Friday, December 28, 2007

పేదల మనిషి , Eenadu, 29th Dec.

పీజేఆర్‌కు ప్రముఖుల నివాళి
ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే, సీఎల్పీ మాజీ నేత
పి.జనార్దన్‌రెడ్డి


(పీజేఆర్‌) ఆకస్మిక మరణం పలువురిని కలచివేసింది. ఆయన మృతివార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు జానారెడ్డి, బొత్స సత్యనారాయణ, రఘువీరారెడ్డి, ముఖేష్‌గౌడ్‌, కొణతాల రామకృష్ణ, ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దానం నాగేందర్‌ తదితరులు నివాళులు అర్పించినవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయా నేతలేమన్నారంటే...


*పోరాటపటిమగల నాయకుడు పీజేఆర్‌ అని మంత్రి రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు.
*పేదోళ్ల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఏకైక నాయకుడు పీజేఆర్‌ అని మంత్రి బొత్స సత్యనారాయణ నివాళులర్పించారు.
*పేదలకు, వేలాదిమంది కార్మికులకు నేతగా ఉన్న పీజేఆర్‌ ఇకలేరనే విషయాన్ని ఇంకా నమ్మలేకుండా ఉన్నామని మంత్రి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు.
*శాసనసభాపక్ష నేతగా, మాజీ మంత్రిగా, అంతకుమించి ప్రజల మనిషిగా ఉన్న పీజేఆర్‌ తమకు అత్యంత ఆప్తుడని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ, నేతలు ఇంద్రసేనారెడ్డి, లక్ష్మణ్‌, కిషన్‌రెడ్డి, చింతా సాంబమూర్తి వ్యాఖ్యానించారు.
*పీజేఆర్‌ పేదల పక్షపాతని, పలు ప్రభుత్వ కుంభకోణాలను వెలికితీయడంలో ఆయనతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలున్నాయని సీపీఐ నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి, నారాయణ సంతాప సందేశంలో పేర్కొన్నారు.
*ప్రజా సమస్యల పరిష్కారానికి శాసనసభ బయటా, లోపలా పీజేఆర్‌ విశేషంగా కృషిచేశారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు, శాసనసభాపక్ష నేత నోముల నర్సింహయ్యలు పేర్కొన్నారు.
*తెలంగాణ వాదంపై నిక్కచ్చిగా నిలిచిన ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెరాస అసమ్మతి ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణరెడ్డి అభిప్రాయపడ్డారు.
*పీజేఆర్‌ మృతి పార్టీకి తీరని లోటని పీసీసీ అధ్యక్షుడు జి.ఎస్‌.రావు వ్యాఖ్యానించారు.
* కార్మిక నేతగా కార్మికుల సంక్షేమానికి పీజేఆర్‌ చేసిన సేవలు చిరస్మరణీయమని సీఎల్పీ అభిప్రాయపడింది.
*కార్మిక నేతగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగిన పీజేఆర్‌ మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్‌.చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.
*అట్టడుగు స్థాయి నుంచి ఎదిగిన పీజేఆర్‌ ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉండే నాయకుడని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ పేర్కొన్నారు.
*అంకితభావంతో పనిచేసే నేతను కాంగ్రెస్‌ పార్టీ కోల్పోయిందని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి, రాష్ట్ర మంత్రులు కె.రోశయ్య, జి.చిన్నారెడ్డి, మండలి బుద్ధప్రసాద్‌, ఆనం రాంనారాయణరెడ్డి, కాసు వెంకట కృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.
*పీజేఆర్‌ మరణం కాంగ్రెస్‌ పార్టీకే కాకుండా తనకు కూడా వ్యక్తిగతంగా తీరని లోటని కేంద్ర బొగ్గుశాఖ సహాయ మంత్రి దాసరి నారాయణరావు పేర్కొన్నారు.
*పీజేఆర్‌కు నివాళులు అర్పించేందుకు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి వీరప్ప మొయిలీ శనివారం హైదరాబాద్‌కు రానున్నారు.
*మూడు దశాబ్దాలుగా జంటనగరాల్లో కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధికి, ఆ ప్రాంతంలోని పేదలు, బడుగువర్గాల అభ్యున్నతికి పీజేఆర్‌ ఎనలేని కృషి చేశారని శాసనమండలి ఛైర్మన్‌ చక్రపాణి పేర్కొన్నారు.
*పీజేఆర్‌ ప్రజల మనిషని, తనకు మంచి స్నేహితుడని, ఆయన లేనిలోటు బాధాకరమని తెదేపా నాయకుడు యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు.
*పీజేఆర్‌ హఠాన్మరణంపట్ల హోంమంత్రి జానారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
*కార్మికలోకం మంచి నాయకున్ని కోల్పోయిందని తెదేపా నేత దేవేందర్‌గౌడ్‌ అన్నారు.
నేటి ఆటా వేడుకలు రద్దు: అమెరికా తెలుగు సంఘం (ఆటా-2007) హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన ఆటా వేడుకల తొలిరోజు (శనివారం) కార్యక్రమాలు రద్దయ్యాయి.
రాజకీయ వేధింపులవల్లే మృతి అనుచరుడి ఆరోపణహైదరాబాద్‌, న్యూస్‌టుడే: రాజకీయ వేధింపులు, ఒత్తిడి కారణంగానే పి.జనార్దన్‌రెడ్డి మృతి చెందారని.. పీసీసీ ప్రధాన కార్యదర్శి, పీజేఆర్‌ సన్నిహితుడు జి.నిరంజన్‌ ఆరోపించారు. పార్టీ శ్రేయస్సు కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను పీజేఆర్‌ వ్యతిరేకించారని పేర్కొన్నారు.
- న్యూస్‌టుడే యంత్రాంగం

No comments: