Friday, December 28, 2007

పీజేఆర్‌ హఠాన్మరణం, Eenadu, 29th, Dec.07




పార్టీ వేదిక వద్ద గుండెపోటు ఆసుపత్రికి చేర్చేలోపు మృత్యువాత మహానగరం దిగ్భ్రాంతి శోకసంద్రంలో అభిమానులు నేతల అశ్రు నివాళి నేడు అంత్యక్రియలు గ్రేటర్‌ హైదరాబాద్‌కు సెలవు హైదరాబాద్‌ - న్యూస్‌టుడే



పిలిస్తే పలికే నాయకుడు... కష్టాలెన్ని ఎదురైనా తుదిశ్వాస వరకు పార్టీ ఒడిలోనే బతకాలని తపించే కాంగ్రెస్‌వాది... అధిష్ఠానం ముందు తన వైఖరి కుండబద్దలు కొట్టే నిర్మొహమాటి... సమస్యలపై పోరాటంలో రాజీలేని యోధుడు... కార్యకర్తలకు గుర్తింపు లేకపోతే ఇబ్బంది తప్పదని తరచూ హెచ్చరించే హితైషి... కార్మిక నాయకుడు... ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే పి.జనార్దన్‌రెడ్డి హఠాన్మరణం పాలయ్యారు. శుక్రవారం హైదరాబాద్‌ నగర పార్టీ సమావేశంలో అభిమానించే కార్యకర్తల ఒడిలో కన్నుమూశారు. సికింద్రాబాద్‌ జ్యువెల్‌ గార్డెన్‌లో కాంగ్రెస్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ శాఖ నిర్వహిస్తున్న పార్టీ వ్యవస్థాపక దినోత్సవ సభలోకి నడుచుకుంటూ వస్తున్న పీజేఆర్‌హఠాత్తుగా తీవ్రమైన గుండెపోటుతో కుప్పకూలి పోయారు. కార్యక్తలు ఆయన్ను ఆసుపత్రికి తరలించే లోగానే మరణించారు.
పీజేఆర్‌ జ్యువెల్‌ గార్డెన్‌కు వచ్చేసరికి సమయం ఉదయం పదిన్నర గంటలైంది. వేదికపై ముఖ్యమంత్రి వైఎస్‌ ప్రసంగిస్తున్నారు. నగరంలో ముఖ్యనేత పీజేఆర్‌ రాకపోవడంతో ఆయన అనుచరులంతా గార్డెన్‌ బయట వేచి ఉన్నారు. పది నిమిషాల్లో పీజేఆర్‌ వచ్చారు. 'పీజేఆర్‌ జిందాబాద్‌' నినాదాలతో ప్రాంగణం మారుమోగింది. కారుదిగి ఇరవై అడుగులు వేశారో లేదో పీజేఆర్‌ ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. పక్కనే ఉన్న అనుచరులు వెంటనే కారు వెనక సీట్లో పడుకోబెట్టారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.
మరోపక్క నగర కాంగ్రెస్‌ నేతలు పీజేఆర్‌కు స్వల్ప అస్వస్థత వచ్చిందని భావించి కార్యక్రమాన్ని యధావిధిగా కొనసాగించారు. ఎంపీ అంజన్‌ కుమార్‌ యాదవ్‌ ప్రసంగించాక పీజేఆర్‌ మరణవార్త తెలిసింది. విషయాన్ని చెప్పకుండా 'పీజేఆర్‌ అన్న సీరియస్‌గా ఉన్నారు. కార్యక్రమాన్ని ముగిస్తున్నాం' అని దానం నాగేందర్‌ చెప్పారు. వారంతా కిమ్స్‌ ఆసుపత్రికి బయలు దేరారు.
కిమ్స్‌ ఆసుపత్రి వద్ద వైద్యులు పీజేఆర్‌ను పరీక్షించారు. అప్పటికే ఆయన చనిపోయారని గుర్తించారు. చివరి ప్రయత్నంగా అత్యవసర విభాగానికి తరలించారు. కృత్రిమశ్వాస కల్పించేందుకు యంత్ర పరికరాలతో మర్దనచేశారు. 15 మంది వైద్య నిపుణులు అరగంట పాటు శతవిధాలా ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో చనిపోయినట్లు ప్రకటించారు. అనంతరం ఆయనను దోమల్‌గూడలోని స్వగృహనికి తీసుకువెళ్లారు.
పీజేఆర్‌ హఠాన్మరణం నగర ప్రజలకు దిగ్భ్రాంతిని కలిగించింది. తమ ప్రియతమ నేత ఇకలేడన్న విషయాన్ని జీర్ణించుకోలేని అభిమానులు ఆగ్రహావేశాలు, ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ సహా కాంగ్రెస్‌ పార్టీ నేతలు, తెలుగుదేశం, తెరాస, వామపక్షాల నేతలు అశ్రునివాళులు సమర్పించారు
కిమ్స్‌లో ఉద్వేగం... వైద్య చికిత్సల కోసం పీజేఆర్‌ను తరలించిన కిమ్స్‌ ఆసుపత్రిలో ఉద్వేగం నెలకొంది. అపస్మారక స్థితిలో ఉన్నట్లు భావించిన పి.జనార్దన్‌రెడ్డిని అంబులెన్స్‌ నుంచి ఆసుపత్రి అత్యవసర సర్వీసుల విభాగానికి తరలించిన వెంటనే కిమ్స్‌ సి.ఇ.ఒ. డాక్టర్‌ బి.భాస్కర్‌రావు నేతృత్వంలోని వైద్యుల బృందం అరగంట పాటు శ్రమించారు. ఫలితం లేకపోవడంతో పీజేఆర్‌ మరణించారంటూ తెలిపారు. మరణవార్త విన్న అభిమానులు, ప్రజలు వేల సంఖ్యలో కిమ్స్‌ ఆసుపత్రికి తరలివచ్చారు. కొందరు ఆవేశంతో మంత్రి షబ్బీర్‌ అలీ, అంజన్‌ కుమార్‌ యాదవ్‌లను అడ్డగించారు. ఎంపీ వీహెచ్‌ జోక్యంతో పీజేఆర్‌ భౌతికకాయాన్ని చూసేందుకు అతికష్టం మీద వారు వచ్చారు. పీజేఆర్‌ మరణవార్తతో సికింద్రాబాద్‌ పరిసర ప్రాంతాలన్నీ రెండుగంటల పాటు వాహనాలతో స్తంభించి పోయాయి.
తరలివచ్చిన నేతలు పీజేఆర్‌ మృతి చెందిన సమాచారాన్ని తెలుసుకున్న రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖులు ఆసుపత్రికి ఇంటికి వచ్చారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌, నేదురుమల్లి దంపతులు, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు, కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి ఇక్బాల్‌ సింగ్‌, కేంద్ర మంత్రులు దాసరి నారాయణరావు, పళ్లంరాజు, రాష్ట్ర మంత్రులు కొణిజేటి రోశయ్య, కొణతాల రామకృష్ణ, రఘువీరారెడ్డి, షబ్బీర్‌అలీ, డాక్టర్‌ గీతారెడ్డి, ముఖేష్‌, ప్రభుత్వ సలహాదారు కె.వి.పి.రామచందర్‌రావు, సీనియర్‌ నేతలు ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్‌ ఎం.సత్యనారాయణరావు, కోదండరెడ్డి, ఎంపీలు వెంకటస్వామి, వి.హనుమంతరావు, తెరాస అధినేత కె.చంద్రశేఖర్‌ రావు, సీపీఐ కార్యదర్శి నారాయణ, ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి, తెదేపా నేతలు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జి.సాయన్న, భాజపా నేతలు దత్తాత్రేయ, విద్యాసాగర్‌రావు, ఇంద్రసేనారెడ్డి, క్రైస్తవ మతప్రచారకుడు కె.ఎ.పాల్‌, సినీ ప్రముఖులు శ్రీహరి, ఎం.ఎస్‌.రెడ్డి, బాబూ మోహన్‌, కార్మిక సంఘాల నేతలు వచ్చారు.
ఇంటి వద్ద శోకసంద్రం కిమ్స్‌ ఆసుపత్రి నుంచి పీజేఆర్‌ భౌతిక కాయాన్ని మధ్యాహ్నం 1.30 గంటలకు తీసుకువచ్చారు. అప్పటికే భారీ సంఖ్యలో అభిమానులు ఇంటికి చేరుకున్నారు. పీజేఆర్‌ మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకువస్తుండగా కుటుంబసభ్యులు, అభిమానుల రోదనలు మిన్నంటాయి. 'అన్నా... అన్నా... మమ్మల్ని వదిలి వెళ్లావా?' అంటూ ఆయన అనుచరులు ఏడుస్తూనే ఉన్నారు. భార్య సులోచన, కుటుంబసభ్యులు షాక్‌ నుంచి ఇంకా తేరుకోలేదు. ఇంటి పరిసర ప్రాంతాల్లో విషాదం అలుముకుంది.
నేడు అంత్యక్రియలు కార్మిక నేత, ఎమ్మెల్యే పి.జనార్దన్‌ రెడ్డి అంత్యక్రియలను శనివారం అంబర్‌పేట శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు కుటుంబ సభ్యులు, సన్నిహితులు తెలిపారు. పీజేఆర్‌ కూతురు అమెరికా నుంచి రావాల్సి ఉంది.
నేడు సెలవు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు ప్రభుత్వం శనివారం సెలవు ప్రకటించింది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే పి.జనార్దన్‌రెడ్డికి అంతిమ నివాళులు అర్పించేందుకు వీలుగా ప్రభుత్వం ఈసెలవు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం జీవో విడుదల అయ్యింది.





No comments: