Tuesday, July 3, 2007

610పై హైకోర్టుకెళతా: చేగొండి eenadu

పాలకొల్లు, న్యూస్‌టుడే:

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వల్ల ఆంధ్ర ప్రాంత ప్రయోజనాలకు విఘాతమేర్పడుతోందని ప్రత్యేకాంధ్ర ఉద్యమనేత, నరసాపురం ఎంపీ చేగొండి వెంకటహరరామజోగయ్య వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సమితి చెప్పినదానికి ప్రభుత్వం తలూపుతోందని, రాష్ట్రపతి ఉత్తర్వుల్లో లేని అంశాలను 610 జీవో ద్వారా అమలు చేయటానికి ప్రయత్నిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. దీనిపై రెండు మూడు రోజుల్లో హైకోర్టులో రిట్‌ వేస్తానని చెప్పారు. అసలీ జీవోలో రాష్ట్రపతి ఉత్తర్వుల్లో లేని అంశాలను చేర్చవద్దని, ఆంధ్రలో సూపర్‌ న్యూమరీ పోస్టులు సృష్టించి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లేకుండా చేయవద్దని పదే పదే కోరుతున్నా ప్రభుత్వం స్పందించలేదన్నారు. దీనికి ఆంధ్రప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎం.ఎల్‌.సి.ల అసమర్థతే కారణమన్నారు.

లగడపాటీ.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు మధుయాష్కీ డిమాండ్‌ andhra jyothy

లగడపాటీ.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు మధుయాష్కీ డిమాండ్‌
హైదరాబాద్‌, జూలై 2 (ఆన్‌లైన్‌) :'తెలంగాణ' కోరుకోవడమంటే.. భారత్‌-పాకిస్తాన్‌లను విడదీయడం వంటిదంటూ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ చేసిన వ్యాఖ్యలు.. ప్రత్యేక రాష్ట్ర వాదులను.. తెలంగాణా ప్రజల ఆకాంక్షలను అవమానపరచేవిగా ఉన్నాయని నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీగౌడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వాఖ్యలపై లగడపాటి తక్షణమే తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.
అమెరికా వెళ్తున్న ఆయన మార్గమధ్యంలో లండన్‌ విమానాశ్రయం నుంచి సోమవారం 'ఆన్‌లైన్‌'తో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వాదాన్ని భారత్‌-పాకిస్తాన్‌లతో పోల్చడమేమిటని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు లగడపాటి అవగాహనా రాహిత్యాన్ని రుజువు చేస్తున్నాయని పేర్కొన్నారు.
610 జీవో అమలుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదుప్రభుత్వానికి 610 ఉత్తర్వును అమలు చేయాలన్న చిత్తశుద్ధిలేదని మధుయాష్కీ గౌడ్‌ అన్నారు. ఈ సమస్య పరిష్కారం కాకుండా పెడదోవ పడుతోందని.. ఇలాంటి సమయంలో తెలంగాణ వాదులంతా సమైక్యంగా పోరాడాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

నాలుక తెగ్గోస్తాం andhrajyothy

నాలుక తెగ్గోస్తాం
టీజేకు నరేంద్ర హెచ్చరిక
హైదరాబాద్‌, జూలై 2 (ఆన్‌లైన్‌) తెలంగాణను పూర్తిగా వ్యతిరేకిస్తున్న చంద్రబాబు, ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిలు రాహు, కేతువులు అయితే.. తెలంగాణకు అడ్డుపడుతున్న సైంధవుడు కేసీఆర్‌ అని టీఆర్‌ఎస్‌(ఎన్‌) అధ్యక్షుడు నరేంద్ర అభి వర్ణించారు.. తెలంగాణను కాంక్షించే వారంతా ఒక వేదికపైకి రావాలని ఆయన సోమవారంనాడిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పిలుపుని చ్చారు.
610 జీవో అమలు కోసం సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చి.. ఆ కార్యక్రమంలో కేసీఆర్‌ ఎందుకు పాల్గొనలేదని నిలదీశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా వలస వాద ఉన్నతా ధికారులు ఉన్నంత వరకు జీవో అమలు కాదని పేర్కొన్నారు. సీమ ఉద్యోగులపై చెయ్యేస్తే.. తీసేస్తామంటూ పిచ్చివాగుడు వాగుతున్న వారి నాలిక తెగ్గోస్తామని నరేంద్ర హెచ్చరించారు.
కాంగ్రెస్‌ ఎంపీ లగడపాటి, రాయలసీమ హక్కుల వేదిక నాయకుడు టీజీ వెంకటేశ్‌ సభ్యత, సంస్కారం లేకుండా గూండాలుగా, ఫ్యాక్షనిస్టులుగా, వీధి రౌడీ లుగా మాట్లాడుతున్నారని నరేంద్ర ఆక్షేపించారు. 610 జీవో అమలు చేయాలని అందరూ కొరుతుంటే పీసీసీ అధ్యక్షునికి మాత్రం అరుపులు, కేకలు, రాద్ధాంతంలా కనిపిస్తోందా అని ప్రశ్నించారు. కేశవరావుకు ఏ భాషలో చెప్పాలో ఆ భాషలోనే చెప్పేకాలం త్వరలోనే వస్తుందన్నారు. ఈనెల ఆరవ తేదీన జిల్లా కలెక్టరేట్ల వరకు ప్రదర్శనలు నిర్వహించి.. అక్కడ ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని తమ పార్టీ నిర్ణయించిందని పేర్కొన్నారు. దీనిలో టీఎన్‌జీవో లు, విద్యావంతులు, నిరుద్యోగులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే తెలంగాణ ఐక్య వేదిక ఏర్పాటు అవుతుందని నరేంద్ర చెప్పారు.

610కి అటూ ఇటూ vaartha

ముట్టడి భగ్నం
టిఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు సహా 1,200మంది సచివాలయంవద్ద అరెస్టు
శివార్లలో అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్‌, జూలై 2, ప్రభాతవార్త సిటీబ్యూరో

తెలంగాణప్రాంత ప్రజలకు ప్రయోజనం చేకూర్చే 610 జిఒ అమలులో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపిస్తూ టిఆర్‌ఎస్‌ సోమవారం నిర్వహించిన సచివాలయం ముట్టడిని పోలీసులు భగ్నంచేశారు. టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నేతలు ఎన్నో వ్యూహాలురూపొందించుకుని ముందుకువచ్చినా విజయవంతం కాలేకపోయారు. ఉదయం నుంచే నేతలు వ్యూహరచన చేసి మధ్యాహ్నం కాగానే దఫదఫాలుగా కార్యకర్తలను సచివాలయంవైపు పంపించడానికిచేసిన యత్నాలను పోలీసులు ఎప్పటి ప్పుడు అడ్డుకున్నారు. ఇందిరాపార్క్‌వద్ద ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వయంగా నాయకత్వం వహించి ఆందోళలనుచేయగా,ఇదే సమయంలో సచివాలయం ప్రధాన మార్గం వద్ద మెరుపులా వచ్చేందుకుకూడా ప్రయ త్నించారు.అయితే ఎవరూ సచివాలయ గోడలుకూడా తాకలేకపోయారు. రెండుచోట్లా 1200 మం దిని అరెస్టుచేశారు. వీరిలో ఎంపీలు రవీంద్రనాయక్‌, మధుసూధన్‌రెడ్డితోపాటు 13 మంది ఎమ్మెల్యేలు,ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసు యంత్రాంగం ఆదివారంనుంచే భారీ భద్రత చేబట్టి జిల్లాలనుంచి వచ్చేవారిని ఎక్కడికక్కడే అరెస్టు చేసింది. అక్కడి పోలీసుల కళ్లుగప్పి సాధారణ ప్రయాణీకుల్లా బస్సులు, రైళ్లలో నగరానికి వచ్చిన మిగతావారిని శివారు ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారు.కాగా, ముట్టడికి ముందు ఇందిరా పార్క్‌వద్ద నిర్వహించిన ప్రదర్శనకు పోలీసులు అవాంతరం కలిగించలేదు. ఇలా వచ్చినవారిలో పార్టీ ఎంపీలు రవీంద్రనాయక్‌, వినోద్‌, ఎమ్మెల్యేలు హరీష్‌రావు, పద్మారావు, పద్మాదేవేందర్‌రెడ్డి, నాయిని నరసింహారెడ్డిలతో పాటు ఎమ్మెల్సీలు, పలువురు నేతలు ఉన్నారు.వీరంతా సచివాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడే పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్బ ంగా పోలీసులకు, నేతలకు వాగ్వివాదాలు జరిగాయి.వారందరిని బల వంతంగా అరెస్టుచేసి నగరంలోని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.

ఇలావుంటే, సచివాలయంలోకి దూసుకుపోయేం దుకు 200మందివరకు కార్యకర్తలు తెలుగుతల్లి విగ్రహంనుంచి సచివాలయం ప్రధానమార్గం రోడ్డువద్దకు వచ్చారు.లుంబినీ పార్క్‌లోకి ఉదయమే చేరుకున్న వీరందరూ దఫదఫాలుగా బయట కొస్తున్నట్టు గమనించిన పోలీసులు వెంటనే అదు పులోకి తీసుకున్నారు. లుంబినీ పార్క్‌లో ఉన్న ఇతర కార్యకర్తలనుకూడా అరెస్టుచేశారు. ఉమాదేవి నేతృత్వంలోని మహిళల బృందం కారులోనుంచి దిగి నినాదాలు చేసుకుంటూ సచివాలయం ద్వారం నుంచి లోనికి దూరిపోయారు. వెంటనే పోలీసులు వారినికూడా అరెస్టు చేశారు. జంట నగరాలు, శివారు ప్రాంతాలలో ఐదువేలమందికి పైగా పోలీ సులను బందోబస్తు నిమిత్తం నియమించారు. పోలీసులు ఎక్కడా అతికి పోకుండా మర్యాదపూర్వ కంగానే వ్యవహరించడం గమనార్హం. సచివాలయం వద్ద అశ్విక దళాలను, టియర్‌గ్యాస్‌, వాటర్‌ కెనాన్‌లను సిద్ధంచేశారు. 15 ప్లాటూన్ల ఎపిఎస్పీ, నాలుగు ప్లాటూన్ల సిఆర్‌పిఎఫ్‌తోపాటు పెద్ద సంఖ్యలో హోంగార్డులు ఉదయం 6నుంచి సచివాలయంవద్ద మోహరించింది.


ఇందిరా పార్క్‌ వద్ద ఉద్రిక్తత
దోమలగూడ(ప్రభాతవార్త): తెలంగాణా జిల్లా ల్లోని పలు ప్రాంతాలనుంచి తరలివచ్చిన కార్య కర్తలు ఇందిరాపార్కుకు ఉదయమే చేరుకున్నారు. ఎంపీలు రవీంద్రనాయక్‌, మధుసూదన్‌రెడ్డి, ఎమ్మె ల్యేలు నాయిని నర్సింహారెడ్డి, హరీష్‌రావు, టి. పద్మారావు, డాక్టర్‌ నగేష్‌, ఎమ్మెల్సీ ంెహమాన్‌, వెంకటేశ్‌గౌడ్‌ తదితర నేతలు ధర్నా చౌక్‌ వద్దకు చేరుకుని, వందలసంఖ్యలో తరలివచ్చిన ఉద్యమ కారులతో కలసి ఊరేగింపుగా సచివాలయంవైపు కదిలారు. ఇలా కొద్దిదూరం వెళ్ళగానే భారీ ఎత్తున పోలీసులు అడ్డంరావడంతో ఉద్రికత్త నెలకొంది. కొద్దిసేపు పెనుగులాట తర్వాత ఆందోళనకారులను అరెస్టుచేసి వాహనాలలో గోషామహల్‌స్డేడియంకు, నేతలను పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు.

అరెస్టులకు భయపడం, ఉద్యమిస్తాం
610 జిఓ అమలును నీరుగార్చడానికి చేస్తున్న పన్నాగాలను సాగనివ్వబోమని టిఆరెసెల్పీ నేత జి.విజయరామారావు, ఉపనేత నాయిని నర్సిం హారెడ్డి, ఎమ్మెల్యేలు హరీష్‌రావు, పద్మారావులు హెాచ్చరించారు. అరెస్టులద్వారా ప్రభుత్వం ఉద్యమాన్ని ఆపలేదన్నారు. ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామన్నారు. ఇక్కడ ఉద్యోగాలలో తెలంగాణేతరులు 5వేలమంది కాదని 75000 మంది ఉన్నారని, న్యాయబద్దంగాచూస్తే 2లక్షల తెలంగాణవారి ఉద్యోగాలు ఆంధ్ర ప్రాంతం వారు తన్నుకుపోయారని వివరించారు. జిఓ అమలు పేరుతో తెలంగాణవారిని కూడా వారివారి ప్రాంతాలకు పంపించే కుట్ర చేస్తున్నారని, ఇలాంటి విధానాలే కొనసాగిస్తే గుజ్జర్లుచేసిన తరహాలో ఆందో'ళన తీవ్రం చేస్తామని హెాచ్చ రించారు.

ఇంత చేస్తున్నా... రాజకీయ రాద్ధాంతం
15నాటికి స్వచ్ఛంద బదిలీలన్నీ పూర్తి
విలేకర్లతో ముఖ్యమంత్రి వైఎస్‌

హైదరాబాద్‌, జూలై 2, ప్రభాతవార్త610 జీవో అడ్డంపెట్టుకుని టిఆర్‌ఎస్‌ నాయకులు అనవసరంగా రాజ కీయం చేస్తున్నారని ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ఆరోపించారు. 30 ఏళ్లుగా ఏ ప్రభుత్వం అమలు చేయలేని రాష్ట్రపతి ఉత్తర్వులను అమలుకు శ్రీకారం చుట్టామని, అలాగే 20ఏళ్ల క్రితం జారీఅయిన 610జీవోను కూడా త్రికరణశుద్ధితో అమలు చేస్తుంటే కొన్ని రాజకీయ పార్టీలు కావాలని రాద్ధాంతం చేయడం ఎంతవరకు సమంజసన్నారు. ఈ సమస్యను రాజకీయ లబ్ధికోసం కొన్ని శక్తులు వాడుకోవడం హాస్యా స్పదమని ముఖ్యమంత్రి విమర్శించారు. 610 జీవో అమలు తీరును నిరసిస్తూ టిఆర్‌ఎస్‌ సోమవారంతలపెట్టిన సచివాలయముట్టడిపై ఆయనను సచివాలయంలో సోమవారంజరిగిన ఒక కార్యక్రమంలో విలేకరులు ప్రస్తావించినప్పుడు పైవిధంగా స్పందించారు. ఇదివరకెన్నడూ జరగని విధంగా ఈ ఉత్తర్వుల అమలుకు తీసుకుంటున్న తమ చర్యలను అన్ని రాజ కీయపార్టీలూ తాము చేస్తున్న మంచిపనిని నిర్ద్వంధంగా సమర్ధిస్తూ, అభినందించాల్సిందిపోయి, రాజకీయ లబ్ధి కోసం ప్రజలను తప్పుదారిపట్టించే దిశగా ఆందోళనకు దిగడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. రాష్ట్రపతి జీవోలో పొందుపరిచే అంశాలకంటే ఇంకా ముందుకు పోయి,ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడే దిశగా కృషి చేస్తున్నామన్నారు. 610జీవో అమలువిషయంలో సమస్యలేవీ లేకున్నా కావాలని పనిగట్టుకుని సృష్టిస్తున్నాయని ఎద్దేవా చేశారు. నిజానికి అదనంగా ఏడువేల పోస్టులు ఉండగా, 50వేలని, లక్షని, రెండులక్షలంటూ విపక్షాలు తమ ఇష్టమొచ్చే విధంగా మాట్లాడుతూ వాస్తవాలను వక్రీకరిస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. అదనంగా ఉన్న ఏడువేలపోస్టుల్లో ఆంధ్రా- తెలంగాణ ప్రాంతాలకు చెరోసగం వంతున ఉన్నట్లు తెలిపారు.ఏడువేల మందిలో మూడువేల మంది హోంశాఖ ఉద్యోగులన్నారు. మిగతా 4వేల ఉద్యోగులు ఇతర శాఖలకు చెందినవారని వీరిలో విద్యాశాఖకు చెందినవారే పెద్ద సంఖ్యలో ఉన్నారన్నారు. స్వచ్ఛందంగా సొంత ప్రాంతాలకు వెళ్లాలనకున్న ఉద్యోగులకు ఇప్పటికే ఉత్తర్వులు జారీచేస్తున్నామని, ఈ నెల 15వ తేదీనాటికి ఈ ప్రక్రియ పూర్తిచేయాలని అధి కారులను ఆదేశించామన్నారు. ఆ తర్వాత డెప్యుటేషన్‌పై వచ్చి అక్రమపద్ధతిలో ఇక్కడే ఉద్యోగాలు చేస్తున్నవారిని వెనక్కి పంపే కార్యక్రమం చేపడతామన్నాను. ఇందుకోసం ఎన్జీవో సంఘాల ప్రతినిధులతో కూడా ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ, వారి సలహాలు, సూచనలు కూడా తీసుకుంటున్నామన్నారు.బదిలీ ఉత్తర్వులు జారీచేసే విషయంలో అనవసరమైన అపోహలకు పోవద్దన్నారు.స్థానికేతరులు వారంతట వారుపోతుంటే కాదు, కూడదని చెప్పే అధికారం ఎవ్వరికీ లేదన్నారు. అంతేగాక ఏమి చేసినా బడ్జెట్‌ నిర్వహణ, ఆర్థిక క్రమశిక్షణ చట్టానికి లోబడే ఏదైనా చేయాల్సి ఉంటుందని, ఈ విషయంలో ఏ పొరపాటు చేసిన రూ.6వేల కోట్ల కేంద్ర ప్రభుత్వ గ్రాంటు తగ్గిపోతుందన్నారు. అందువల్ల రాబడులు, వ్యయం అనేఅంశాలు చాలా కీలకమని, వాటి మార్గదర్శకాల పరిధిలోనే పాలనాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. 1975నుంచి 124జీవో ప్రకారం ఉద్యోగుల బదిలీలు చేపట్టే ప్రక్రియ కూడా మొదలుపెడతామన్నారు. హోంశాఖతోపాటు మిగతా అన్నిశాఖలోనూ ఆనాడు ఉండే 80:20 నిష్పత్తిలో స్థానికులు, స్థానికేతరుల (ఓసి) బదిలీలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ లెక్కన స్థానికేతరులు కేవలం మరో ఐదు లేదా పదిశాతం మందే పెరగొచ్చని ముఖ్యమంత్రి వైఎస్‌ తెలిపారు. ఎవ్వరూ ఏదీ అడగడానికి వీలులేకుండా అందరికీ ఆమోదయోగ్యంగా 610జీవోను అమలుచేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ బదిలీల ప్రక్రియలో తప్పులు జరగకూడదని, చిన్నపాటి తప్పులు జరిగినా మీడియా పెద్దవిగా చూపెడుతుందని వ్యాఖ్యానించారు. పోలీసులను వెనక్కి పంపితే అందుకు ప్రత్యామ్నాయంగా 3నుంచి 6నెలల వరకు కొందరిని డెప్యుటేషన్‌లో నియమించే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు.
స్థానికేతరులు 7,123 మంది!
610 పై మంత్రుల ప్రకటన
అడిగిన వారందరినీ పంపబోమని, అధికంగా ఉంటేనే పంపుతామని వెల్లడి
'స్వచ్ఛంద'కు 15 రోజుల గడువు
నాన్‌లోకల్‌ రిజర్వేషన్‌ లేదు
20,30,40 శాతాలు ఓపెన్‌ కోటాయే
పోలీసులకు బదిలీ, ఆ వెంటనే ఏడాది డిప్యుటేషన్‌
హైదరాబాద్‌, జూలై 2 ప్రభాతవార్త

చట్ట సవరణ అనివార్యం andhra jyothi

(ఆన్‌లైన్‌, సిటీబ్యూరో): మహా నగర పాలక సంస్థకు చట్ట సవరణ అనివార్యమవుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న హెచ్‌ఎంసి చ ట్టాన్ని సవరించడం ద్వారానే గ్రేటర్‌ జోనల్‌ కమిషనర్లకు సంపూర్ణ అధికారాలు సంక్రమిస్తాయి. అప్పటివరకు ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం పరిమిత అధికారాలతో పాలనను కొనసాగించాల్సింటుంది. మే 30వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్‌ రాజశేఖరరెడ్డి సమక్షంలో జరిగిన సమావేశంలో గ్రేటర్‌కు లైన్‌క్లియర్‌ అయ్యింది. అధికారుల అంచెలపై కూడా రూపు ఏర్పడింది. అయితే గ్రేటర్‌ అవిర్భావంతో అధికారిక వికేంద్రీకరణ జరపాలనే ప్రభుత్వ ఉద్ధేశానికి హెచ్‌ఎంసి యాక్ట్‌ బ్రేకులు వేసింది. 1955లో రూపొంది ంచిన హెచ్‌ఎంసి యాక్ట్‌ను సవరించడంతోనే గ్రేటర్‌కు మార్గం సుగమమవుతుంది. దీన్ని సవరించకుండా గ్రేటర్‌ను ఏర్పాటు చేయడం చట్టపరంగా వీలుపడదు. అయితే సవరణ ప్రక్రియ పూర్తికావాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సి ఉంటుంది. అప్పటివరకు ఒడిదుడుకుల మధ్యన గ్రేటర్‌ పాలన కొనసాగనుంది.
జోనల్‌ కమిషనర్ల అధికారాల్లో అస్పష్టత... గ్రేటర్‌లో ప్రతిపాదించిన జోనల్‌ కమిషనర్లకు బదలాయించాల్సిన అధికారాలపై కొంత అనిశ్చితి ఏర్పడింది. జోనల్‌ కమిషనర్‌కు రూ.25 లక్షల వరకు ఆర్థికాధికారం కట్టబెట్టాలని ప్రభుత్వం భావించిప్పటికీ, ఇప్పటికిప్పుడు ఈ అధికారాలను ధారదత్తం చేయడం సాధ్యపడదు. చట్టసవరణ కోసం వేచిచూడాల్సిందే. అప్పటివరకు తన విచ క్షణాధికారంతో కొన్ని అధికారాలను జోనల్‌ కమిషనర్లకు కట్టబెట్టాలని గ్రేటర్‌ కమిషనర్‌ భావిస్తున్నారు. అందులోభాగంగా రూ. 10లక్షల విలువైన పనులు మంజూరు చేసే అధికారాన్ని వీరికి అప్పగించాలని సంకల్పించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు నేడో రేపో వెలువడనున్నాయి. అలాగే ఐదులక్షల ఆర్థికాధికారం ప్రతిపాదించిన డిప్యూటీ కమిషనర్లకు తాజాగా రూ.2 లక్షల విలువైన పనులకే పరిమితం చేయాలని నిర్ణయించారు. బిల్డింగ్‌ పర్మిషన్లలో సందిగ్దత ఇదిలావుండగా భవన నిర్మాణాల అనుమతుల విషయంలో కొంత గందరగోళం నెలకొంటోంది. డిప్యూటీ కమిషనర్లకు కట్టబెట్టిన జి+2 బిల్డింగ్‌ పర్మిషన్లు జారీపై ఎలాంటి సందిగ్దత లేనప్పటికీ, బహుళ అంతస్తు భవనాల(జి+2 పై అంతస్తులు) విషయంలో మాత్రం ఏకాభిప్రాయం కుదరడంలేదు.
జోనల్‌ కమిషనర్లకు ఈ అధికారం కట్టబెట్టాలని నిర్ణయించినప్పటికీ, బిల్డింగ్‌ కమిటీతో ముడిపడి ఉన్న ఈ అనుమతుల విషయంలో ఉన్నతాధికారులు ఒక అభిప్రాయానికి రాలేకపోతున్నారు. భవన అనుమతులను పరిశీలించే బిల్డింగ్‌ కమిటీలో హుడా, ఫైర్‌, పోలీసు తదితర విభాగాల సభ్యులు ఉంటారు. వీరందరు ఆయా జోన్‌లలో పక్షం రోజులకోసారి జరిగే బిల్డింగ్‌ కమిటీ సమావేశానికి రావాలంటే కుదురుతుందా? లేదా అనే అంశంపై అధికారుల్లో మీమాంస నెలకొంది.అంతేగాకుండా బిల్డింగ్‌ కమిటీకి హాజరయ్యే సభ్యుల హోదా కంటే తక్కువస్థాయిలో ఉన్న కొందరు జోనల్‌ కమిషనర్లుగా వ్యవహరిస్తుండడం కూడా అధికారులను ఇరకాటంలో పడేస్తోంది. ఇదిలావుండగా జోనల్‌ స్థాయిలో జమ,పద్దులతో కూడిన రికార్డులను భద్రపరచాలని నిర్ణయించారు. దీనికోసం ఆయా జోన్ల లో ఎగ్జామినర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌, ఫైనా న్సియల్‌ అడ్వయిజర్‌ను నియమించనున్నారు. వీటితో పాటు కొన్ని రికార్డులను మాత్రం ప్రధాన కార్యాలయంలో కూడా పొందుపరచాలని సంకల్పించారు.


యుద్ధ వాతావరణం andhra jyothi

(ఆన్‌లైన్‌-సిటీబ్యూరో/రాంనగర్‌): 610 జీవో అమలు కోరుతూ తెలంగాణ రాష్ట్ర సమితి చేపట్టిన సెక్రటేరియట్‌ ముట్టడి కార్యక్రమం యుద్ధ వాతావరణాన్ని తలపించింది. సోమవారం మధ్యాహ్నం పెద్దపెట్టున నినాదాలు చేస్తూ సెక్రటేరియట్‌ ముట ్టడి కోసం టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు ధర్నా చౌక్‌ నుంచి కదిలారు. భారీగా మోహరిం చిన పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలను అరెస్టు చేసి వివిధ పోలీస్‌ స్టేషన ్లకు తరలిం చారు. ధర్నా చౌక్‌ రెండు వైపులా ఇనుప కంచెల తో మూసివేసి ఎటువైపూ వెళ్లకుండా చేశారు. చుట్టూ మోహరించిన పోలీసులు టిఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు. పోలీసు బలగాలను దాటుకొని పోవడానికి ప్రయత్నించిన ఎమ్మెల్యేలు హరీష్‌రావు, నాయిని నరసింహారెడ్డి, పద్మారావులను ఎత్తుకెళ్లి వాహనాల్లో పడేశారు. నాయకులు, కార్యకర్తలు ఎక్కడ నిలబడితే అక్కడకు వెళ్లి అరెస్టు చేశారు.
కోవర్ట్‌ ఆపరేషన్‌00 టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నేతలను అరెస్టు చేయడానికి పోలీసులు పకడ్బందీ వ్యూహం రచించారు. కోవర్ట్‌ ఆపరేషన్‌ కూడా చేశారు. ముందుగా పోలీసులు కొంత మందిని సివిల్‌ డ్రస్సులో టిఆర్‌ఎస్‌ కార్యకర్తల్లో కలిపేశారు. పోలీ సు అధికారులు వెళ్లి టిఆర్‌ఎస్‌ నాయకులతో మాట్లాడుతుం డగానే తిన్నగా అక్కడకు వాహనాలు వచ్చాయి. ఆ వెంటనే వెనకాల టిఆర్‌ఎస్‌ కార్యకర్తల్లో ఉన్న పోలీసులే వారిని తోసి వాహనాల్లోకి ఎక్కించారు. మధ్యాహ్నం 12.40 గం టలకు మొదలైన అరెస్టుల కార్యక్రమం రెండు గంటల పాటు ఏకధాటిగా సాగింది. మధాహ్నం 2.40 గంటలకు దర్నా చౌక్‌లో టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఉన్న ప్రాంతాన్ని ఖాళీ చేసి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో యూనివర్సిటీ విద్యార్థులు, కొందరు టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు నినాదాలు చేసుకుంటూ సెక్రటేరియట్‌ లోపలికి వెళ్లే ప్రయ త్నం చేశారు. అక్కడ మోహరించిన పోలీసులు ఆ రెండు బృందాలను అరెస్టు చేశారు.


రోడ్లు మూసివేత
సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామని టిఆర్‌ఎస్‌ ముందే ప్రకటించడంతో పోలీసులు భారీ ఎత్తున బలగాలను మోహరించారు. సోమవారం ఉదయమే లోయర్‌ ట్యాంక్‌బండ్‌ రోడ్డును పోలీసులు మూసివేశారు. ముళ్ల కంచె ఏర్పాటు చేశారు. పోలీసులు వాహనాలు, అశ్వికదళాలు, వాటర్‌కెనన్‌లను సిద్ధం చేసుకున్నారు. ఎలాంటి పరిస్థితినైనా తిప్పకొట్టే విధంగా ఆయుధాలను సిద్ధం చేసుకున్నారు. సెక్రటేరియట్‌ వద్ద కూడా ఇదే పరిస్థితి. ఈ ప్రాంతంలో ఘర్షణ జరగబోతుందన్న భయానక వాతావరణాన్ని పోలీసులు సృష్టించారు. టిఆర్‌ఎస్‌ ముట్టడికి ఎవరూ రారన్న ప్రచారాన్ని కూడా లేవదీశారు. పోలీసుల కళ్ళుగప్పి... పటిష్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ, పోలీసుల కళ్ళుగప్పి టిఆర్‌ఎస్‌ నాయ కులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ధర్నాచౌక్‌కు చేరుకున్నారు.
ప్రధాన నాయకులు, కార్యకర్తల ఇళ్ళ వద్ద ఆదివారం నుంచే నిఘా ఏర్పాటు చేసి, వారిని ముట్టడి ర్యాలీకి రాకుండా పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫల మయ్యాయి. సచివాలయం ముట్టడికి ఐదారువందల మంది వస్తారని పోలీసులు అంచనా వేశారు. వారి అంచనాలు తారుమారయ్యాయి. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలను సచివాలయం వరకు వెళ్ళకుండా అడ్డుకునేందుకు సెంట్రల్‌ జోన్‌ డిసిపి ఎగ్బాల్‌, సౌత్‌ జోన్‌ డిసిపి కమలహాసన్‌, చిక్కడపల్లి ఎసిపి సుమతితో పాటు ఇతర అధికారులు ఆగమేఘాల మీద భారీ పోలీసు బలగాలను రంగంలోకి దింపి ధర్నా చౌక్‌కు రెండు వైపులా మూసివేశారు.


ఆంధ్ర అధికారులు కుట్ర: నాయిని
610 జీవో సక్రమంగా అమలు కాకుండా ఉన్నత స్థాయిలో ఉన్న ఆంధ్ర అధికారులు కుట్ర పన్నుతున్నారని ముషీరాబాద్‌ ఎమ్మెల్యే నాయిని నర్సింహారెడ్డి ఆరోపించారు. ఆంధ్ర అధికారులంతా దొంగలని తెలంగాణ అధికారులంతా దద్దమ్మలుగా మరోసారి ఈ జీవో అమలు విషయంలో స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. జూన్‌ 30లోగా జీవోను కచ్చితం గా అమలు చేస్తామని అసెంబ్లీలో చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్‌, ఆర్థిక శాఖ మంత్రి రోశయ్యలు దాన్ని అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. వాగ్దానాలు అమలు చేయనందున టిఆర్‌ఎస్‌ చేపట్టిన సచివాలయం ముట్టడికి ప్రభుత్వం పోలీసులతో విఘాతం కలిగించిందన్నారు. జీవో అమలయ్యే వరకు తపోరాటం ఆగదన్నారు.

ముందు ఆంధ్ర అధికారులను పంపాలి: పద్మారావు
ముందుగా ఆంధ్ర అధికారులను పంపిన తర్వాతే తెలంగాణ వారిని తమ సొంత జిల్లాలకు పంపాలని టిఆర్‌ఎస్‌ నగర కన్వీనర్‌, ఎమ్మెల్యే పద్మారావు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపుతూ జీవోను నీరుగార్చేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. పోలీస్‌ స్టేషన్‌లో ధర్నా సచివాలయం ముట్టడికి తరలివచ్చిన కొందరు టిఆర్‌ఎస్‌ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి అంబర్‌పేట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దాదాపు 200మంది కార్యకర్తలు అంబర్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ధర్నా చేశారు. శాసనసభ్యులు రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ సత్యనారాయణలను కూడా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
సిటీ బస్సుల్లో పబ్లిక్‌ ఫోన్లు
(ఆన్‌లైన్‌, సిటీబ్యూరో) ఆర్టీసీ బస్సుల్లో త్వరలో పబ్లిక్‌ టెలిఫోన్లు రానున్నాయి. ముంబాయి తరహా బస్సుల్లో పబ్లిక్‌ టెలిఫోన్లు ఏర్పాటు చేసి ప్రయాణికుల మన్నలను పొందడానికి అధికారులు కసరత్తులు చేస్తున్నారు. అత్యవసర సమయంలో ఫోన్‌ అందుబాటులో ఉంటే ప్రయాణీకులకు సౌకర్యంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ముంబాయిలో ఇప్పటికే బస్సుల్లో పబ్లిక్‌ టెలిఫోన్‌ ఉండడంతో ఆ తరహా పద్దతిని సిటీ రీజియన్‌లో కూడా అమలు చేయాలనే దిశగా అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.
ఈ మేరకు ముగ్గురు అధికారులు ముం బాయి వెళ్లి పబ్లిక్‌టెలిఫోన్‌ పనితీరుపై పర్యవేక్షించి ఒక నివేదికను సిటీ ఆర్‌ఎంకు సమర్పించారు. నివేదికను పరిశీలించిన తరువాత పబ్లిక్‌టెలిఫోన్‌ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఒక నిర్ణయం తీసుకుంటామని రీజనల్‌ మేనేజర్‌ ఎస్‌. నాగరాజు తెలిపారు. వీరా బస్సుల్లో ప్రయోగత్మకంగా ప్రవేశపెట్టే ఆలోచనలో అధికారులున్నారు. అయితే బస్సుల్లో పబ్లిక్‌ టెలిఫోన్‌ రక్షణ... రద్దీ బస్సుల్లో పబ్లిక్‌ టెలిఫోన్‌ ఎంత వరకు సాధ్యమా ? తదితర అంశాలపై అధికారులు దృష్టి సారించారు. డ్రైవర్‌ వద్ద పబ్లిక్‌ టెలిఫోన్‌ను ఏర్పాటు చేస్తే అన్ని రకాలుగా మెరుగ్గా ఉంటుందని అధికారులు యోచిస్తున్నారు. సెల్‌ఫోన్‌ లేని ప్రయాణీకులు అత్యవసర సమయంలో బస్సులో ఫోన్‌ వినియోగించుకునే అవకాశముంటుందని ఆర్‌ఎం నాగరాజు తెలిపారు.

సవరణలు కుదరవ్‌! eenadu

జీవో 43పై తేల్చిన న్యాయశాఖ
తప్పదంటున్న జాక్టో
హైదరాబాద్‌, న్యూస్‌టుడే:
610 జీవో అమల్లో భాగంగా ఉపాధ్యాయుల స్వచ్ఛంద బదిలీలకై విడుదల చేసిన 43 జీవో వివాదం సృష్టిస్తోంది. అందులోని అంశాలు ఏకీకృత సర్వీస్‌కు విరుద్ధంగా ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. దానిని సవరించాలి లేదా రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ అంశంపై ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి కార్యాచరణ సమితి (జాక్టో) సోమవారం మంత్రి దామోదర రాజనర్సింహను కలిసింది. ప్రభుత్వం ఏకీకృతానికి కట్టుబడి ఉందా లేదా అని ప్రశ్నించింది. రద్దు చేస్తే పరువు పోతుందని, ఆ జీవోకు తాను సవరణ చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఆయన ఉన్నతాధికారులను పిలిచి సవరణల అవసరాన్ని గుర్తుచేశారు. ఎలాంటి సవరణలూ అవసరం లేదని, సంఘాలు చెబుతున్నట్లు కలెక్టర్లకు అధికారాలిస్తూ సవరణలు చేస్తే మరిన్ని వివాదాలు వస్తాయని న్యాయ శాఖ తిరస్కరించింది.

స్థానికేతరుల్లో సగం తెలంగాణ వారే ! eenadu

వివరాలు వెబ్‌సైట్లో పెడతాం
610పై పార్టీలది రాజకీయం
ఇష్టమొచ్చినట్టు పోస్టులివ్వలేం: సీఎం
హైదరాబాద్‌, న్యూస్‌టుడే:
610 అమలుపై ఇప్పటివరకు జరిగిన కసరత్తు చాలా బాగుందని ముఖ్యమంత్రి వైఎస్‌ పేర్కొన్నారు. న్యాయబద్ధంగా, ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఈ ప్రక్రియను నిర్వహిస్తుండగా, కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. జీవోపై సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష తర్వాత ఆయన విలేఖరులతో మాట్లాడారు. ''ఇప్పటి వరకు 124 జీవో ఆధారంగా 80 శాతం స్థానిక, 20 శాతం ఓపెన్‌ కోటా ప్రాతిపదికన స్థానికేతరుల నిర్ధారణ జరిగింది. దీని ప్రకారం 7089 మందిని గుర్తించాం. ఉద్యోగ సంఘాల డిమాండ్‌ మేరకు, ఇక వెంటనే 1975 నుంచి గుర్తింపు ప్రక్రియ చేపడతాం. దీని ద్వారా స్థానికేతరుల సంఖ్య అయిదు నుంచి పది శాతం పెరగొచ్చు. స్థానికేతర ఉద్యోగుల సంఖ్య 50 వేలు, లక్ష, రెండు లక్షలు అని కొన్ని పార్టీలు చెబుతున్న దానిలో వాస్తవం లేదు. ఇప్పటికి హైదరాబాద్‌లో గుర్తించిన ఏడు వేల పైచిలుకు మందిలో సగం మంది తెలంగాణ జిల్లాల వారే. మిగిలిన సగం ఇతర ప్రాంతాల వారు. వీరందరి సమాచారం త్వరలో వెబ్‌సైట్‌లో పెడతాం'' అని ఆయన ప్రకటించారు. ''30 ఏళ్లుగా అమలుకాని ఈ జీవోను మేం చిత్తశుద్ధితో ఆచరణలోకి తెస్తున్నాం. ఇప్పటివరకు జరిగిన కృషిని అన్ని పార్టీలు నిర్ద్వంద్వంగా అభినందించాల్సింది పోయి విమర్శిస్తున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల కన్నా ఎక్కువగా మేం దీని అమలుకు చర్యలు తీసుకున్నాం. 610 పరిధిలో లేనప్పటికీ కార్పొరేషన్లు, విశ్వ విద్యాలయాలకూ దీన్ని వర్తింపజేయాలని ఆదేశించాం'' అని ఆయన తెలిపారు. ''వాస్తవానికి ఈ జీవో అమలు జూన్‌ 30లోగానే ముగిసేది. అయితే ఉత్తర్వులపై వివాదాలు, ఇతర సమస్యల వల్ల జాప్యం జరిగింది. ఏ సమస్య అయినా ఉద్యోగ సంఘాలతో చర్చించి, పరిష్కరిస్తున్నాం. ఇక ఎవరూ ఏదీ అడగడానికి వీల్లేకుండా, తప్పులు జరగకుండా జాగ్రత్తగా చేస్తున్నాం'' అని ఆయన వివరించారు. స్వచ్ఛందంగా వెళ్లేందుకు ముందుకొచ్చే వారందర్నీ ఎందుకు బదిలీకి అనుమతించడం లేదనే ప్రశ్నకు... ''అందరూ జిల్లాలకు వెళ్తే అక్కడ వారికోసం పోస్టులు సృష్టించాల్సి వస్తుంది. ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు నియామకాలు చేపట్టలేదు. ద్రవ్య బాధ్యత, బడ్జెట్‌ నిర్వహణ పాటించకపోతే 6వేల కోట్ల రూపాయల కేంద్ర గ్రాంటు రాదు. ఇలాంటివన్నీ చూసుకునే జాగ్రత్తలు తీసుకుంటున్నాం'' అని ఆయన వివరించారు.
వెంటనే ఉత్తర్వులు: పోలీసు శాఖలో స్థానికేతరులుగా గుర్తించిన వారిలో 2987 మంది కానిస్టేబుళ్లు, 175 ఎస్సైలు ఉన్నారని 610 మంత్రివర్గం అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌, సభ్యుడు, హోంమంత్రి జానారెడ్డి విలేఖరులకు తెలిపారు. వీరిలో ఇప్పటికే 159 మంది కానిస్టేబుళ్లకు ఉత్తర్వులు అందాయని, మిగిలిన వారికి వెంటనే జారీ చేస్తున్నామని చెప్పారు. అంతమందిని ఒక్కసారిగా పంపిస్తే వినాయక చవితి, ఇతర పండుగల సమయంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉన్నందున, బందోబస్తు అవసరాల కోసం, డిప్యుటేషన్‌పై కొనసాగించనున్నట్టు వెల్లడించారు. కొత్త నియామకాలు జరిగిన తర్వాత వీరి డిప్యుటేషన్లను రద్దు చేస్తామన్నారు. 610 అమలుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నామని, అన్ని పార్టీలూ దీనికి సహకరించాలని జానారెడ్డి కోరారు. బదిలీ అయిన వారు వెళ్లబోమంటే కుదరదని, నిబంధనల మేరకు వెళ్లాల్సిందేనని స్పష్టంచేశారు.

అరెస్టులతో ఆగిన ముట్టడి eenadu

610పై తెరాస నిరసన భగ్నం సచివాలయానికి చేరింది కొందరే ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు అయినా కళ్లుగప్పి వచ్చిన కార్యకర్తలు హైదరాబాద్‌ - న్యూస్‌టుడే

610 జీవోను, రాష్ట్రపతి ఉత్తర్వులను తక్షణం అమలు చేయాలనే డిమాండ్‌తో తెరాస చేపట్టిన సచివాలయ ముట్టడి కార్యక్రమం అరెస్టులతో ముగిసింది. తెరాస నేతలు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అయినా కొందరు తెరాస కార్యకర్తలు వారి కళ్లుగప్పి వివిధ మార్గాల్లో సచివాలయానికి చేరుకున్నారు. పోలీసులు వారిని వెంటనే అదుపులోకి తీసుకుని ముట్టడి యత్నాన్ని భగ్నం చేశారు.

తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి ముట్టడి కోసం బయల్దేరిన తెరాస కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ నిలువరించారు. పెద్దఎత్తున అరెస్టులు జరిపారు. హైదరాబాద్‌ శివార్లలో కూడా రోడ్లను దిగ్బంధించి అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ నిర్బంధాలన్నింటినీ అధిగమించి కొందరు తెరాస కార్యకర్తలు నగరంలోని ఇందిరాపార్కు ధర్నాచౌక్‌కు చేరుకున్నారు. అక్కడ తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు వారితో కలిశారు. అంతా కలిసి సచివాలయం వైపు సాగే ప్రయత్నం చేశారు. వారిని ముందుకు కదలనీయకుండా పోలీసులు అక్కడే అరెస్టు చేశారు. ముట్టడిలో ప్రత్యక్షంగా పాల్గొనని తెరాస అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు ఫోన్‌ ద్వారా పర్యవేక్షించారు. ఆర్టీసీ బస్సులు, వాహనాలు, కాలినడకన వంటి మార్గాల ద్వారా తమ కార్యకర్తలను వ్యూహాత్మకంగా సచివాలయం సమీపానికి చేరవేసి పోలీసులను ఆశ్చర్యపరిచారు. ముట్టడి నేపథ్యంలో సచివాలయం, ధర్నాచౌక్‌ ప్రాంతాలు పోలీసు బలగాలతో నిండిపోయాయి.


అంతా ప్రశాంతం: తెరాస నేతలు, కార్యకర్తలు సోమవారం ఉదయం ధర్నాచౌక్‌కు తరలివచ్చారు. పార్లమెంట్‌ సభ్యులు రవీంద్రనాయక్‌, మధుసూధన్‌రెడ్డి, వినోద్‌కుమార్‌, శాసనసభా పక్షనేత విజయరామారావు, ఉపనేత నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, చంద్రశేఖర్‌, పద్మారావు, నగేశ్‌, ఈటెల రాజేందర్‌, రామలింగారెడ్డి, లక్ష్మీకాంతారావు, గోవింద్‌నాయక్‌, పద్మా దేవేందర్‌రెడ్డి, తెరాస యువత అధ్యక్షుడు ప్రభాకర్‌, వివిధ విభాగాల అధ్యక్షులు, ప్రజా కళాకారులు రసమయి బాలకిషన్‌, దేశీపతి శ్రీనివాస్‌ తదితరులు అక్కడ భేటీ అయ్యారు. చౌక్‌ నుంచి సచివాలయం వైపు దూసుకుపోవాలని, పోలీసుల నుంచి ఎలాంటి ప్రతిఘటననైనా ఎదుర్కోవాలని ముందుగా వారికి పార్టీ నిర్దేశించింది. అయితే చివరిక్షణంలో వ్యూహం మార్చి దూకుడుకు తావివ్వకుండా సంయమనం పాటించింది. నేతలు ముట్టడి ప్రయత్నాలేవీ చేయకుండా బృందాలుగా మంతనాలు సాగిస్తూ పోలీసులను అయోమయ పరిచారు.

పోలీసుల ప్రతివ్యూహం: మరోవైపు పోలీసులు అదనపు బలగాలు, బారికేడ్లను, ఆందోళనకారులను తరలించేందుకు వాహనాలను ఏర్పాటు చేశారు. ధర్నాచౌక్‌ సిగ్నల్స్‌ వైపు ముళ్లకంచెలు వేశారు. సుమారు మూడువందల మంది పోలీసులు అక్కడ మోహరించారు. కొద్దిపాటి ఉత్కంఠ అనంతరం మధ్యాహ్నం 12.30 ప్రాంతంలో బారికేడ్ల వైపు దూసుకొచ్చిన తెరాస కార్యకర్తలను అరెస్టు చేశారు. స్వల్ప ప్రతిఘటన మధ్య ఎమ్మెల్యేలను పోలీస్‌ వ్యాన్‌లలో, కార్యకర్తలను లారీల్లో తరలించారు. ఇందుకు నిరసనగా వారంతా పెద్దపెట్టున నినాదించారు. బారికేడ్లను దాటి దూసుకొచ్చేందుకు మాజీ మంత్రి హరీశ్‌రావు, మరికొందరు నేతలు, కార్యకర్తలు విఫలయత్నం చేశారు. ప్రతిఘటన తీవ్రత ఊహించినంతగా లేకపోవడంతో పోలీసుల పని సులువైంది. అందరినీ లంగర్‌హౌస్‌, గోల్కొండ పోలీసు స్టేషన్లకు తరలించారు. దారిలో ఆర్టీసీ క్రాస్‌రోడ్‌ ప్రాంతంలో కొందరు కార్యకర్తలు తమను తరలిస్తున్న డీసీఎం వ్యాన్ల టైర్లలో గాలి తీసేసి ధర్నా చేశారు. అదుపులోకి తీసుకున్నాక పోలీసులు మధ్యాహ్న భోజనం, మంచినీరు ఇవ్వలేదంటూ వారు కబాడీ, వాలీబాల్‌ ఆడి నిరసన తెలపడం విశేషం. అంతకు ముందు చౌక్‌ వద్ద కొందరు కార్యకర్తలు ఓ పాడెను మోసుకుంటూ సీఎం డౌన్‌ డౌన్‌ అని నినదించారు. మరోవైపు పోలీసులతో రవీంద్రనాయక్‌కు వాగ్వాదం జరిగింది. స్థానికేతర పోలీసులు తరలిపోయే సమయం వచ్చిందని, అతిగా వ్యవహరించడం మంచిది కాదని ఆయన వ్యాఖ్యానించారు. శాంతియుతంగా నిలబడ్డ వారిని ఎలా అరెస్టు చేస్తారంటూ పోలీసులతో నాయిని వాదానికి దిగారు.
పోలీసుల్ని ఏమార్చి...: ధర్నాచౌక్‌లో అరెస్టుల పర్వం సాగుతుండగానే కొందరు తెరాస కార్యకర్తలు వివిధ మార్గాల ద్వారా సచివాలయం చేరుకున్నారు. ఇందుకు రకరకాల మార్గాలు ఎంచుకుని పోలీసులను ఆశ్చర్యపరిచారు. కొంతమంది ఆర్టీసీ బస్సులో సచివాలయం సమీపం దాకా ప్రయాణించి ఒక్కసారిగా దిగి దూసుకొచ్చేందుకు ప్రయత్నించారు. మరికొందరు సచివాలయం ఎదురుగా ఉన్న లుంబినీ పార్కులో ముందుగానే ప్రవేశించారు. అక్కణ్నుంచి సచివాలయం గేటు వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. ఇంకొందరు మామూలు వాహనదారుల్లా సచివాలయం సమీపం దాకా వచ్చి, హఠాత్తుగా కిందికి దిగి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో గేటు వైపు పరుగు తీశారు. కానీ వారందరినీ పోలీసులు ఎక్కడిక్కడ అరెస్టు చేసి తరలించారు. ఈ సందర్భంగా మూడు గంటల పాటు సచివాలయంలోకి ఉద్యోగులు, మంత్రులను తప్ప ఎవరినీ పోలీసులు అనుమతించలేదు.

తెలంగాణ వారిని చివరిగా పంపాలి: నాయిని

తమ కార్యకర్తలను బెదిరించడం ద్వారా ముట్టడిని విఫలం చేసేందుకు ప్రభుత్వం కుయుక్తులు పన్నిందంటూ తెరాస విమర్శించింది. పలువురిని వేధింపులు, బెదిరింపులకు గురి చేశారంది. 610 అమలు పేరుతో తెలంగాణ వారినే ముందుగా బదిలీ చేస్తూ వారి మధ్య తగాదా పెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని నాయిని నర్సింహారెడ్డి విమర్శించారు. దీని వెనక ముఖ్యమంత్రి వైఎస్‌, ప్రభుత్వ సలహాదారు కె.వి.పి.రామచంద్రరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నారని ఆరోపించారు. 610 అమలులో భాగంగా స్థానికేతర తెలంగాణ ఉద్యోగులూ వెళ్లిపోతారని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. అయితే ముందుగా ఆంధ్ర ఉద్యోగులనే పంపాలన్నారు. అనంతరం హరీశ్‌ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యోగులను పంపాలని 610 జీవోలో ఎక్కడా లేదని వ్యాఖ్యానించారు. కేవలం ఐదు, ఆరు జోన్ల నుంచి స్థానికేతరులను పంపాలని మాత్రమే అందులో చెప్పారన్నారు. ప్రభుత్వం మెడలు వంచైనా 610ను పూర్తిగా అమలు చేయిస్తామని ఆయన తెలిపారు.

Sunday, July 1, 2007

వై.ఎస్‌, బాబు తెలంగాణ వదిలిపోవాలి: గద్దర్‌ Vaartha

నల్లగొండ, జూలై 1, ప్రభాతవార్త'


ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడులు తెలంగాణను విడిచి పెట్టాలి. అప్పుడే మా నీళ్లు,మా భూమి, మా నిధులు, మా ఉద్యోగాలు అన్నింటికంటే ముఖ్యంగా మా హక్కులు మాకు దక్కుతాయి. తెలంగాణేతరుల పాలనలో ఈ ప్రాంతం రక్తాన్ని చిందించి ఉద్యమాల బాట పట్టింది. ఇకనైనా మా తెలంగాణను మాకు వదిలేసి మీ ప్రాం తానికి బయల్ధేరండి' అంటూ ప్రజా గాయకుడు గద్దర్‌ నిప్పులు కక్కారు. ఆదివారం నల్లగొండ పట్టణంలో తెలంగాణ ఐక్య కార్యచరణ కమిటీ ఏర్పాటుచేసిన సమరభేరి ఆటాపాట కార్య క్రమానికి గద్దర్‌ ముఖ్యఅతిధిగా విచ్చేసి మాట్లాడారు. వై.ఎస్‌ ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయాన్ని చేస్తుందని గద్దర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బూర్జువా పాలకులు తెలంగాణా ప్రజలను మోసం చేయడానికే జి.ఓలు, కమిషన్‌లు, పధ కాలను ప్రవేశపెడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ మోసాలు మాకొద్దుమా తెలంగాణ మాకు కావాలి అని గద్దర్‌ డిమాండ్‌ చేశారు. ఎన్నికలలో ఇచ్చిన హమీలను విస్మరిస్తేనే ప్రభుత్వాలకు, ప్రజా ప్రతినిధులకు వ్యతిరేకంగా ఉద్యమాలు పుట్టు కొస్తాయని చెప్పారు. దగాకోరు వైఎస్‌ ప్రభుత్వాన్ని భూ స్థాపితం చేయాలంటే ఉద్య మాలకే సాధ్యమని అన్నారు. పోతిరెడ్డిపాడు,పులిచింతల ప్రాజెక్టులు కట్టి తెలంగాణ ప్రజలను ముంచిన నీళ్లతో ఆంధ్ర, రాయలసీమ రైతులకు అన్నం పెట్టడానికి వైఎస్‌ కుట్రపన్నుతున్నాడని గద్దర్‌ ఆరోపించారు. తెలంగాణ వాదులు తిరుగుబాటుకు సిద్దమై 'క్విట్‌ తెలంగాణ' నినాదంతో ఉద్యమాలను బలోపేతం చేయాలని ఏవిధంగానూ స్థానికే తరులకు సాయపడద్దని గద్దర్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐక్యకార్యచరణ కమిటీ కన్వీనర్‌ పాశం యాదగిరి పాల్గొన్నారు.

ి '610' రాగాలు Vaartha

వాద ప్రతివాదనలు, వేడి వేడి వ్యాఖ్యలు... వెరసి '610' రాగాలు
జిఒ అమలు పై సర్కార్‌ రాజకీయం
తెలంగాణ ఉద్యోగుల సంఘం
హైదరాబాద్‌, జూలై 1, ప్రభాతవార్త

610 జీవో అమలులోరాజకీయాలకు పాల్పడుతూతెలంగాణ జిల్లాల ఉద్యోగుల్లో అభద్రతా భావాన్ని ప్రభుత్వం కలిగిస్తున్నదని తెలంగాణా ఉద్యోగుల సంఘం ఆరోపించింది. స్థానికేతరులను గుర్తించి వారందరిని పంపించడంలో ఎలాంటి తారతమ్యాలు చూపకుండాన్యాయంగా నడుచుకోవలసిన ప్రభుత్వం ఇక్కడ కూడా కేవలం తెలంగాణ జిల్లాలకు చెందినస్థానికేతరులను మాత్రమేపంపించేలా చర్యలు తీసుకోవడం శోచనీయమని సంఘం నాయకుడు విఠల్‌ అన్నారు. నగర పోలీసు శాఖలో మొత్తం 3200 మంది స్థానికేతర కానిస్టేబుళ్లను గుర్తించారని,ఇందులో రెండు వేలమందిఆంధ్రా ప్రాంతానికి చెందిన వారుకాగా,మిగతా వారు తెలంగాణ జిల్లాలకు చెందిన వారు ఉన్నారని ఆయన పేర్కొన్నారు.ఇందులోఆంధ్రా ప్రాంతం వారిని పంపించడంలోజాప్యం చేస్తూ తెలంగాణ జిల్లాలకు చెందిన కానిస్టేబుళ్లను పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం వెనుక రాజకీయం ఉందని ఆయన ఆరోపించారు.మొదట తెలంగాణ జిల్లాలవారినిపంపించి,610జీవో అంటే ఇదేనని చెబుతూ ఇక్కడి వారిలో అభద్రతా భావాన్ని పాదుకొల్పే కుట్ర సాగుతున్నదని ఆయన తెలిపారు.దాదాపుగాఇదేపల్లవినికాంగ్రెస్‌నాయకులు లగడపాటి రాజగోపాల్‌, గాదెవెంకట్‌రెడ్డిలు అందుకోవడాన్ని విఠల్‌ ఈ సందర్బ ంగా ఉదహరించారు. ఆంధ్రాకు చెందిన కానిస్టేబుళ్లను పంపించే విషయానికి వచ్చేసరికి ఏదో సాకులు చెబుతూ వారు కోర్టులను ఆశ్రయించేలా చేస్తున్నారని తెలిపారు. అలాగే 321 మంది ఎస్‌ఐలు, సిఐలు స్థానికేతరులుగా తేలితే అందులోనలభై మందితెలంగాణ జిల్లాలకు చెందిన వారుండగా,మిగతా వారంతాఆంధ్రా ప్రాంతానికిచెందిన వారని, వీరు జోనల్‌ విధానంలోకి వచ్చినప్పటికీ పంపించడంలో ఎందుకు జాప్యం జరుగుతున్నదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణా జిల్లాలకు చెందిన వారిని మొదట పంపించి, 610 జీవో అంటే ఇదేననే అభిప్రాయాన్ని పెంపొందించి అపోహలకు తావిచ్చేలా ప్రభుత్వం చర్యలు సాగుతున్నాయని, దీనికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని ఆయన హెాచ్చరించారు.
లగడపాటికి మతిభ్రమించింది
ఆంధ్రాహంకారం
అందుకే ఇష్టమొచ్చిన మాటలు: హరీష్‌
సిద్దిపేట అర్బన్‌, జూలై 1, ప్రభాతవార్త
విజయవాడ ఎం.పి.లగడపాటి రాజగోపాల్‌ ఆంధ్రాహాం కారముతోమతిభ్రమించి జి.ఒ.610పై అవగాహన లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీష్‌ రావు ధ్వజమెత్తారు.మెదక్‌జిల్లా సిది ్దపేటలో ఆయన నివాసంలో ఆదివారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. జీవోపై ఆయనకు సరైన అవగాహన లేక టిఆర్‌ఎస్‌కు అవగాహన లేదని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. జీవోలు 390, 415లో ఆంధ్ర పక్షపాత బుద్ది స్పష్టంగా కనిపిస్తోందన్నారు.ఆ జీవోలను కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలే వ్యతిరేకించిన విషయం తెలియదా అని ప్రశ్నించారు. అన్ని తెలంగాణ జిల్లాల్లో నాన్‌ లోకల్‌ వారు ఉన్నారని తెలిపారు. అన్నదమ్ముల్లా విడిపోదామని టిఆర్‌ఎస్‌ కోరుతోంది తప్ప పరాయి దేశంలా వేరుపడదామని కోరడం లేదన్నారు.కరీంనగర్‌ ఉప ఎన్నికల్లోకాంగ్రెస్‌కుతెలంగాణ ప్రజలు బుద్ది చెప్పినా ఇంకా మేలుకోలేదన్నారు.
610 అమలులో ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు
జీవో.610అమలులో ప్రభుత్వానికి ఏ మాత్రంచిత్తశుద్ది లేదనిహరీష్‌ విరుచు పడ్డారు.జీవోఅమలులో తెలంగాణ ప్రజల మధ్య చిచ్చుపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.తెలంగాణేతరులను వెంటనే పంపిపంచాలని డిమాండ్‌ చేశారు.జీవోఅమలుకై టిఆర్‌ఎస్‌ మూడేళ్ళుగా ఓపిక పట్టామని.జీవో ఉల్లం ఘన జరగడం వల్లనే రాష్ట్ర క్యాబినేట్‌నుంచి తప్పుకున్నామని చెప్పారు.జీవో610 పూర్తి స్థాయిలో అమలు చేయకపోతే ముల్కి ఉద్యమం చేపట్టాల్సి వస్తోందని హెాచ్చరించారు.తప్పనిపరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు ప్రత్యక్ష యుద్ధానికిసిద్ధమవుతున్నారని తెలిపారు.ఓపిక నశించి సచీవాలయం ముట్టడికి సిద్ధమయ్యామని చెప్పారు. సచివాలయ ముట్టడికి వస్తున్న వారిని అరెస్టు చేస్తున్నారని, అరెస్టులు చేసినంత మాత్రాన ఉద్యమాన్ని ఆపలేరని హెాచ్చరించారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోమని హెాచ్చరించారు.

610అమలుపై బహిరంగ చర్చకు సిద్ధం andhra jyothi

వినోద్‌కు లగడపాటి సవాల్‌
హైదరాబాద్‌, జూలై 1 (ఆన్‌లైన్‌): ప్రభుత్వోద్యోగులకు సంబంధించిన సమస్యను ప్రాంతీయ విభేదాలుగా మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ప్రయత్నిస్తున్నారని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ఆదేశాలూ, 610 ఉత్తర్వులోని అంశాలపై బహిరంగంగా చర్చించేందుకు తాను సిద్ధమేనని టి ఆర్‌ ఎస్‌ ఎంపీ వినోద్‌కు మరోసారి స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వు అమలును రాజకీయం చేయవద్దని తాను మొదటి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి నేతలను కోరుతున్నానని ఆదివారం 'ఆన్‌లైన్‌'తో మాట్లాడుతూ చెప్పారు.
610 ఉత్తర్వులను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు .. ఈ ఉత్తర్వులను తూ.చ తప్పకుండా అమలు చేస్తే ఎవరికి నష్టం జరుగుతుందో గ్రహించాలని సూచించారు. రాష్ట్రపతి ఆదేశాలు, ఆరు సూత్రాల కార్యక్రమం ప్రకారం జోనల్‌ విధానాన్ని అనుసరించాలని, అదేవిధంగా.. పోలీసు, ఉపాధ్యాయ నియామకాలు జిల్లా యూనిట్‌గా ఉంటున్నందున.. వీటిలో 610 అమలు చేస్తే స్థానభ్రమసం జరిగేది తెలంగాణ ప్రాంత ఉద్యోగులకేనని గుర్తెరగాలని పేర్కొన్నారు.
పైగా.. ఈ సమస్య కేవలం ఉద్యోగులకు మాత్రమే సంబంధించినదని.. దానిని రాజకీయ రాద్ధాంతం చేసేందుకు టిఆర్‌ఎస్‌ నేతలు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఈ అంశాలపై బహిరంగంగా చర్చించేందుకు రావాలని తాను ఎంపీ వినోద్‌ను కోరానని అన్నారు. అయితే.. ఆయన వరంగల్‌లో ఉన్నట్లు చెప్పారని వివరించారు. ఈ అంశంపై ఐదో తేదీన బహిరంగంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని.. అయితే.. ఇంకా సమావేశ స్థలాన్ని ఖరారు చేయలేదని ఆయన చెప్పారు. వాటిని త్వరలోనే వెల్లడిస్తానని అన్నారు.

610పై టిఆర్‌ఎస్‌ రాజకీయం చేస్తోంది: కేకే andhra jyothi

హైదరాబాద్‌, జూలై 1 (ఆన్‌లైన్‌): 'ప్రభుత్వం చిత్తశుద్ధితో నిర్ణీత కాలవ్యవధిలో 610 ఉత్తర్వును అమలు చేయాలని కోరుకుంటోంది .. ఇందుకు సంబంధించి చర్యలు వేగవంత చేసింది .. ఇప్పటికే బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది .. ఇంత కంటే ఏం చేయాలి'అని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు కె.కేశవరావు ప్రశ్నించారు. రాజకీయం కోసమే తెలంగాణ రాష్ట్ర సమితి సచివాలయ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చిత్తశుద్ధిలో లోపమెక్కడుందో చెప్పాలని టిఆర్‌ఎస్‌ నేతలను కోరారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి 610 ఉత్తర్వు అమలు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నదని, సభా సంఘాన్ని కూడా నియమించిందని అన్నారు.
ఇంకా కావాలంటే.. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధమేనని.. అ సమావేశానికి టిఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావును కూడా ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. ఇప్పటివరకూ నాలుగువేల మంది వరకూ స్థానికేతర ఉద్యోగులు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. గత ఇరవై రెండేళ్లుగా 610 ఉత్తర్వుల అమలుపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గాని, ఆ పార్టీలోనే కొనసాగిన కేసీఆర్‌గాని మాట్లాడలేదని కేకే అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేయాలని ప్రయత్నిస్తుంటే.. రాజకీయ రాద్ధాంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎందుకు సచివాలయాలన్ని ముట్టడి చేయాల్సి వస్తోందో తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ప్రజలకు వివరించాలని అన్నారు.
గిర్‌గ్లాని నివేదిక గురించి గాని.. 610 ఉత్తర్వు గురించి గాని టిఆర్‌ఎస్‌ నేతలకు తెలుసా అని ప్రశ్నించారు. లక్షలాది మంది స్థానికేతర ఉద్యోగులు ఉన్నారని అంటున్నారని.. ప్రభుత్వం లెక్కలు తీస్తే.. నాలుగువేల మంది మాత్రమే ఉన్నట్లు తేలిందని.. ఇంకా మరో పదిహేను వందల మంది వరకూ ఉంటే ఉండోచ్చని అన్నారు. టిఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నట్లు లక్షల సంఖ్యలో స్థానికేతర ఉద్యోగులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. 610 ఉత్తర్వు పరిష్కారంపై తెలంగాణ రాష్ట్ర సమితికి చిత్తశుద్ధి లేదని .. ఆ సమస్య పరిష్కారమైతే.. ఇక మాట్లాడేందుకు ఆ పార్టీకి ఏ అంశమూ ఉండదని కేకే అన్నారు. గతంలో 399,415 ఉత్వర్వులను వ్యతిరేకిస్తూ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారని.. ఇప్పుడు వాటిని అనుసరించే మార్గదర్శకాలు రూపొందించి, బదిలీల ప్రక్రియను చేపట్టారని పేర్కొన్నారు.

ఆంధ్రా అధికారులతో 610 సాధ్యం కాదు andhra jyothi

హైదరాబాద్‌, జూలై 1 (ఆన్‌లైన్‌) : ఆంధ్రా అధికారులతో 610 ఉత్తర్వు అమలు సాధ్యం కాదని శాసనమండలి సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి భావిస్తున్నట్టుగా ఈ ఉత్తర్వును చిత్తశుద్ధితో అమలు చేయాలంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉత్తరాదికి చెందిన అధికారిని నియమించాలని పేర్కొన్నారు. అదేవిధంగా సాధారణ పరిపాలనా విభాగం కార్యదర్శిగానూ, హోం శాఖ కార్యదర్శిగానూ ఆంధ్రా ప్రాంతానికి చెందిన అధికారులకు బదులు ఇతర ప్రాంతాలకు చెందినవారే ఉండడం మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
స్థానికేతర ఉద్యోగులు లక్షల్లో ఉంటే.. కేవలం నాలుగువేల మంది మాత్రమేనని అధికారులు పేర్కొనడంతోనే.. ఆంధ్రా ప్రాంత అధికారులతో 610 అమలు సాధ్యం కాదని తేలిపోయిందని పేర్కొన్నారు. ఏయే విభాగాల్లో ఎందరెందరున్నారన్న సమాచారాన్ని 1975 నుంచి వెలికి తీస్తే.. స్థానికేతరుల అసలు సంఖ్య బయట పడుతుందని అన్నారు. 610 ఉత్తర్వులను ఆరుసూత్రాల కార్యక్రమం స్ఫూర్తితో అమలు చేయాలని ఆయన కోరారు.

ముగిసిన తెలంగాణ మేధావుల సదస్సు andhra jyothi

తార్నాక, జూలై 1 (ఆన్‌లైన్‌): చారిత్రక తెలంగాణ ప్రాంతంలో జరిగిన సామాజిక, రాజకీయ, ఆర్థికపరమైన పోరాటాల్లో అణగారిన మెజారిటీ కులాలే ప్రముఖ పాత్ర పోషించాయని, అయితే అల్ప సంఖ్యాక ఆధిపత్య కులాల కుట్ర వల్ల వారి త్యాగాలకు గుర్తింపు లేకుండాపోయిందని విశ్వవిద్యాలయాల అధ్యాపకులు, మేధావులు అభిప్రాయపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో పీపుల్స్‌ తెలంగాణ ఫౌండేషన్‌ ఆద్వర్యంలో 'పీపుల్స్‌ తెలంగాణ' అంశంపై రెండు రోజుల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా పలువురు అధ్యాపకులు వివిధ అంశాలపై ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమాలపై దృక్ప«థాలు అనే అంశంపై డాక్టర్‌ తిరుమల మాట్లాడుతూ భూమి కోసం తెలంగాణ ప్రజలు 1940లో జరిపిన సాయుధ పోరాటం కంటే ముందు నుంచే సర్దార్‌ పాపన్న వంటి వీరుల నాయకత్వంలో పోరాటాలు చేశారన్నారు.
కులం, మతం, తెలంగాణ ఉద్యమ ప్రజాస్వామీకరణ అనే అంశంపై ప్రొఫెసర్‌ సింహ్రాద్రి మాట్లాడుతూ 1956లో తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పేరిట ఆంధ్ర ప్రాంతంలో కలపడం నుంచి నేటి టి.ఆర్‌.ఎస్‌. పార్టీ చేస్తున్న స్వార్థ రాజకీయ ప్రక్రియ వరకు మెజారిటీ ప్రజలు సమస్యలను పట్టించుకోలేదని అన్నారు. వారి సమస్యలతో సంబంధం లేకుండా అల్ప సంఖ్యాక ఆధిపత్య కులాల ప్రయోజనం కోసం పని చేశారని పేర్కొన్నారు. తెలంగాణలో కులం - అంబేద్కర్‌ దృక్ప«థం అంశంపై డాక్టర్‌ మల్లేశం మాట్లాడుతూ చిన్న రాష్ట్రాల ఏర్పాటు ప్ర«ధానంగా సామాన్యుడి సమస్యలైన కుల, పితృస్వామిక ఆధిపత్యాలను కట్టడి చేస్తుందన్నారు. అంబేద్కర్‌ ఆలోచనా విధానాలు-చిన్న రాష్ట్రాల ఏర్పాటు అనే అంశంపై డాక్టర్‌ జి.వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ నేటి దేశ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బహుజన సమాజ్‌ వంటి పార్టీల ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం జరగాలని అభిప్రాయపడ్డారు.

రాయలసీమ ఉద్యోగులపై చెయ్యేస్తే... తీసేస్తాం eenadu

ఆంధ్రావాళ్ల లుంగీలు త్వరగా లాగండి
అప్పుడైనా మా వాళ్లకు రోషం వస్తుంది
తిరుమల నిధులు మళ్లిస్తే వూరుకోం
హైదరాబాద్‌ మీరు తీసుకుంటే... శ్రీశైలం నీళ్లు మేం
తీసుకుంటాం
టీజీ వెంకటేష్‌ వ్యాఖ్యలు
కర్నూలు, నంద్యాలటౌన్‌- న్యూస్‌టుడే
610 జీవో అమలుపై జరుగుతోన్న రగడ నేపథ్యంలో రాయలసీమ హక్కుల ఐక్య వేదిక అధ్యక్షుడు టీజీ వెంకటేష్‌ మళ్లీ గళమెత్తారు. తెరాసపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ సోమవారం చేపడుతున్న సెక్రటేరియట్‌ ముట్టడి కార్యక్రమం సరికాదన్నారు. రాయలసీమ ఉద్యోగులపై చెయ్యేస్తే... చెయ్యి తీస్తామని హెచ్చరించారు. సీమ ఉద్యోగుల రక్షణకు ఓ సేనను తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం కర్నూలు, నంద్యాలల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ''నాడు ఉద్యోగాలకు అర్హులైన వారు దొరక్కపోవడంతో కోస్తా, రాయలసీమ నుంచి వెళ్లారు. ఇప్పుడు అక్కడ నుంచి వెళ్లమనడం సబబు కాదు'' అని పేర్కొన్నారు. ''హైదరాబాద్‌లో ఆంధ్రావాళ్ల లుంగీలు లాగుతామంటున్నారు. అదేదో తొందరగా చేయండి. అప్పుడన్నా మావాళ్లకు రోషం వచ్చి సీమ అభివృద్ధికి కృషి చేస్తారు'' అని టీజీ ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ మా అబ్బ సొత్తు అని తెరాస ఎమ్మెల్యే హరీష్‌ పేర్కొనడాన్ని ఆయన గుర్తుచేశారు. ఆ లెక్కన శ్రీశైలం డ్యాం తమ అబ్బ సొత్తుగా టీజీ పేర్కొన్నారు. ''దీనికి ఒప్పుకునేందుకు వారు సిద్ధంగా ఉంటే... పెద్దవాళ్లం కూర్చొని మాట్లాడుకుంటాం'' అని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 'ఓవర్‌ యాక్టివ్‌'తో 610జీవో అమలుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ''610జీవో అమలైతే తెలంగాణ సమస్య సమసిపోతుందని వైఎస్‌ భావిస్తున్నారు. ఆ సమస్య తీరదన్న విషయం ఆయన అర్థం చేసుకోవాలి'' అని పేర్కొన్నారు. రాయలసీమలో ఉన్న తిరుపతి, శ్రీశైలం ఆలయాలకు వచ్చే నిధుల్ని సీమలోనే వినియోగించాలని టీజీ డిమాండ్‌ చేశారు. వేరే ప్రాంతాల్లో ఆ నిధుల్ని వినియోగిస్తే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కోస్తా, తెలంగాణలో ఉన్న దేవాలయాలకు అత్యుత్సాహంతో తిరుపతి నిధులను మళ్లించారని... పుష్కరాలప్పుడు కూడా ఇదే విధంగా వాడారని విమర్శించారు. రాయలసీమకు చెందిన విద్యుత్‌ బోర్డులు రెండూ కోస్తా, తెలంగాణలో ఉన్నాయని, వాటిని వెంటనే సీమలో ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. హైకోర్టు బెంచ్‌తో పాటు, కొత్త జిల్లాలను కూడా ఏర్పాటు చేయాలన్నారు. రాయలసీమ, కోస్తా ప్రాంతాలు వరదలతో సతమతమవుతుంటే... తెరాస సభ్యులు 610జీవో అమలుపై రాజకీయం చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. ''కష్టాల్లో ఉన్నప్పడు కనీస సానుభూతి కూడా చూపించరా? మనిషిగా పుట్టిన వారిలా చేస్తారా?... ధర్నా చేస్తాం... ముట్టడి చేస్తాం అని ఇప్పుడా అనేది? కేసీఆర్‌ తెదేపాలో ఉన్నప్పుడు జీవో అమలుపై మాట్లాడకుండా కుంభకర్ణుడిలా నిద్రపోయారా?'' అని తీవ్రంగా మండిపడ్డారు.
వల్లభాయ్‌పటేల్‌ హైదరాబాద్‌ను విముక్తి చేయకపోతే చరిత్రలో అదో మినీ పాకిస్థాన్‌గా మిగిలేదని టీజీ పేర్కొన్నారు.

ఉద్యమంలోకి విద్యార్థులు eenadu

ప్రతి కళాశాలలో తెరాస కమిటీలు
తెలంగాణ భవన్లో ప్రత్యేక శిక్షణ
జిల్లాస్థాయి నేతలకు కేసీఆర్‌ నిర్దేశం
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
విద్యార్థుల భాగస్వామ్యంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని కొత్తపుంతలు తొక్కించాలని తెరాస పథక రచన చేస్తోంది. ఇందుకోసం ఒక విస్తృత కార్యాచరణను రూపొందించింది. ఆరేళ్ల తెరాస ప్రస్థానంలో విద్యార్థులు పూర్తిస్థాయిలో క్రియాశీల పాత్ర పోషించిన సందర్భాలేవీ లేవు. వారు ఉద్యమంలోకి వస్తే ఉద్రిక్త సమయాల్లో హింసాకాండ చెలరేగవచ్చనీ, దాన్ని అదుపు చేయడం కష్టమనే భావన అధినేత కేసీఆర్‌లో ఉందని ఆ పార్టీ వర్గాలంటాయి. కానీ గ్రామస్థాయిలో పట్టును పదిల పరుచుకుని, పట్టణ ప్రాంతాల్లో విస్తరించడానికి విద్యార్థి శక్తి అత్యవసరమని తెరాస అధినాయకత్వం ఇప్పుడు గట్టిగా విశ్వసిస్తోంది. తెలంగాణలోని ప్రతి కళాశాలలోనూ పార్టీకి బలమైన విద్యార్థి విభాగం ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆదివారం ఇక్కడి తెలంగాణ భవన్లో తెరాస జిల్లాస్థాయి నేతలతో జరిపిన భేటీలో కేసీఆర్‌ ఈ మేరకు స్పష్టంగా నిర్దేశించారు. ఇంటర్‌ స్థాయి నుంచి ప్రతి కళాశాల ముందూ తెరాస పోస్టర్లుండాలని, పార్టీ జెండాను రెపరెపలాడించాలని వారికి సూచించారు. 'ఆరేళ్ల ఉద్యమంలో విద్యార్థుల పాత్రను మనం ఆశించలేదు. వారినెప్పుడూ తెరపైకి తీసుకురాలేదు. కానీ ఇప్పుడు పార్టీ కార్యకలాపాల్లో వారి పాత్రను పెంచాల్సిన తరుణం వచ్చింది' అని ఆయన అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జూనియర్‌ ఇంటర్‌ స్థాయి కళాశాలలోనూ పార్టీ కమిటీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వారం రోజుల్లోఈ పని పూర్తి చేయాలని ఆదేశించారు. 'ప్రతి నాయకుడూ ప్రత్యక్షంగా కళాశాలకు వెళ్లాలి. 300 మంది విద్యార్థులుంటే 15 మందితో, అంతకు మించితే 24 మందితో కమిటీని ఏర్పాటు చేయాలి. వాటిల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 51 శాతం ఉండేలా జాగ్రత్త వహించాలి' అని సూచించారు. ఎంపిక చేసిన విద్యార్థులకు తెలంగాణ భవన్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివిధ రంగాల ప్రముఖులు వారికి వివరిస్తారు. అనంతరం ప్రతి విద్యార్థీ కొన్ని వందల మందిని చైతన్యపరచాలని నిర్దేశిస్తారు. కరీంనగర్‌ ఉప ఎన్నికలో తన విజయంలో విద్యార్థులు ప్రముఖ పాత్ర పోషించారని, ఆ సమయంలో వారి శక్తియుక్తులు ప్రస్ఫుటంగా కన్పించాయని ఈ సందర్భంగా కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.
మరోవైపు తెలంగాణలోని ప్రతి మండల కేంద్రంలో కళాకారులతో ధూంధాం కార్యక్రమం నిర్వహించాలని కూడా ఆయన తలపోస్తున్నారు. ఇందుకోసం 50 సీట్లతో ఒక పెద్ద బస్సును ప్రత్యేకంగా తయారు చేయించారు. లంబాడీలను కూడా ధూంధాంలో భాగస్వాములను చేయాలని పార్టీ నేతలను అధినేత నిర్దేశించారు.

గుర్జర్లలా ఉద్యమిస్తాం: కేసీఆర్‌ eenadu

610పై కేసీఆర్‌
మావారిని అడ్డుకుంటారా?
ఇలాగైతే తెలంగాణ అగ్నిగుండమే
వైఎస్‌ మాడి మసవుతాడు
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: 610 జీవో అమలు కోరుతూ సచివాలయ ముట్టడికి పలు జిల్లాల నుంచి తరలి వస్తున్న తమ కార్యకర్తల్ని ప్రభుత్వం అరెస్టు చేయిస్తోందని తెరాస అధినేత కేసీఆర్‌ ఆరోపించారు. వారందరినీ తక్షణం విడిచి పెట్టని పక్షంలో తెలంగాణ అగ్నిగుండమవుతుందని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. తెలంగాణతో పెట్టుకుంటే ముఖ్యమంత్రి వైఎస్‌ మాడి మసవక తప్పదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎవరిపైనో దాడిచేసే ఉద్దేశంతో తామీ పిలుపివ్వలేదని స్పష్టం చేశారు. సచివాలయం, అసెంబ్లీల ముట్టడి ముందునుంచీ ఉన్నదేనని గుర్తుచేశారు. హైదరాబాద్‌లోని పాతబస్తీ నుంచి పెద్దసంఖ్యలో ముస్లిం మైనారిటీలు ఆదివారం తెరాసలో చేరారు. ఈ సందర్భంగా ఇక్కడి తెలంగాణభవన్లో వారినుద్దేశించి కేసీఆర్‌ ప్రసంగించారు. బిందుసేద్యం కోసం జారీచేసిన జీవో 34ను 'యమడేంజర్‌ జీవో'గా ఆయన అభివర్ణించారు. దాన్ని తక్షణం రద్దుచేయని పక్షంలో రాజస్థాన్‌లో గుజ్జర్ల మాదిరిగా తెలంగాణ అంతటా రోడ్లను దిగ్బంధిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పాలనను పూర్తిగా స్తంభింపజేస్తామన్నారు. 'చిట్టచివరి స్థానికేతర ఉద్యోగిని కూడా తెలంగాణ నుంచి పంపేదాకా విశ్రమించేది లేదు. తెలంగాణలో ఆంధ్ర పెత్తందార్ల పెత్తనాన్ని ఇకపై సహించబోం. 50 ఏళ్లుగా వారు తెలంగాణను లూటీ చేసిందిచాలు. తెలంగాణలో భూకబ్జాలన్నీ వారి ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. పైగా హైదరాబాద్‌ ఎవడబ్బ సొమ్మని ఆంధ్ర నేతలు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌ మా అబ్బ సొమ్మే. హైదరాబాద్‌ కోసం కిరికిరి చేయడానికి వారేమైనా మక్కా మసీదుకు పునాది తవ్వారా?'అని ఆవేశంగా ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక ఐదారుగురు ముస్లిం మైనారిటీలకు మంత్రి పదవులతోపాటు 12 శాతం రిజర్వేషన్లు కూడా కల్పిస్తామని చెప్పారు.

స్వరాష్ట్రంలోనే స్థానికేతరులమా? eenadu

మా పిల్లలు ఇక్కడే లోకల్‌
వారిని వదిలిపెట్టి ఎలా వెళ్లమంటారు?
ఇవన్నీ బలవంతపు బదిలీలే
610పై స్థానికేతర కానిస్టేబుళ్ల ఆరోపణ
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
రాష్ట్రపతి ఉత్తర్వులు, 610 జీవోల పేర్లు చెప్పి తమని బలవంతంగా హైదరాబాద్‌ నుంచి పంపిస్తున్నారని నగర పోలీసు విభాగంలోని కానిస్టేబుళ్లు ఆరోపిస్తున్నారు. సరైన మార్గదర్శకాలు, నియమనిబంధనలు లేకుండా కేవలం కొందరు నేతల బ్లాక్‌మెయిల్‌కి ప్రభుత్వం తలొగ్గి తమకు అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నేపథ్యంలో బదిలీ కాబోతున్న దాదాపు 600 మంది కానిస్టేబుళ్లు ఆదివారమిక్కడ సమావేశమయ్యారు. ఎవరికి వారు ఈ బదిలీ ఉత్తర్వుల్ని న్యాయస్థానంలో సవాల్‌ చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ... ''1985 నుంచి గుర్తుకురాని 610 జీవో ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చింది. కేవలం కొందరు రాజకీయనాయకులు ఒత్తిళ్లకు తలొగ్గే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. బదిలీ ఉత్తర్వులు సైతం అస్పష్టంగా ఉన్నాయి. సాధారణంగా వాటిపై డీఓ (డిపార్ట్‌మెంటల్‌ ఆర్డర్‌) నంబరు ఉంటుంది. అయితే ఈ అన్యాయమైన బదిలీలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించకుండా ఉండేందుకే డీఓ నంబర్లు లేకుండా ఉత్తర్వులు ఇస్తున్నారు. కానిస్టేబుళ్ల సొంత జిల్లాలకు సంబంధించి జోన్ల వారిగా జాబితాలు విడుదల చేసి కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీ చేస్తున్నారు. సొంత జిల్లాలకు వెళ్లిన వారు అక్కడ ఎస్పీలకు రిపోర్ట్‌ చేసి తిరిగి హైదరాబాద్‌ రావచ్చంటూ చెబుతున్న మాటల్లో వాస్తవం లేదు. ఏళ్లకొద్దీ ఉన్న సర్వీసును కోల్పోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. అమెరికాలో సైతం కొన్నేళ్లుంటే అక్కడి పౌరసత్వం లభిస్తుంది. అలాంటిది పక్క జిల్లాల నుంచి వచ్చి కొన్నేళ్లుగా ఇక్కడుంటున్న వారు స్థానికేతరులు ఎలా అవుతారు? మా పిల్లలు ఇక్కడ లోకల్‌... మరి వారిని విడిచిపెట్టి ఎలా వెళ్లాలి. హైదరాబాద్‌ని ఫ్రీజోన్‌ అని ప్రకటించిన తర్వాతే మేము దరఖాస్తు చేశాం. అలా పేర్కొని మమ్మల్ని తప్పుదోవ పట్టించిన వారిని ప్రాసిక్యూట్‌ చేయాలి. ఫ్రీజోన్‌గా ప్రకటించినప్పుడు ఈ తెలంగాణవాదులు ఏమయ్యారు? మేము వెళ్లిపోతున్నట్లే కేసీఆర్‌ సైతం తన నియోజకవర్గం సిద్ధిపేటకే పరిమితం కావాలి. 1973లో వచ్చిన ఆరు సూత్రాల ప్రణాళిక ప్రకారం నగర పోలీసులు, సచివాలయ ఉద్యోగులు 610 నుంచి మినహాయింపని స్పష్టంగా పేర్కొన్నారు. ప్రస్తుతం దాన్నీ బుట్టదాఖలు చేశారు'' అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారంతా ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, కేసీఆర్‌, హరీష్‌రావు, టీఆర్‌ఎస్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పోలీసుల జాబితా సిద్ధం
నేడో రేపో ఉత్తర్వులు
610 జీవో నేపథ్యంలో నగర పోలీసు విభాగంలో బదిలీలు పూర్తిచేయడానికి రంగం సిద్ధమైంది. ఈ జీవో కింద నగర కమిషరేట్‌ నుంచి 2643 మంది తమ సొంత జిల్లాలకు వెళ్లనున్నారు. ఇప్పటికే 2 విడతలుగా 248మందిని బదిలీ చేశారు. మిగిలినవారి జాబితా సిద్ధం చేశారు. తూర్పు మండలంలో 198, దక్షిణ మండలంలో 332, మధ్య మండలంలో 213, ఉత్తర మండలంలో 283, పశ్చిమ మండలంలో 323, ట్రాఫిక్‌లో 318, సాయుధ దళంలో 586, స్పెషల్‌ బ్రాంచ్‌లో 60, సీసీఎస్‌లో 82 మంది బదిలీ కానున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు సోమ, మంగళవారాల్లో వెలువడే అవకాశం ఉంది. తొలుత సొంత జిల్లాలకు బదిలీ చేసి, ఆ వెంటనే డిప్యుటేషన్‌పై తీసుకువస్తారని తెలుస్తోంది.

సొంత జిల్లాలకు టీచర్ల పయనం eenadu

రంగారెడ్డి జిల్లా: 610 జీవోకు అనుగుణంగా సొంత జిల్లాలకు వెళ్లిపోవడానికి దరఖాస్తు చేసుకొన్న రంగారెడ్డి జిల్లాలోని 372 మంది ఉపాధ్యాయుల్లో 214 మందికి బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. శనివారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా తమ తమ జిల్లాలకు వెళ్లిపోవడానికి దరఖాస్తు చేసుకొన్నారు. ఆ మేరకు వారికి ఆదివారం అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. జిల్లాలో పనిచేస్తున్న వివిధ ప్రాంతాలకు చెందిన స్థానికేతర ఉపాధ్యాయులు.. కుటుంబ సభ్యులతో సహా కలెక్టరేట్‌కు వచ్చారు. కలెక్టరేట్‌లో ఉత్తర్వులు తీసుకుని అక్కడి నుంచే నేరుగా సొంత జిల్లాలకు వెళ్లేందుకు వారు ఇలా పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు, సామగ్రితో సహా వచ్చారు. దీంతో అక్కడ సందడిగా కనిపించింది. ప్రస్తుతం 610 జీవో అమలు తొలి దశలో భాగంగా స్వచ్ఛంద బదిలీలు జరుగుతున్నాయి.