Sunday, July 15, 2007

వై ఎస్‌-పీ జే ఆర్‌ వివాదాన్ని పరిష్కరిస్తాం andhrajyothi

ఏ ఐసీసీ ప్రతినిధి సురేష్‌
హైదరాబాద్‌, జూలై 15(ఆన్‌లైన్‌): ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి, సీఎల్పీ మాజీ నేత పి.జనార్దన్‌రెడ్డి కుటుంబాల మధ్య నెలకొన్న వివాదాన్ని త్వరలోనే పరిష్కరిస్తామని ఏఐసీసీ ప్రతినిధి సురేష్‌ చెప్పారు. ఈ వివాదం కారణంగా సోమవారం నుంచి ఆమరణ దీక్షకు దిగేందుకు సిద్ధమైన పీజేఆర్‌ను శాంతింపజేసేందుకు ఆదివారం నగరానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.

'కారు' వివాదానికి సంబంధించి పూర్తి సమాచారం సేకరించానని చెప్పారు. ప్రభుత్వ సలహాదారు కేవీపీ రామచంద్రరావు, పీజేఆర్‌, వైఎస్‌ సోదరుడు రవీంద్రనాథ్‌రెడ్డిలను కలసి పరిస్థితిని సమీక్షించానని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికల నిర్వహణలో అధిష్ఠానం తలమునకలై ఉన్నందున ఆందోళనను వాయిదా వేసుకోవాలని పీజేఆర్‌కు సూచించానని చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశాలను కూడా పీజేఆర్‌కు వివరించానని చెప్పారు. తన సూచన మేరకు దీక్షను వాయిదా వేసుకున్న పీజేఆర్‌ను ఆయన అభినందించారు.

వారం రోజుల మా శ్రమ వృథాకాదు: వీహెచ్‌
వైఎస్‌-పీజేఆర్‌ కుటుంబాల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించరించేందుకు వారం రోజులుగా చేస్తున్న శ్రమ వృథా కాదని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు చెప్పారు. పీజేఆర్‌తో భేటీ అనంతరం ఆయన కాంగ్రెస్‌ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. క్రమశిక్షణ గల కార్యకర్తగా అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశాల మేరకు దీక్షను వాయిదా వేసుకున్న పీజేఆర్‌ను వీహెచ్‌ అభినందించారు.

'కారు' వివాదం పాలనకు అద్దం పడుతోంది : శశిధర్‌రెడ్డి
పీజేఆర్‌ తనయుడిపై, అల్లుడిపై పోలీసులు 307 సెక్షన్‌ కింద నమోదు చేసిన కేసులు రాష్ట్ర ప్రభుత్వ పాలనకు అద్దం పడుతున్నాయని సనత్‌నగర్‌ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నందునే పీజేఆర్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. పీజేఆర్‌ చేస్తున్న పోరాటం వ్యక్తిగతమైనది కాదని... పార్టీ ప్రతిష్ఠను పెంచడం ద్వారా 2009లో కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాం గ్రెస్‌ అధికారంలోకి రావడానికేనని చెప్పారు.

No comments: