Friday, December 28, 2007

బడుగుల దేవుడు అస్తమయం, andhra Jyothi, 29th Dec, 07

అనుచరుల ఒడిలో ఒరిగిపోతూ...
గుడిసె బెదిరింది. పేద గూడు వణికింది. నిలువెల్లా బాధతో భాగ్యనగరపు మురికవాడంతా విలవిలలాడింది. వలవలా ఏడ్చింది. పేదల గుండె గుడిలో కొలువైన జన్నన్న... గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యారు. 'అన్నా' అని పిలిచిన వెంటనే 'నేనున్నా' అంటూ జరూరుగా ఉరికురికి వచ్చే 'బడుగుల దేవుడు' పి.జనార్దన్‌రెడ్డి అనుకోకుండా అస్తమించారు. అనంత లోకాలకు వెళ్లిపోయారు. 60 ఏళ్లు నిండకుండానే ఆయువు చాలించారు. 30 ఏళ్ల పాటు కాంగ్రెస్‌ పార్టీయే ఊపిరిగా జీవించిన ఈ మడమతిప్పని పోరాట యోధుడు... చివరికి కాంగ్రెస్‌ వ్యవస్థాపక దినోత్సవం రోజునే... పార్టీ జెండా ఎగరేసిన కాసేపటికే ప్రాణాలు వదిలారు.
ఇందిరాగాంధీ కుటుంబానికి అచంచల విధేయుడైన ఈ నాయకుడి నోటివెంట చివరగా వెలువడిన మాట 'ఇందిరమ్మ'! భాగ్యనగర రాజకీయాలే ఆలంబనగా... జనం సమస్యలే సోపానాలుగా... ఒక్కో మెట్టూ ఎదిగిన ఈ గరీబోల్ల బిడ్డ... ఆ మహానగర రహదారిపైనే రాలిపోయారు. అచేతనంగా వాలిపోయారు. పిలిస్తే రాని పెళ్లిలేదు. పలకరిస్తే మాట్లాడని క్షణం లేదు. పట్టించుకోని సమస్య లేదు సీ ఎల్పీ మాజీ నేత, మాజీ మంత్రి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే అయిన 59 ఏళ్ల పి.జనార్దన్‌ రెడ్డి ప్రజల్లోంచి పుట్టిన నాయకుడు.. ప్రజానాయకుడు! ప్రజా సమస్యలే ఆయుధాలుగా... స్వపక్షంలోనే విపక్షంగా... హీరోచిత పోరాటాలు చేసిన సాహసికుడాయన. పాలకులు సొంత పార్టీ వారైనా రాజీ పడకుండా... పక్కలో బల్లంలా మారి పరేషాన్‌ చేసిన వీరుడాయన. కేవలం 26 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నాయకుడిగా ఉంటూ కూడా... బలమైన ప్రభుత్వాన్ని గడగడలాడించి... కాంగ్రెస్‌ పరువు కాపాడిన ధీరుడాయన.
నేడు జంటనగరాల జనం కృష్ణా నీళ్లు తాగుతున్నారంటే అది పీజేఆర్‌ పుణ్యమే! ఆయన... కార్మిక నాయకుడు అంజయ్య శిష్యుడు. ఆరంభంలో కార్మికుడు. ఆజన్మాంతం కార్మిక నేత. అట్టడుగు నుంచి... పేద కుటుంబం నుంచి ఎదిగిన ఆయన చివరి వరకూ పేదల్ని విడవలేదు. హైదరాబాద్‌ బ్రదర్స్‌లో ఒకడిగా పేరుగాంచిన పీజే ఆర్‌ పేరు ప్రస్తావించకుండా రాజధాని రాజకీయం గురించి మాట్లాడడం అసంభవం. పీజేఆర్‌ అకాల మృతి... రాజకీయ నాయకుల్ని, రాష్ట్ర ప్రజల్ని విస్తుపోయేలా చేసింది. నిన్నటికి నిన్న పాకిస్థాన్‌లో మాజీ ప్రధాని బేనజీర్‌భుట్టో దారుణ హత్య వార్త నుంచి ఇంకా తేరుకోక ముందే, మరో దిగ్భ్రాంతికర విషయాన్ని విని జనం నివ్వెరపోయారు.
హైదరాబాద్‌, డిసెంబర్‌ 28 (ఆన్‌లైన్‌): బడుగు జీవుల అన్న, కార్మిక లోకం ప్రతినిధి పి.జనార్దన్‌రెడ్డి (పీజేఆర్‌) శుక్రవారం అకస్మాత్తుగా కన్నుమూశారు. తీవ్రమైన గుండెపోటుకు గురైన పీజేఆర్‌ను ఆయన అనుయాయులు ఆసుపత్రికి తరలిస్తుండగామార్గమధ్యంలోనే తుది శ్వాస విడిచారు. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు గాంధీభవన్‌లో పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న పీజేఆర్‌, ఆ తర్వాత సికింద్రాబాద్‌లోని జువెల్‌ గార్డెన్స్‌లో గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల సందర్భంగా నగర కాంగ్రెస్‌ కమిటీ ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లారు.
పీజేఆర్‌ వాహనం నుంచి దిగగానే ఆయన అభిమానులు "పీజేఆర్‌ జిందాబాద్‌'' అంటూ ఆయనను ఎత్తుకోబో యారు. ఆయన అభిమానుల్ని వారిస్తూ... "నన్ను కాదు. ఇందిరమ్మ జిందాబా ద్‌ అనండి'' అంటూ సమావేశ ప్రాంగణం వైపు రెండడుగులు వేశారో లేదో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీనితో తీవ్ర ఆందోళనకు గురైన అనుయా యులు వెంటనే ఆయన్ను సమీపంలోని కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. వెంటనే రంగంలోకి దిగిన కిమ్స్‌ వైద్యులు చికిత్స చేపట్టారు. ఈసీజీ తీశారు. నాడి స్పందన, అవసరమైన రక్తపోటు కనిపించలేదు.
ఒకవైపు గుండెలపై మసాజ్‌ చేస్తూనే, మరోవైపు ఐ.వి. ఫ్లూయిడ్స్‌ ఎక్కించారు. అయినా ఫలితం కనిపించ లేదు. ఆయన గుండెకు రక్తాన్ని పంపించే నాలుగు కవాటాల్లో ఒకదానికి రక్త ప్రసరణ లేదని, మధుమేహం, మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న పీజే ఆర్‌ తీవ్ర గుండెపోటుతో మార్గమధ్యంలోనే మరణించినట్లు భావిస్తున్నామని కిమ్స్‌ సీఈవో డాక్టర్‌ బి.భాస్కరరావు చెప్పారు. పీజేఆర్‌ అంత్యక్రియలను అంబ ర్‌పేట స్మశాన వాటికలో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు అధికార లాంఛనా లతో జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్పమొయిలీ, మాజీ ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ సహా పలువురు నేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. పీజేఆర్‌ ఇంటి నుంచి శనివారం ఉదయం 9 గంటలకు భౌతికకాయాన్ని గాంధీభవన్‌కు తరలించి అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం గాంధీభవన్‌ నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది.
పీజేఆర్‌ మృతికి సంతాపసూచకంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు శనివారం సెలవు ప్రకటించారు. దేశంలో అతిపెద్ద శాసనసభ నియోజకవర్గమైన ఖైరతాబాద్‌లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పీజేఆర్‌ మరణంతో కాంగ్రెస్‌ పార్టీ గొప్ప పోరాట యోధుణ్ని కోల్పోయింది. రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎదురులేని నేతగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్‌ ను అనేక అంశాలపై పీజేఆర్‌, మర్రి శశిధర్‌ రెడ్డిలు ఢీ కొట్టి హైదరాబాద్‌ బ్రదర్స్‌గా పేరొందారు. రాష్ట్ర నాయకత్వం కంటే కూడా పార్టీ కేంద్ర నాయక త్వాన్నే ఎక్కువ నమ్మిన పీజేఆర్‌ తన చివరి క్షణాల్లో కూడా ఇందిరమ్మ పేరునే ఉచ్చరించడం విశేషం. భవిష్యత్తులో గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరే షన్‌ ఎన్నికలు రాబోతున్న తరుణంలో పీజేఆర్‌ ఆకస్మిక మరణం కాంగ్రెస్‌ పార్టీకి తీరని నష్టమే.
తెలంగాణ సమస్యలపై సొంత ప్రభుత్వంపైనే గళమెత్తి ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న పీజేఆర్‌ మరణం తెలంగాణవాదులను తీవ్ర విచా రంలో ముంచెత్తిందంటే అతిశయోక్తి కాదు. పీజేఆర్‌ తీవ్ర అనారోగ్యానికి లోనయ్యారన్న సమాచారం తెలుసుకున్న వెంట నే పార్టీ ముఖ్యులు వి.హనుమంతరావు, ముఖేష్‌ గౌడ్‌, నాగేందర్‌ తదితరులు కిమ్స్‌కు చేరుకున్నారు. అప్పటికే పీజేఆర్‌ మరణించారని వైద్యులు తెలపడంతో భిన్నులయ్యారు. వీహెచ్‌ భోరున ఏడ్చారు. ఏఐసీసీ కార్యదర్శి ఇక్బాల్‌సింగ్‌, ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.జనార్దనరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.పి.రామచంద్రరావు, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌ రావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణలతో పాటు పలువురు కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, టీడీపీ ఎమ్మెల్యేలు కిమ్స్‌కు వెళ్ళి నివాళులర్పించారు.
అనంతరం పీజేఆర్‌ భౌతికకాయాన్ని దోమలగూడలోని ఆయన నివాసానికి తరలించారు. పీజేఆర్‌ మరణవార్త నగరంలో దావానలంలా వ్యాపించింది. నగ రంలో 'స్వచ్ఛంద బంద్‌' జరిగింది. పలుచోట్ల వ్యాపార కేంద్రాలను, విద్యాల యాలను స్వచ్ఛందంగా మూసివేశారు. జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడిని కూడా సంతాపసూచకంగా మూసివేశారు. పీజేఆర్‌ మరణవార్త తెలుసుకున్న నగర ప్రజలు, బస్తీ వాసులు, మురికివాడల బడుగు జీవులు పెద్దసంఖ్యలో ఆయన నివాసానికి చేరుకున్నారు. తమ ఆత్మీయుడిని కోల్పోయామంటూ మురికివాడల ప్రజలు గుండెలవిసేలా రోదించారు. ముఖ్యమంత్రి తన అధికార కార్యమ్రాలన్నీ రద్దు చేసుకున్నారు.

No comments: