థానికేతరులను బదిలీ చేస్తామన్నారు. 610 జీవోపై సోమవారం ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. ఇందులో జానారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నిశాఖల్లో కలిపి 8718 మంది స్థానికేతరులు ఉన్నట్లు గుర్తించగా వారిలో 958 మందిని ఇప్పటికే స్వస్థలాలకు పంపామని చెప్పారు. సెప్టెంబరు చివరినాటికి అన్నిశాఖల్లోనూ స్థానికేతరుల బదిలీ ప్రక్రియ పూర్తిచేస్తామని తెలిపారు. ముందు బదిలీ చేసి అవసరమైతే మళ్ళీ డిప్యూటేషన్లపై తీసుకుంటామని, కొత్తవారు చేరగానే ఈ డిప్యుటేషన్లు రద్దు చేస్తామని హోంమంత్రి జానారెడ్డి వివరించారు