Monday, October 1, 2007

చికాగోలో ఘనంగా 'బతుకమ్మ' Andhra Jyothy

చికాగో, సెప్టెంబర్‌ 29: సంప్రదాయ 'బతుకమ్మ' పండగను తెలంగాణా ఎన్నారైలు చికాగోలో ఇటీవల ఘనంగా జరుపుకున్నారు. ఉత్తర అమెరికా బతుకమ్మ పండగ ఐదవ వార్షికోత్సవాలను పురస్కరించుకుని వారు ఈ పండుగను జరుపుకున్నారు. సాంప్రదాయబద్ధంగా జరిగిన ఈ ఉత్సవానికి తెలంగాణా ప్రవాసులు అధిక సంఖ్యలో హజరయ్యారు. చిన్నాపెద్ద భేదం లేకుండా అన్ని వయస్సుల వారు బ్లూమింగ్టన్‌, విస్‌కాన్‌సిన్‌, ఇండియానా తదితర ప్రాతాలనుంచి విచ్చేసి బతుకమ్మ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.


ఆ రోజు ఉదయాన్నే లేచి బతుకమ్మ పండగకు సహజసిద్దమైన గునుగు పూలు, తంగేడు పూలు, బీర పూలు సేకరించారు. బతుకమ్మ పూలు అందుబాటులో లేనివారు స్థానికంగా లభించే పూలుతో బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఉదయం పది గంటల సమయంలో ప్రారంభమైన బతుకమ్మ విహారయాత్రలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ నిరంజన్‌ అల్లంనేని స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరూ తామకు తాము పరిచయం చేసుకున్నారు. తర్వాత వారంతా శ్రీనివాస్‌ రెడ్డి సిరికొండ, ప్రదీప్‌ దమిడిలు నిర్వహించిన వివిధ ఆటల్లో పాలుపంచుకున్నారు.

సంప్రదాయ తెలంగాణ వంటకాలతో మధ్యాహ్న భోజనం ఆరగించారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆడారు. రకరకాలైన పూలతో అలంకరించిన బతుకమ్మలను మధ్యలో ఉంచి వాటి చుట్టూ చేరి నాట్యం చే స్తూ 'బతుకమ్మ బతుకమ్మ ఊయ్యాలో' వంటి పాటలు పాడుతూ భక్తిపారవశ్యంలో తేలియాడారు. అనంతరం బతుకమ్మలను సమీపంలోని సరస్సులో నిమజ్జనం చేశారు.
బతుకమ్మ ఉత్సవాలు పూర్తయిన తర్వాత అందరూ సద్దులు పంచుకున్నారు. ఆటల్లో గెలుపొందిన వారికి వెంకట్‌ ఆర్‌ తుడి బహుమతులు అందజేశారు. ఎంపిక చేసిన 'ఉత్తమ బతుకమ్మ'కు శ్రీధర్‌ లోకా ప్రత్యేక బహుమతిని అందజేశారు. బతురమ్మను ఘనంగా నిర్వహించడంలో శ్రీనివాస్‌ రెడ్డి సిరికొండ, అశోక్‌ ముద్రకోళ్ల, ఉష ముద్రకోళ్ల, ప్రదీప్‌ దమిడి తమ వంతు సాయం చేశారు. నిరంజన్‌ అల్లంనేని ధన్యవాదాలు తెల్పుతూ వందన సమర్ఫణ చేయడంతో కార్యక్రమం ముగిసింది.