Thursday, June 28, 2007

610 బదిలీలు షురూ Eenadu

సంక్షేమం, మార్కెటింగుల్లో 20 మందికి ఉత్తర్వులు
స్వచ్ఛందంగా కోరుకున్నవారికే
జీఏడీ జాబితాలోంచే ఎంచుకోవాలి
సీఎస్‌ తాజా మార్గదర్శకాలు
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
610అమల్లో భాగంగా, నిబంధనలకు విరుద్ధంగా నియమితులైన స్థానికేతర ఉద్యోగుల బదిలీలు ప్రారంభమయ్యాయి. రెండు శాఖల్లో స్వచ్ఛందంగా వెళ్లిపోయేందుకు దరఖాస్తు చేసుకున్న వారి జాబితాలోంచి 20 మందిని ఎంపిక చేసి, గురువారం సొంత జోన్లకు బదిలీ చేశారు. ఈ మేరకు ఆయా విభాగాల ముఖ్య కార్యదర్శులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సాంఘిక సంక్షేమ శాఖలో 47 మంది దరఖాస్తులు ఇవ్వగా 8 మందిని, మార్కెటింగు శాఖలో 27 మందిలో 12 మందిని బదిలీ చేస్తూ జీవోలు (నంబర్లు 321, 154, 165) ఇచ్చారు. సొంత జోన్లలో ఖాళీగా ఉన్న స్థానాల్లో వీరికి పోస్టింగులు ఇచ్చారు. మార్కెటింగ్‌ శాఖ నుంచి బదిలీ అయిన వారిలో నలుగురు తెలంగాణా జిల్లాల (ఐదో జోన్‌) వారు ఉండడం గమనార్హం. 610 కింద వారం క్రితం పోలీసుశాఖ జంట నగరాల నుంచి కానిస్టేబుళ్ల బదిలీని మొదలుపెట్టింది. అయితే ప్రభుత్వ తాజా మార్గదర్శకాలను ఆచరణలో పెడుతూ, స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారిని పంపడం ఇదే ప్రథమం. రెండు శాఖల్లో 20 మంది ఉద్యోగులను బదిలీ చేసినట్లు సాధారణ పరిపాలన శాఖ ప్రభుత్వానికి నివేదించింది. పోలీసు శాఖలో జరిగిన 159 కానిస్టేబుళ్ల బదిలీలను కూడా అది తన నివేదికలో పేర్కొనడం విశేషం. ఇందులో పది మంది రిలీవ్‌ అయ్యారని, కొంత మంది ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారని పేర్కొన్నారు.
610 అమలు తక్షణం ప్రారంభం కావాలని, సిద్ధంగా ఉన్న జాబితాల ఆధారంగా ఉత్తర్వులు ఇవ్వాలనీ ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో 99 శాఖలు స్థానికేతరుల జాబితాను సమర్పించిన సంగతి తెలిసిందే. గురువారం నుంచే బదిలీలు జరగాలని సీఎం అన్ని శాఖలకు స్పష్టంచేయగా, రెండు మాత్రమే దాన్ని పాటించాయి. మిగతావి శుక్ర, శనివారాల్లో ఉత్తర్వులిస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ స్థానికేతరుల వివరాలు సమర్పించని మూడు శాఖల అధికారులు ఉన్నతాధికారులను సంప్రదించారు. తమ జాబితాను శుక్రవారం ఇస్తామని దేవాదాయ శాఖ తెలిపింది. జిల్లా కోర్టులకు సంబంధించిన ఉద్యోగుల వివరాలను రెండుమూడు రోజుల్లో సమర్పిస్తామని న్యాయ విభాగం తెలిపింది. హైదరాబాద్‌లోని భూ ఆక్రమణ కేసుల పరిష్కార విభాగం తమ శాఖలో జిల్లా యూనిట్లేమీ లేవని సమాచారం పంపింది.
ఆ జాబితానే పాటించాలి: హరినారాయణ
మరోవైపు తాజా బదిలీల కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హరినారాయణ మరో సర్క్యులర్‌ జారీ చేశారు. పాత మార్గదర్శకాలను పునరుద్ఘాటిస్తూనే, కొన్ని వివరణలు, ఆదేశాలు కూడా ఇందులో పేర్కొన్నారు. సాధారణ పరిపాలన శాఖ పంపించిన స్థానికేతరుల జాబితా నుంచే, అందులో పేర్కొన్న సంఖ్యకు లోబడే బదిలీలు చేయాలని ఆయన ఆదేశించారు. పాఠశాల విద్యాశాఖ రూపొందించిన జాబితాలో స్థానికేతరుల సంఖ్య వెయ్యికి పైచిలుకు ఉండగా, జీఏడీ పంపిన జాబితాలో 596 మాత్రమే ఉంది. ఇలా కొన్ని శాఖల్లో బదిలీ కోసం ఏ జాబితాను పరిగణనలోనికి తీసుకోవాలనే దానిపై సందిగ్ధం ఏర్పడింది. మరోవైపు కొన్ని విభాగాల్లో స్వచ్ఛంద బదిలీలకు గిరాకీ పెరిగింది. ఈ నేపథ్యంలో, పరిమితికి మించి బదిలీలు జరిగే అవకాశం ఉందనే అనుమానంతో హరినారాయణ తాజా వివరణ ఇచ్చినట్టు భావిస్తున్నారు. గతంలో జారీ చేసిన సర్య్కులర్‌లో పరిమితి మేరకే బదిలీలు జరగాలనే పదం అభ్యంతకరంగా ఉండడంతో దాన్ని తొలగించేందుకు సాధారణ పరిపాలన శాఖ వద్దనున్న గణాంకాల గురించి పేర్కొన్నట్లు చెబుతున్నారు. కానీ, దీనిపైనా తెలంగాణా ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. సాధారణ పరిపాలన శాఖ పరిమితిని సూచించి శాఖల నుంచి సమాచారం సేకరించిందని, దీనిపై తాము అభ్యంతరాలు వ్యక్తంచేయగా, అదే సమాచారాన్ని తిరిగి పంపి అమలు చేయాలని సూచించడం డొంక తిరుగుడు వ్యవహారమని తెలంగాణా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్‌ విమర్శించారు. తెలంగాణా ఉద్యోగుల బదిలీ కోసమే ఇలాంటి ఉత్తర్వులు జారీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బదిలీ ఉత్తర్వులు సంబంధిత శాఖ కార్యదర్శి మాత్రమే విడుదల చేయాలని కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టంచేశారు. ''అన్ని శాఖల వారూ దీన్ని తప్పక పాటించాలి. శాఖాధిపతులతో పాటు ఇతర కిందిస్థాయి అధికారులకు ఈ అధికారాన్ని బదలాయించ కూడదు'' అని కూడా ఆయన తెలిపారు. కొందరు కార్యదర్శులు జీవో అమలుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, కిందిస్థాయి అధికారులపై బాధ్యతలు మోపుతున్నారనే సమాచారం మేరకే ఆయన ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.

No comments: