Sunday, July 8, 2007

పోలీసులు పక్షపాతధోరణితో వ్యవహరిస్తున్నారు: పీజేఆర్‌ eenadu

హైదరాబాద్‌, జులై 9: పీజేఆర్‌ ఇంకా జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లోనే ఉన్నారు. రవీంద్రరెడ్డి వర్గంపై కూడా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన అక్కడే భీష్మించుకు కూర్చున్నారు. రవీంద్రరెడ్డి, సుమధుర్‌రెడ్డిలపై పోలీసులు 143, 144, 341, 506 సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. వారిపై 307 కేసు కూడా నమోదు చేయాలని పీజేఆర్‌ స్టేషన్‌లోనే బైఠాయించారు. వివాదంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును పీజేఆర్‌ తప్పుబట్టారు. వైఎస్‌ సోదరుడు రవీంద్రరెడ్డి ఇంటికి వెళ్లి కమీషనర్‌ పరామర్శించడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యేనైన తనను పోలీసు స్టేషన్‌లో నిర్భందిచారన్నారు. రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతోందని ఆయన విమర్శించారు. తెదేపా హయాంలో కూడా తనను పోలీసు స్టేషన్‌లో నిర్భందించలేదని పీజేఆర్‌ చెప్పారు. పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. రవీంద్రరెడ్డి వర్గాన్ని అరెస్టు చేసేంతవరకు ఠాణా నుంచి కదిలేది లేదని ఆయన తెలిపారు. పీజేఆర్‌తో డీసీపీలు మధుసూదన్‌రెడ్డి, కమల్‌హాసన్‌ రెడ్డి మంతనాలు జరుపుతున్నారు. పీజేఆర్‌కు మద్దతుగా భారీ ఎత్తున అనుచరులు జూబ్లీహిల్స్‌ స్టేషన్‌ వద్దకు వచ్చారు. పోలీసులు వారిని అరెస్టు చేసి తరలించారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లే అన్ని రోడ్లని పోలీసులు మూసేశారు.

పోలీస్‌స్టేషన్‌లోనే పీజేఆర్‌ eenadu

హైదరాబాద్‌, జులై 9: పీజేఆర్‌, వైఎస్‌ వర్గాల ఘర్షణ కారణంగా తలెత్తిన ఉద్ధ్రిక్తత కొనసాగుతూనేఉంది. వైఎస్‌ సోదరుడు రవీంద్రరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పీజేఆర్‌ కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి, అల్లుడు సంతోష్‌లపై ఐదు సెక్షన్ల కింద నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేశారు. సెక్షన్‌ 147, 307, 427, 506, 149ల కింద వారిపై కేసులు నమోదు చేశారు. వారిద్దరిని మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచేందుకు తరలించారు. వైఎస్‌ సోదరుడు రవీంద్రరెడ్డి, ఆయన కుమారుడు అపోలో ఆసుపత్రిలో ఉన్నారు. మరోవైపు తనపై ఎటువంటి ఫిర్యాదు లేకున్నా పీజేఆర్‌ ఇంకా పోలీస్‌స్టేషన్‌లోనే ఉన్నారు. తామిచ్చిన ఫిర్యాదు ఆధారంగా అవతలి వారిపై ఎందుకు చర్య తీసుకోలేదని ఆయన పోలీసులను ప్రశ్నిస్తున్నారు. రవీంద్రరెడ్డి వర్గంపై కూడా నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేయాలని పీజేఆర్‌ పోలీస్‌స్టేషన్‌లోనే కూర్చున్నారు. పీజేఆర్‌ అనుచరులు భారీ ఎత్తున స్టేషన్‌ వద్దకు చేరుతుండటంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

పీజేఆర్‌ కుమారుడు, అల్లుడుకి 20 వరకు రిమాండ్‌ eenadu

హైదరాబాద్‌, జులై 9: పీజేఆర్‌ కుమారుడు విష్ణువర్ధన్‌ రెడ్డి, అల్లుడు సంతోష్‌ రెడ్డికి నాంపల్లి కోర్టు ఈ నెల 20 వరకూ రిమాండ్‌కు ఆదేశించింది. పోలీసులు వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. అంతకుముందు పోలీసులు వారిని సికింద్రాబాద్‌ మారేడుపల్లిలోని మూడో అదనపు మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. అయితే నేరుగా కోర్టుకే తీసుకెళ్లాలని మేజిస్ట్రేట్‌ సూచించడంతో పోలీసులు వారిని నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు

మూసీ కంపు... సొంపవుతుందా!? andhra jyothy

(ఆన్‌లైన్‌ , సిటీబ్యూరో) చైనాలోని 'ప్యూ అండ్‌ నాన్‌' నది తరహాలోనే మూసీని బాగు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక లు సిద్ధం చేసింది. మూసీ నది తరహాలోనే ఆ నది సైతం కాలుష్యంతో నిండిపోయింది. చైనా ప్రభుత్వం దాన్ని శుద్ధిచేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. కలుషిత నదిని బాగుచేయడంలో చైనా ప్రభుత్వం కనబరిచిన కౌశలాన్ని ప్రపంచ పర్యావరణవేత్తలు ముక్తకంఠంతో ప్రశంసిం చారు. ప్యూ అండ్‌ నాన్‌ మాదిరిగానే భాగ్యనగర చరిత్రతో పెనవేసుకున్న 'మూసీ' నదిని మార్చాలని ప్రభుత్వం సంకల్పించింది.
లక్ష్య సాధనలో ఇప్పటికే ఆయా శాఖలు తమ పనులు ప్రారంభించాయి. 'మూసీ ఇక కంపు కాదు... సొంపు' అంటూ అధికారులు ప్రకటనలు గుప్పించేశారు. అయితే మూసీ ప్రక్షాళనకు పరిశ్రమల కాలుష్య జలాలు పెద్ద సవాళ్లను సృష్టిస్తున్నాయి. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏమంటే ఆయా ప్రాంతాలల్లో 'సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్స్‌' ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి రసాయన వ్యర్ధాలు మూసీలోకి రావని వారి వాదన. అయితే వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి.
మూసీలోకి పారిశ్రామిక వ్యర్ధజలాలు వివిధ నాలాల గుండా ప్రవహించడం అటుంచితే, ఏకంగా కొన్ని పరిశ్రమల నిర్వాహకులు అత్యంతగాఢత ఉన్న యాసిడ్‌ అవశేషాలను అక్రమంగా మూసీలోకి కుమ్మరిస్తున్న సంఘటనలు తాజాగా కాలుష్య నియంత్రణ మండలి అధికారుల దాడులల్లో వెలుగుచూశాయి. మరో పక్క మహానగర నీటి సరఫరా, సివరేజ్‌ బోర్డు అత్యంత ప్రతిష్టాత్మకంగా 'సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు' నిర్మిస్తోంది. అయితే ఈ ప్లాంట్లు పరిశ్రమల వ్యర్ధజలాలను శుద్ధి చేసేవి కాదు. ఇటువంటి పరిస్థితిలో నిజంగా 'మూసీ సొంపు' అవుతుందా... వెచ్చిస్తున్న కోట్లరూపాయలకు ఫలితం ఉంటుందా... లేదా... అనేది ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్న...


ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు ఇవే...
మూసీలోకి వస్తున్న మురికి నీటిని శుద్ధి చేసేందుకు గాను వాటర్‌ బోర్డ్‌ సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ప్లాంట్స్‌ను 340 కోట్లరుపాయలు ఖర్చు పెట్టి నిర్మిస్తోంది. అంబర్‌పేట్‌, నాగోల్‌, నల్లచెరువు, అత్తాపూర్‌లలో వీటిని నిర్మిస్తున్నారు. వీటి సామర్ధ్యం అంబర్‌పేట్‌లో 339 ఎం ఎల్‌డి(మిలియన్‌ లీటర్స్‌ ఫర్‌ డే) నాగోల్‌లో 172, నల్లచెరువులో 30 , అత్తాపూర్‌లో 51 ఎంఎల్‌డి ఉంది. ఇటువంటి పరిస్థితిలో పరిశ్రమల రసాయన వ్యర్ధజలాల శుద్ధికి ఇక్కడ నిర్మిస్తున్న సివరేజ్‌ట్రీట్‌మెంట్‌ ప్లాంట్స్‌ శక్తి సరిపోదు. అని శాస్త్రీయంగా మాట్లాడితే పరిశ్రమల వ్యర్ధజలాలతో గృహా వ్యర్ధాలను కలపడం ద్వారా వాటి గాఢత తగ్గిస్తాం అని పేర్కొంటున్నారు. వాస్తవానికి రసాయన వ్యర్ధజలాలో ఉండే భారీలోహాలు ఎటువంటి వ్యర్ధాలతో కలిపినా వాటి స్వరూపం మారవన్న భౌతిక శాస్త్ర నియమాన్నే కాదనే అధికారులను చూసి జాలిపడాలో .. ఇటు వంటి అధికారులు చరిత్ర ఆనవాళ్లు ఉన్న మూసీనదికి మంచి రోజులు తెస్తామంటే సంబరపడాలో అర్ధం కావడం లేదు.

610 బదులు మల్కీ కోసం డిమాండ్‌ vaartha

610 అమలు చేయలేకపోయిన కారణంగా ముల్కీ నిబంధనలు అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగ సంఘాలు, టిఆర్‌ఎస్‌ పేర్కొన్నాయి రాష్ట్రపతి ఉత్తర్వులు కాకుండా అంతకు ముందు ఉన్న ముల్కీ నిబందనలను అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసారు.

వేర్వేరు భేటీలపై గుర్రు eenadu

ఉద్యోగుల మధ్య చిచ్చుకోసమే తెలంగాణ సంఘాల ఆగ్రహం సమావేశం నుంచి సగంలో బయటకు అడిగితేనే ఇలా నిర్వహించాం మరోసారి అలా చేయం: సీఎస్‌

రాష్ట్రంలో 610 జీవో అమలు వ్యవహారం మరో వివాదంలో చిక్కుకుంది. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌, తెలంగాణ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హరినారాయణ శనివారం వేర్వేరుగా సమావేశాలు నిర్వహించడం ఇందుకు కారణం. దీన్ని జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమర్థించగా.. తెలంగాణ ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించాయి. సీఎస్‌ ఎదుటే నిరసన తెలిపాయి. వచ్చే సమావేశాన్ని ఉమ్మడిగా నిర్వహించకుంటే తాము హాజరుకాబోమని స్పష్టంచేసి, అర్ధాంతరంగా వెళ్లిపోయాయి. విడివిడిగా చర్చలు జరిపినా, శనివారం కీలక నిర్ణయాలేమీ తీసుకోకపోవడం విశేషం.
గత వారం ఉద్యోగుల సమన్వయ కమిటీ సమావేశం ముగిశాక స్టాఫ్‌ కౌన్సిల్‌ ప్రతినిధులు సీఎస్‌ను విడిగా కలిశారు. తమకు, తెలంగాణ సంఘాలకు వేర్వేరు సమావేశాలు నిర్వహించాలని కోరారు. దీంతో శనివారం ఉదయం స్టాఫ్‌ కౌన్సిల్‌ ప్రతినిధులతో సీఎస్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దీనికి ఏపీ ఎన్జీవో, టీఎన్జీవో నేతలతోపాటు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. విడి భేటీ నిర్వహించినందుకు ప్రతినిధులు సీఎస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై ఇలాగే జరపాలని సూచించారు. 610తో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా వెళ్లేందుకు ముందుకొచ్చే వారందరినీ బదిలీ చేయాలని మరోసారి కోరారు. టీఏ, డీఏలను, సీనియారిటీని అడక్కుండానే వెళ్లడానికి వారు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘంతో, సీఎంతో చర్చించాక దీనిపై నిర్ణయం తీసుకుంటానని సీఎస్‌ హామీ ఇచ్చారు. ప్రభుత్వరంగ సంస్థలపై మార్గదర్శకాలు లేకపోవడంవల్ల అమలు కష్టసాధ్యంగా మారిందని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పగా, త్వరలో వాటిని ఇస్తామని హరినారాయణ అన్నారు. 1975 నుంచి ఉద్యోగుల జాబితా దొరకడం అసాధ్యమని సంఘాలు చెప్పగా, అందుబాటులో ఉన్నవన్నీ సేకరించాల్సిందిగా అన్ని శాఖలను ఆదేశించామన్నారు. స్థానికేతరుల జాబితాపై అధికారులు సరైన సమాచారం ఇవ్వడం లేదని సంఘాలు ఫిర్యాదు చేయగా వారి వివరాలను త్వరలో వెబ్‌సైట్‌లో పెడతామని హామీ ఇచ్చారు.
అనంతరం సాయంత్రం 4 గంటలకు తెలంగాణ సంఘాలతో సీఎస్‌ విడిగా సమావేశమయ్యారు. దీనిపై ఆ సంఘాల నేతలు తీవ్ర నిరసన తెలిపారు. ''తెలంగాణ, తెలంగాణేతర సంఘాల మధ్య చిచ్చు పెట్టేందుకే ప్రభుత్వం ఇలా చేస్తోంది. ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను ఉమ్మడిగా చర్చిస్తేనే, ఒకరి అభిప్రాయం మరొకరు తెలుసుకొని, తుదకు ఏకాభిప్రాయం, పరిష్కారం సాధించే వీలుంది. వేర్వేరు సమావేశాలు నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమిటి? జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌, తెలంగాణ సంఘాలతో ఉమ్మడిగా సమావేశాలు నిర్వహించాలని సాక్షాత్తూ ముఖ్యమంత్రే ఆదేశాలిచ్చారు. దానిని బేఖాతరు చేయడం మాకు అవమానకరం. దీనికి బాధపడుతున్నాం. ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తాం. స్టాఫ్‌ కౌన్సిల్‌లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించే సంఘాలు లేవు. దాంతో సమావేశం జరపడం వల్ల మా ప్రాంతానికి ఒరిగేదేమీ లేదు. వచ్చే సమావేశాన్ని ఉమ్మడిగా నిర్వహించకుంటే మేం హాజరుకాబోం. లేదంటే మాకూ జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ హోదా కల్పించాలి'' అని ప్రతినిధులు వాదులాడారు. సంఘాలను తాము వేర్వేరుగా చూడడంలేదని సీఎస్‌ వివరణ ఇచ్చారు. ''స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని ప్రత్యేకంగా జరపాలని దాని ప్రతినిధులు కోరడం వల్లే అందుకు అనుమతిచ్చాం. సాయంత్రం సమన్వయ కమిటీ భేటీకి హాజరు కావాలని వారికి సూచించినా ఎవరూ రాలేదు. మరోసారి ఇలా జరగనివ్వం'' అని హరినారాయణ వివరించారు. అనంతరం జీవో అమలుకు తీసుకుంటున్న చర్యల గురించి ఆయన వివరించబోగా... తెలంగాణ నేతలు మధ్యలోనే లేచి వెళ్లిపోయారు.

నేడు రౌండ్‌ టేబుల్‌ భేటీ
కాగా బదిలీలను నిషేధిస్తూ ఆర్థిక శాఖ జారీ చేసిన ఉత్తర్వుల పరిధిలోంచి 610 జీవో బదిలీలను ప్రభుత్వం మినహాయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయనుంది. అన్ని శాఖల్లో కాంట్రాక్టు నియామకాల్లో సైతం విధిగా 610ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. మరోవైపు ముల్కీ నిబంధనల అమలు కోసం ఆదివారం ఉదయం పది గంటలకు నాంపల్లిలోని మదీనా ఎడ్యుకేషన్‌ సెంటర్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 610 అమలులో ప్రభుత్వం విఫలమైందని, ఆరు సూత్రాలలో అయిదింటిని ఇప్పటికీ అమలు చేయకపోవడం వల్లనే.. ముల్కీ నిబంధనలు అమలు చేసి, తెలంగాణ మొత్తాన్ని ఒక జోన్‌గా పరిగణించాలని కోరుతున్నామని చెప్పారు.