Friday, June 29, 2007

పంపుతున్నది పిడికెడే ఇంకా గంపెడున్నారు! eenadu

ముందుంది ముసళ్లపండుగ

సచార్‌ నివేదికను అమలు చేయాలి

కేబీఆర్‌ పార్కు పేరు మార్చేస్తాం

జీవో 34పై అఖిలపక్షం: కేసీఆర్‌

హైదరాబాద్‌ - న్యూస్‌టుడే

జీవో 610 అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పంపించ తలపెట్టిన స్థానికేతరుల సంఖ్య పిడికెడేనని తెరాస అధినేత కె.చంద్రశేఖరరావు అన్నారు. ఇంకా గంపెడంత మందిని పంపాల్సి ఉందని తెలిపారు. 'ముందుంది ముసళ్ల పండుగ' అని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ''సచివాలయం సహా అన్ని శాఖల ఉద్యోగాల్లోనూ తెలంగాణకు సహజ వాటా కావాల్సిందే. తెలంగాణకు పెద్దపీట అంటున్న వైఎస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో వీలైనంత అన్యాయం చేస్తోంది'' అని విమర్శించారు. హైదరాబాద్‌లోని హార్టికల్చర్‌ కళాశాలలో అడ్మిషన్లు ఇవ్వద్దంటూ జారీ చేసిన జీవో 134ను తక్షణం ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు. ''సంబంధిత బోర్డు అనుమతి కూడా తీసుకోకుండానే హార్టికల్చర్‌ కళాశాలలో అడ్మిషన్లు ఎత్తేస్తున్నారు. బదులుగా రాయలసీమలో, మహబూబ్‌నగర్లో ఒక్కో కళాశాల చొప్పున ఏర్పాటు చేస్తామంటున్నారు. కడప విశ్వవిద్యాలయాన్ని ఎన్నడో పూర్తి చేసిన వైఎస్‌... దాంతోపాటు తలపెట్టిన తెలంగాణ విశ్వవిద్యాలయానికి బుధవారం శంకుస్థాపన చేశారు'' అని కేసీఆర్‌ విమర్శించారు. జీవో 34కు వ్యతిరేకంగా రాష్ట్రస్థాయిలో త్వరలో అఖిలపక్షం నిర్వహించనున్నట్టు ఆయన ప్రకటించారు. దీనిపై నల్గొండలో నిర్వహించిన భేటీకి కాంగ్రెస్‌ తప్ప అన్నీ పార్టీలూ వచ్చాయన్నారు.


అసఫ్‌జాహీ బాగ్‌గా కేబీఆర్‌ పార్కు ముస్లింల స్థితిగతుల మెరుగుదలపై రాజేంద్రకుమార్‌ సచార్‌ కమిటీ ఇచ్చిన నివేదికను యథాతథంగా అమలు చేయాలని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఇందుకోసం జులై 10న తెలంగాణలోని అన్ని జిల్లాకేంద్రాల్లో ధర్నాలు చేస్తామన్నారు. హైదరాబాద్‌ ఇందిరా పార్కు వద్ద ధర్నాలో తాను పాల్గొంటానని ఆయన తెలిపారు. ''సచార్‌ నివేదికను అమలు చేయాలంటూ వైఎస్‌కు ఇప్పటికే వినతిపత్రం ఇచ్చాం. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేయాలంటూ సభలోనే ప్రతిపాదించాం. కేంద్రాన్నీ డిమాండ్‌ చేస్తున్నాం'' అన్నారు. తెలంగాణ ముస్లింలకు అన్నింటా అన్యాయమే జరుగుతోందని కేసీఆర్‌ ఆరోపించారు. ''హైదరాబాద్‌లో ఎన్నో కట్టడాలు నిర్మించిన అసఫ్‌జాహీ వంశస్తుల పేరును ప్రభుత్వం ఎక్కడా వాడటం లేదు. వారి వారసులకు పరిహారమైనా ఇవ్వకుండా చిరాగ్‌ ప్యాలెస్‌ను కాసు బ్రహ్మానందరెడ్డి పార్కుగా మార్చారు. దీనికి 1969 ఉద్యమంలో 400 మంది ఉద్యమకారుల్ని చంపించిన వ్యక్తి పేరు పెట్టడం దారుణం. తెలంగాణ రాగానే ఆ పార్కుకు అసఫ్‌జాహీ బాగ్‌గా పేరు మారుస్తాం'' అని పేర్కొన్నారు. తెరాస వారు చెవుల్లో పువ్వులు కాకుండా క్యాబేజీలు పెట్టుకోవాలన్న ఏపీఎన్జీవో నేతల వ్యాఖ్యలపై తానేమీ వ్యాఖ్యానించబోనని కేసీఆర్‌ అన్నారు. దాన్ని వారి సంస్కారానికే వదిలేస్తున్నామన్నారు. వారిలా తమకు నీచ సంస్కారం లేదని వ్యాఖ్యానించారు. 'మేం ఆంధ్ర వాళ్ల నీళ్లు, ఉద్యోగాలు కోరలేదు. కొల్లగొట్టిన వారికే అంతుంటే కోల్పోయిన వారికి ఇంకెంతుంటుంది?' అని ఆవేశంగా ప్రశ్నించారు.


తెలంగాణలోనే ఉద్యోగులెక్కువ

ప్రణాళికా శాఖ లెక్కలివి
ప్రభుత్వ ఉద్యోగులు 12.99 లక్షలు
పీఎస్‌యూలలో 5.79% క్షీణత
స్థానిక సంస్థల్లో పెరిగారు
హైదరాబాద్‌లోనే 1,13,098
మొత్తం తెలంగాణలో 6,14,971
కోస్తా ఉద్యోగులు 4,63,610
సీమలో సిబ్బంది 2,20,473
ప్రణాళిక శాఖ లెక్కలు
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతోంది. ప్రభుత్వరంగ సంస్థల్లోనూ ఇదే పరిస్థితి. అదే సమయంలో స్థానిక సంస్థల్లో ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. ఈ పెరుగుదల ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థల్లో తగ్గిన వారికన్నా ఎక్కువగా ఉంది. గౌరవ వేతనంతో పనిచేస్తున్న వారు, కాంట్రాక్టు ఉద్యోగులు, తాత్కాలిక ఉద్యోగులతోసహా అందరినీ లెక్కించడం మరో విశేషం.
2006 మార్చినాటికి వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు (పీఎస్‌యూ), స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఇతరత్రా ప్రభుత్వంతో సంబంధమున్న విభాగాల్లో పని చేస్తున్న వారి వివరాల్ని ప్రణాళికా శాఖ సేకరించింది. అన్ని శాఖలు, విభాగాల్లో పనిచేస్తున్న వారందరి వివరాల్ని సంపూర్ణంగా సేకరించడం ఇదే ప్రథమం. మొత్తం 306 విభాగాల అధిపతుల నుంచి సమాచారం సేకరించారు. ఉద్యోగుల విద్యార్హత, ఉద్యోగంలో ఎప్పుడు ఏ హోదాలో చేరారు, అప్పట్లో జీతం ఎంత, ప్రస్తుతం ఏ హోదాలో ఉన్నారు వంటి వివరాలన్నీ పొందుపరిచారు. ఈ వివరాలతో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. దీని ప్రకారంపైన పేర్కొన్న అన్ని విభాగాల్లో కలిపి ఉద్యోగుల సంఖ్య 12,99,054. 2001లో సేకరించిన లెక్కల ప్రకారం అన్ని విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య 12,28,170. ఈ మేరకు 70,884 మంది పెరిగినట్లు కనిపిస్తున్నారు. 2001లో న్యాయ శాఖ, లెజిస్లేచర్‌, దేవాలయాల్లో పనిచేస్తున్న వారి వివరాల్ని ప్రణాళిక శాఖ సేకరించలేదు. 2006 మార్చినాటి లెక్కల ప్రకారం ఆ మూడు విభాగాల్లో కలిపి 26,776 మంది ఉన్నారు. ఈ సంఖ్యను పక్కనపెడితే నికరంగా ఉద్యోగుల పెరుగుదల 44,108.
విభాగాల వారీగా పరిశీలిస్తే... ప్రస్తుతం నేరుగా ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న వారి సంఖ్య 6,06,019. 2001లో వీరి సంఖ్య 5,79,877. అంటే 26,142 మంది పెరిగినట్లు కనిపిస్తోంది. 2001లో న్యాయ, లెజిస్లేచర్‌, దేవాలయాల్లో పని చేస్తున్న వారిని లెక్కించలేదు కనుక 2006 లెక్కల్లో నుంచి కూడా ఈ విభాగాలను మినహాయిస్తే... ప్రస్తుతం నేరుగా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 2001తో పోలిస్తే 634 తగ్గినట్లుగా తేలుతోంది. ఇక పీఎస్‌యూలలో సంస్కరణలు వేగంగా అమలు చేస్తుండటంతో వీటిలోనూ ఉద్యోగుల సంఖ్య తగ్గుతోంది. 2001లో ఈ సంస్థల్లో పని చేస్తున్న వారి సంఖ్య 2,98,752 ఉంటే 2006 నాటికి 2,52,943 మందే ఉన్నారు. అంటే అయిదేళ్ల వ్యవధిలో 45,809 మంది తగ్గిపోయారు. గృహ నిర్మాణ మండలిలో భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించగా... పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థతో సహా పలుపీఎస్‌యూలలో స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) అమలు చేశారు. దీని ఫలితమే ఉద్యోగుల సంఖ్యలో తగ్గుదల. * విద్య, వైద్యం, పోలీసు శాఖలు మినహా ఇతర శాఖల్లో నియమాకాల సంఖ్య బాగా తక్కువ. అందుకే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గుతోంది. * స్థానిక సంస్థల్లో కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. అందువల్ల మొత్తం సంఖ్యలో ఒకింత భారీ పెరుగుదలే కనిపిస్తోంది. * 12.99 లక్షల ఉద్యోగులకుగాను నేరుగా ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్నది 6.06 లక్షల మంది (46.65 శాతం) * స్థానిక సంస్థల్లో పని చేస్తున్న వారి శాతం 26.07. * జిల్లా, మండల పరిషత్తులు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో 2001 లెక్కలతో పోల్చితే 2006నాటికి పెరిగిన ఉద్యోగుల శాతం 5.79. * పీఎస్‌యూలలో ఐదేళ్ల వ్యవధిలో 3.84శాతం మంది ఉద్యోగులు తగ్గారు. * మొత్తం గెజిటెడ్‌ ఉద్యోగుల సంఖ్య 63,501 మాత్రమే. నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగులే 5,46,329 మంది ఉన్నారు. * శ్రీకాకుళం జిల్లాలో అత్యల్పంగా కేవలం 35,641 మంది ఉద్యోగులు ఉండగా.. అత్యధికంగా హైదరాబాద్‌లో 1,13,098 మంది పని చేస్తున్నారు.
ఏ జిల్లాలో ఎందరు: ఆదిలాబాద్‌ - 68,559; నిజామాబాద్‌ - 40,325; కరీంనగర్‌ - 80,151; మెదక్‌ - 38,723; రంగారెడ్డి - 52,557; మహబూబ్‌నగర్‌ - 51,906; నల్గొండ - 46,372; వరంగల్‌ - 58,036; ఖమ్మం - 65,244; విజయనగరం - 36,872; విశాఖపట్నం - 52,548; తూర్పుగోదావరి - 69,557; పశ్చిమ గోదావరి - 52,730; కృష్ణా - 68,321; గుంటూరు - 59,117; ప్రకాశం - 42,125; నెల్లూరు - 46,699; కడప - 45,776; కర్నూలు - 52,758; అనంతపురం - 51,856; చిత్తూరు - 70,083.

స్వచ్ఛందం నేటితో సరి నత్తనడకన 610 బదిలీలు eenadu

15 శాఖల్లోనే ఉత్తర్వులు
సొంతజోన్లకు 60 మంది
స్పందించని 84 విభాగాలు
ట్రైబ్యునల్‌కెళ్లిన రెవెన్యూ సిబ్బంది
జులై 10 దాకా యథాతథ స్థితి
నేడు సభాసంఘం, స్టాఫ్‌ కౌన్సిల్‌ భేటీలు
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: 610 అమల్లో భాగంగా స్వచ్ఛంద బదిలీలకు గడువు శనివారంతో ముగుస్తోంది. ఇప్పటివరకు కేవలం 15 శాఖల్లో, 60 మందికే ఈ ప్రాతిపదికన ఆదేశాలు జారీ అయ్యాయి. మిగతా 84 శాఖల్లో దాదాపు 600 మంది వరకు స్వచ్ఛంద బదిలీ కోసం దరఖాస్తులు సమర్పించినా, సంబంధిత శాఖలు ఉత్తర్వులు అందజేయలేదు. గురువారం రెండు శాఖల నుంచి 20 మందిని సొంత జోన్లకు పంపిన సంగతి తెలిసిందే. మిగిలినవి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయాలని సాధారణ పరిపాలన శాఖ ఆదేశించినా, పెద్దగా స్పందన లేదు. పశు సంవర్థక శాఖ ఏడుగురిని, వ్యవసాయ శాఖ 9 మందిని, సహకార శాఖ 10 మందిని బదిలీ చేశాయి. మరో పది శాఖలు ఒకరిద్దరు ఉద్యోగులకు ఉత్తర్వులిచ్చాయి. కొన్ని శాఖల్లో స్వచ్ఛంద దరఖాస్తులు రానేలేదు. ఎక్కువగా వచ్చిన పాఠశాల విద్యా శాఖలో ఉపాధ్యాయుల బదిలీలు జరుగుతాయని భావించినా, ఉమ్మడి సర్వీసు నిబంధనల దృష్ట్యా చివరి నిమిషంలో ఆగిపోయాయి. రంగారెడ్డి జిల్లా నుంచి హైదరాబాద్‌కు 136మంది టీచర్లను పంపించాలని అధికారులు మొదట నిర్ణయించారు. అయితే రంగారెడ్డి జిల్లాలో పంచాయతీరాజ్‌ పాఠశాలల్లో పనిచేసే వారిని, హైదరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాల్లో నియమించేట్త్లెతేనే ఇది సాధ్యమని తేలింది. ఈ రెండింటి సర్వీసులు వేర్వేరు కావడం, వివాదం నడుస్తుండడంతో కొన్ని సంఘాలు అభ్యంతరం చెప్పాయి. దీంతో న్యాయ శాఖ సలహాలు తీసుకున్న తర్వాతే ఈ బదిలీలు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన 250 మంది ఉత్తర్వుల్ని మాత్రం శనివారం ఇస్తామని ఉన్నతాధికారులు చెప్పారు.
నేటి సాయంత్రానికి చేసేయండి
స్థానికేతరుల ఉద్యోగులకు సంబంధించి జీఏడీకి ఇప్పటికి 99 శాఖల నుంచే సమాచారం అందింది. దేవాదాయం సహా మిగతా మూడు శాఖలూ ఇప్పటికీ వివరాలు అందించలేదు. జాబితా అందించీ, బదిలీలు జరపని శాఖల్లో అందుకు కారణాలేమిటో శుక్రవారం రాత్రికి కూడా జీఏడీకి తెలియలేదు. ఖాళీల వివరాలు అందకపోవడం, రాజకీయ జోక్యం వల్ల ఇబ్బందులు ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. స్వచ్ఛంద బదిలీలకు గడువు ఒకరోజే మిగిలి ఉన్నా, అతి తక్కువ శాఖలే స్పందించడంపై సాధారణ పరిపాలన శాఖ ఆందోళన చెందుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ శనివారం సాయంత్రానికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. శనివారం 610 శాసన సభా సంఘం భేటీ కానుంది. సాయంత్రం జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. మొదటి విడత బదిలీల ప్రగతి, తర్వాత చేపట్టాల్సిన కార్యాచరణ గురించి ఇందులో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చిస్తుంది.
రెవిన్యూపై ట్రైబ్యునల్‌ స్టే
హైదరాబాద్‌లో పనిచేస్తున్న రెవిన్యూ ఉద్యోగుల బదిలీల విషయంలో యథాతథ స్థితి అమలు చేయాలంటూ పరిపాలన ట్రైబ్యునల్‌ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. 610 జీవో అమల్లో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తదితర అధికారులు జారీ ఆదేశాలను సవాలు చేస్తూ కె.ప్రవీణ్‌రెడ్డి మరికొందరు ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. ఈ ఉత్తర్వులతో బదిలీ అయినవారంతా హైదరాబాద్‌లోనే నియమితులు (అపాయింట్‌) అయ్యారని పిటిషనర్ల తరఫు న్యాయవాది పి.వి.కృష్ణయ్య వాదించారు. వారు ఇతర జిల్లాల్లో నియమితులై, బదిలీపై గానీ డిప్యుటేషన్‌పై గానీ ఇక్కడకు రాలేదనీ, అందువల్ల వారికి 610 వర్తించదని అన్నారు. హైదరాబాద్‌ అవసరాల కోసమే నియమితులైనవారిని బదిలీ చేయడం చట్ట విరుద్ధమని చెప్పారు. రెండు దశాబ్దాలుగా ఇక్కడే పనిచేస్తున్న వారిని, కొన్ని అంశాలకు లోబడి బదిలీ చేయడం, వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఇలాంటి కేసే మరొకటి పెండింగ్‌లో ఉందని, అప్పట్లో స్టేటస్‌కో మంజూరు చేసిందని ట్రైబ్యునల్‌ దృష్టికి తీసుకువచ్చారు. బదిలీలకు ఆదేశిస్తూ ఈనెల 21న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, 23న రెవిన్యూ ముఖ్య కార్యదర్శి, 27న భూ పరిపాలన ప్రధాన కార్యదర్శి వెలువరించిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. దీనిపై తగిన సమాచారం కోసం గడువు కావాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోరడంతో ట్రైబ్యునల్‌ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను జులై 10కి వాయిదా వేసింది. ట్రైబ్యునల్‌ స్టే విషయం తెలిసి, కొన్ని శాఖలు తాము ఉత్తర్వులివ్వాలా వద్దా అన్న సందిగ్ధంలో పడ్డాయి. అయితే ఆ స్టే ట్రైబ్యునల్‌కు వెళ్లిన ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని, మిగిలిన శాఖలు యథాతథంగా ఉత్తర్వులను జారీ చేయాలని సాధారణ పరిపాలన శాఖ సూచించింది.

People's Telangana - A Social Requirement -andhra jyothi